– హోం గార్డులకు జీతాలు చెల్లించక పోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి.ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు.మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి వీరికి ఏం సమాధానం చెబుతారు?
పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.