– సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఉమ్మడి కృషితో గెలిచిన ఉప ఎన్నిక
– మంత్రులను డివిజన్ల వారీగా మోహరించిన సీఎం రేవంత్రెడ్డి
– పార్టీ నేతలను ప్రచారంలో దింపిన మహేష్కుమార్ గౌడ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జోడెద్దులు కలసి కాంగ్రెస్ను గెలిపించాయి. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్, సీఎం రే వంత్రెడ్డి ఉమ్మడి కృషి, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించింది. ఉప ఎన్నిక మొదలయినప్పటి నుంచీ ప్రచారం ముగిసే వరకూ.. వారిద్దరూ ఎవరి స్థాయిలో వారు, పార్టీ అభ్యర్ధి విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. కాబట్టి జూబ్లీహిల్స్ విజయం జోడెద్దులదేనన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం, రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని ప్రతిబింబిస్తోందని టీపీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకంలో సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికలు ఈ విజయానికి ప్రధాన కారణమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే పార్టీకి గ్రాండ్ విక్టరీ అందించడం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది.
ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి..మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఆఫీస్ బేరర్స్తో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, స్పష్టమైన దిశా నిర్దేశంతో గెలుపు దిశగా నడిపించారు. ఎన్నికల ప్రక్రియ అంతటా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేయింబవళ్ళూ శ్రమించి, ప్రతీ బూత్, ప్రతీ డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి పోల్ మేనేజ్మెంట్ను కచ్చితమైన శైలి లో మలిచారు.
ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారి సమన్వయం, సీఎం–టీపీసీసీ చీఫ్ కలిసి నిర్వహించిన తరచు జూమ్ సమావేశాలు, నేతలతో నిరంతర కమ్యూనికేషన్ ఈ విజయాన్ని మరింత బలపరిచాయి. పార్టీ వ్యూహాలు, ఏరియా వైజ్ పర్యవేక్షణ, గ్రౌండ్ లెవెల్లో కేడర్కు ఇచ్చిన దిశానిర్దేశం అన్ని కలిసి పనిచేయడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించగలిగింది. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో టీపీసీసీ చీఫ్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. ఈ విజయం రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచుతున్న విశ్వాసానికి నిదర్శనం కాగా, రాబోయే రోజుల్లో కూడా సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేయడానికి ఈ ఫలితం ప్రేరణగా మారనుంది.