• అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేనేత వస్త్రాలు
• చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
• ప్రజల్లో కూడా చేనేత వాడకంపై మమకారం పెరుగుతుంది
• నేతన్నలకు 90 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందజేత
• నేతన్న కుటుంబానికి నెలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
– రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి ఎస్. సవిత
విజయవాడ: దేశంలో అన్ని ప్రాంతాల నుంచి విభిన్న రకాల చేనేత వస్త్రాలను నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా చేనేత మరియు హస్తకళల ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి ఎస్. సవిత తెలిపారు. నగరంలో శ్రీ శేష సాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన “గాంధీ బునకర్ మేళా” (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2025) ను గురువారం మంత్రి ఎస్. సవిత, ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైందన్నారు. నేతన్నల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేతన్నలను ఆదుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి నెలా చేనేత, హస్తకళల అభివృద్ధికి ఎగ్జిబిషన్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా తయారీదారులే ప్రత్యక్షంగా చేనేత ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే చేనేత వస్త్రాలు లభిస్తాయన్నారు.
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు చేనేతకు ఆదరణ కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నేతన్నలకు నెలకు రూ. 4,000 పెన్షన్ ను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా 90 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందించటంతోపాటు లేటెస్ట్ డిజైన్స్ కు సంబంధించి శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు.
ఆప్కో ద్వారా పలు డిజైన్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రజల్లో కూడా చేనేత వస్త్రాలు ధరించేలా అవగాహనకు వస్తున్నారన్నారు. నేతన్నలను ఆదరించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతి వారం చేనేతను ధరిస్తున్నారన్నారు. దీనివల్ల చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెరిగి, నేతన్నల్లో ధైర్యంతోపాటు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. ప్రతి నేతన్న కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకూ విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నామన్నారు.
చేనేత ఉత్పత్తులపై నేతన్నలకు వీవర్ కార్డులు అందిస్తున్నామని, దీనివల్ల చేనేత ఉత్పత్తుల తయారీ తెలుసుకోవచ్చన్నారు. యువత, మహిళలు, చిన్న పిల్లలను ఆకట్టుకునేలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత దుస్తులను ఆన్ లైన్ లో ఉంచటంతోపాటు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామన్నారు.