– తెలంగాణ హామీల అమలుపై నిజాలు చెప్పే ధైర్యం ఉందా?
– మహారాష్ట్ర ప్రజలు రేవంత్ తప్పుడు ప్రచారం నమ్మరు
– మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సవాల్
ముంబై: తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారు.
ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో.. మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను.
ఇచ్చిన హామీల్లో 99% ఇంకా మొదలే కాలేదు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ.. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయి. RR tax పేరుతో ప్రజల నడ్డీ విరుస్తున్నాయి.తెలంగాణలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోంది. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ సర్కారు ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారు.
రాహుల్, సోనియా, ప్రియాంక, రేవంత్ రెడ్డి.. ఊరూరా తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో ఢంకాబజాయించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులెవరూ అప్పులు కట్టొద్దని వారిని రెచ్చగొట్టారు. మేనిఫెస్టోలో మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి నెలకు రూ.2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా ఈ పథకం లబ్ధి అందలేదు.
రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15వేల ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయంకూడా ఏ ఒక్కరికీ చేరలేదు.వివిధ పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు.
బోనస్ ఇవ్వకపోగా కేంద్రప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధరను కూడా ఇవ్వకుండా దళారులతో లూటీ చేయిస్తున్నారు.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదు. కానీ హైదరాబాద్ లో మాత్రం, మూసీ సుందరీకరణ పేరుతో, దశాబ్దాలుగా ఉన్నవారిని ఇండ్లనుంచి బయటకు గెంటేసి, ఆ ఇళ్లు కూల్చేస్తున్నారు.
స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు.యువతకు రూ.5లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నారు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ పథకం లబ్ధి అందలేదు. మేనిఫెస్టోలో మొదటి పేజీలోని పథకాలే అమలుచేయలేని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు రావడం విడ్డూరం, హాస్యాస్పదం.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే.. మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు రూ.4వేల పింఛను ఇస్తామని చెప్పారు. కానీ.. గతంలో ఇచ్చే పింఛను కూడా ఇవ్వడంలేదు. పేపర్లలో భారీగా ప్రకటనలు ఇవ్వడమే తప్ప వాటిని అమలుచేసే శక్తి కాంగ్రెస్ నేతలకు లేదు.
గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా.. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు.తెలంగాణ ప్రజలను మోసం చేశారు.ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసేందుకు.. మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని భావిస్తే, రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా.. ముంబై ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమా? మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను విశ్వసించరు.విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 81,500 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదు. దాదాపు రూ.8లక్షల అప్పులున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ లూటీ చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోంది. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని కోరుతున్నాను.