ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత మరియు భవిష్యత్ కొరకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి
ముందు సంస్థాగతంగా బలోపేతం అవ్వండి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగండి
సమస్యలు పరిష్కారం భాధ్యత ఏపీ జేఏసీ అమరావతి చూసుకుంటుంది
చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన, బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి… పట్టించుకోవాలి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘ నాయకుల రాష్ట్రస్థాయి సమావేశంలో ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు.
విజయవాడ (రెవెన్యూ భవన్):- రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో పని చేసే చిరుద్యోగులైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎల్లప్పుడు అండగా ఏపీ జెఎసి అమరావతి ఉంటుందని రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆదివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘ ప్రతినిధులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అరలయ్య, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వి.గిరి కుమార్ తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ఏర్పాటు ద్వారా ఉద్యోగ భద్రత కల్పించిందని, కానీ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగి అతి తక్కువ వేతనానికి పనిచేస్తూ సగటున ప్రతి ఉద్యోగి కష్టాల కడలిలో దీనావస్థలో, కనీసం కుటుంబాన్ని కూడా పోషించుకొలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలియజేశారు.
అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగులతో పాటు గతంలో అన్ని సంక్షేమ పథకాలు వారి కుటుంబ సభ్యులు కు కూడా వచ్చేయి…కానీ ఇప్పుడు వారికీ తీసి వేయడమే కాకుండా , వారి కుటుంబ సభ్యులకు కూడా సంక్షేమ పథకాలు తొలగించడం చాలా బాధాకరమన్నారు.
సంక్షేమ పథకాల విషయమై కనీసం నాలుగో తరగతి స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కైనా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏపీ జెఎసి అమరావతి ఇటీవల తీసుకువెళ్లిందన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత మరియు భవిష్యత్ కొరకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వారి జీత భత్యాలు, సెలవులు, మెడికల్ లివులు, ఇంక్రిమెంట్, చర్యలు తదితర అంశాలు లో క్లారిటీ ఉంటుందని, అన్నీ శాఖలలో ఒకే విధానం అమలు చేయవచ్చని తెలిపారు.
ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగా ప్రత్యేక సర్వీసు రూల్స్ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కోరుతామని తెలియజేశారు.
సంఘం బలోపేతమై కార్యాచరణ రూపొందించుకోండి రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని తద్వారా అన్ని జిల్లాలలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా డివిజన్ స్థాయిలలో కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కమిటీలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ అంతా రాబోయే రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరారు.
తరువాత సమస్యల పరిష్కారం భాధ్యత ఏపీ జేఏసీ అమరావతి తీసుకుంటుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ ప్రతినిధులను కోరారు. డివిజన్, జిల్లా స్థాయిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యంగా ఉంటే రాష్ట్ర సంఘం పరిపుష్టిగా ఉంటుందని, సంఘం బలపడిన తరువాతే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు.
రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలు అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ జేఏసీకి వెన్నుదన్నుగా నిలబడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి గిరి కుమార్ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఆర్లయ్య రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగ ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు.