– ఎజెండాలోని ఇతర అంశాలపై కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది
– గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుమ్కక్కై క్రిష్ణా నీటిని తాకట్టు పెట్టింది
– జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంల మీటింగ్ కేంద్ర తొలి విజయం
– ఏళ్ల తరబడి నెలకొన్న జలవివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నదే కేంద్ర అభిమతం
– కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సమానమే
– బీజేపీలో గ్రూపుల్లేవ్… ఉన్నదల్లా మోదీ గ్రూపే
– పార్టీ కోసం కష్టపడే వారందరికీ నిధులిస్తున్నా…
– గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు
– పార్టీ కోసం పనిచేయకుండా బండి సంజయ్ వర్గమని మాట్లాడినా టిక్కెట్లు రావు
– ఫోన్ ట్యాపింగ్ కేసులో 24న సిట్ ముందు విచారణకు హాజరవుతున్నా…
– కాళేశ్వరంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అధికారుల అక్రమాస్తులే నిదర్శనం
– కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం భారీ ఎత్తున దోచుకుంది
– సైకిళ్ల పంపిణీ చాలా మంచి కార్యక్రమం
– టెన్త్ చదివే వాళ్లందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తా…
– హుజూరాబాద్ లో గ్రూపు తగదాలు, కాళేశ్వరం, బనకచర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హుజూరాబాద్: బనకచర్ల విషయంలో ఇరు రాష్ట్రాలు తలో మాట చెప్పడం ఏ మాత్రం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నెలకొన్న జల వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిందన్నారు. ఇరు రాష్ట్రాలు వేర్వేరు ఎజెండాలతో సమావేశానికి హాజరయ్యానని, అయినప్పటికీ ఆయా ఎజెండాలలోని అంశాలపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఎక్స్ పర్ట్ కమిటీని నియమించిందన్నారు. కేంద్రం సాధించిన తొలి విజయమిది అని పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, స్థానిక నేతలతో కలిసి మాట్లాడారు. ఏమన్నారంటే…
సంతోషదాయకం. కేంద్రం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఏళ్ల తరబడి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలున్నాయి. దీనిన బూచిగా చూపి కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. అందుకే ఈ వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఫెసిలిటేటర్ పాత్రను పోషించింది. నిన్న మీటింగ్ తరువాత రెండు రాష్ట్రాల సీఎం, మంత్రులు బనకచర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యమేసింది. లోపల ఏం జరిగిందో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టం చేయాలి. నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
వాస్తవానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరుగా సొంత ఎజెండాతో మీటింగ్ కు వెళ్లారు. కేంద్రానికి ఇరు రాష్ట్రాలూ సమానమే. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే ఇరు రాష్ట్రాల సీఎంతో మీటింగ్ పెట్టింది. ఇది కేంద్రం సాధించిన విజయం. కేంద్రానికి సొంత ఎజెండా లేదు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే కేంద్ర ఉద్దేశం. ఇరు రాష్ట్రాల ఎజెండాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆయా ఎజెండాలలోని అంశాలపై ఉన్నతాధికారులు, నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే ఆ కమిటీ ముందు హాజరై ఆయా అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేయాలని కోరుతున్నా. కేంద్రం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా కనీసం ఇరు రాష్ట్రాల సీఎంలు కనీసం కృతజ్ఞతలు తెలపకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.
జల వివాదాలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు విడ్డూరం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీలో నాటి ప్రభుత్వంతో కుమ్కక్కై క్రిష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా అదే పంథాలో ఉన్నట్లుంది. అందుకే రెండు పార్టీలు కలిసి బనకచర్లపై లేనిపోని వివాదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల పాలనవల్ల తెలంగాణ ప్రజలకు ఒనగూరిందేమీలేదు.
బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే అందజేస్తానంటే కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదించే బాధ్యతను మేం తీసుకుంటాం. అట్లా కాకుండా 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. బీసీల ముసుగులో తెలంగాణలో ముస్లింలందరికీ నూటికి నూరుశాతం రిజర్వేషన్లు అందించే కుట్ర జరుగుతోంది.
రాష్ట్రంలో 51 శాతం బీసీ జనాభా ఉంది. అందులో 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తాననడం ఎంత వరకు కరెక్ట్? అందులోనూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ బీసీలకు ఒనగూరిస్తోంది ఏమిటి? కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి బీసీల పొట్ట కొట్టారు. ఇక 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు అమలు చేస్తే ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరగబోతోంది. బీసీ సంఘాలు వీటిని గమనించాలని కోరుతున్నా.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ అధికారుల అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏసీబీ దాడుల్లో వందల కోట్లు పట్టుపడుతున్నాయి. కాళేశ్వరంలో అంచనాల పెంచి ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందో వీళ్లను చూస్తే అర్థమైతోంది. ఇవిగాకాకుండా డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ సహా కేసీఆర్ కుటుంబంపై ఎన్నో అవినీతి కేసులున్నా… గత 19 నెలలుగా ఒక్కటంటే ఒక్క కేసు విషయంలోనూ కేసీఆర్ కుటుంబాన్ని దోషులుగా తేల్చలేకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలకు ఇది నిదర్శనం. రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. తక్షణమే కాళేశ్వరంసహా బీఆర్ఎస్ అవినీతి స్కాంలపై సీబీఐ విచారణ కోరితే జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 24న విచారణకు రావాలని సిట్ పోలీసుల నుండి సమాచారం వచ్చింది. ఈనెల 24న విచారణకు హాజరవుతా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నాకు తెలిసిన వాస్తవాలన్నీ సిట్ ముందుంచుతా.
భారతీయ జనతా పార్టీలో ఏ గ్రూపు లేదు. ఉన్నదల్లా మోదీ గ్రూప్. బీజేపీ గ్రూప్. బీజేపీలో ఈ వర్గం ఆ వర్గమంటూ ఉండదు. జెండా కోసం, పార్టీ కోసం పనిచేయాలి. అంతే తప్ప వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రసక్తే లేదు. బండి సంజయ్ వర్గమైనా సరే… ఇంకే వర్గమైనా సరే. ఉపేక్షించే ప్రసక్తే లేదు. టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. అసలు బీజేపీలో వర్గాల ఊసే లేదు. ఎక్కడా లేనిదే ఇక్కడే ఫలానా వర్గమనే వాదనలు ఎందుకొస్తున్నయ్.
ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్లలో ఇంతకుముందు ఎవరితో ఉన్నారో మీకు తెలుసు? ఇప్పుడు వీళ్లంతా పార్టీలోనే ఉన్నారు కదా? అంతెందుకు ప్రతి గ్రామంలో ఏ వర్గం వాళ్లు వచ్చినా సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్లను గుర్తించి వాళ్లకు ఎంపీ లాడ్స్, ఈజీఎస్ నిధులను అందిస్తున్నా. పార్టీ కోసం కష్టపడే వారిని గెలిపించే బాధ్యత మాపై ఉంది. అందుకే తెలంగాణలో అత్యధికంగా 219 కోట్ల రూపాయల సీఆర్ఐఎఫ్ నిధులను కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తున్నా.
ఈసారి మరో రూ.150 కోట్లదాకా సీఆర్ఐఎఫ్ నిధులు తీసుకురాబోతున్నా. అట్లాగే అడిగిన వాళ్లందరికీ బోర్లు వేయిస్తున్నా. అయితే కొందరు కావాలనే గిరిగీసుకుని ఫలానా వర్గమని మాట్లాడితే మాత్రం వాళ్లకు టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. అది బండి సంజయ్ వర్గమైనా సరే. ఇకనైనా అట్లాంటి వర్గాలను పక్కనపెట్టి అందరూ కలిసి ఒకేతాటిపైకి రావాలి. మీకు ఇంకో విషయం చెప్పాలే. పార్లమెంట్ ఎన్నికల్లో నేను 2.25 లక్షల మెజారిటీతో గెలిచానంటే దానికి కారణం కార్యకర్తలు పడ్డ కష్టమే.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. అంతెందుకు జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ఒకప్పుడు నాకు వ్యతిరేకంగా పనిచేశారు. కానీ విద్యార్థి దశ నుండే ఆయన కమిట్ మెంట్ ఏమిటో నాకు తెలిసి. అందుకే అధ్యక్ష పదవి ఇచ్చినం. దయచేసి ఇట్లాంటి వాటిని మీడియా కూడా ప్రోత్సహించొద్దని కోరుతున్నా.