ఎంపీలు ఏం చేస్తున్నారు?

– అమిత్‌షాకు అన్నీ వివరిస్తూనే ఉన్నా
– జగన్ సర్కారుకు వారమే డెడ్‌లైన్
– విశాఖలో జగన్ సర్కాపై పవన్ ఫైర్
విశాఖ పర్యటనలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ అమిత్‌షాకు వివరిస్తూనే ఉన్నానన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవీటీకరణను అడ్డుకోలేని ఎంపీల అసమర్ధతను పవన్ కడిగేశారు. వారంలోగా అఖిలపక్షం ఏర్పాటుకు డెడ్‌లైన్ విధించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు నిరసనగా గళమెత్తిన పవన్ పర్యటనకు, జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఆయనకు దారిపొడవునా జనసైనికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన తాను కార్మికపక్షమేనని స్పష్టం చేశారు. నమ్మించి ఎన్నుకున్న ఎంపీలు ఢిల్లీలో ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని కన్నెర చేశారు. ఇప్పటికయినా జగన్ ప్రభుత్వం వారంలో అఖిలపక్ష ం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. ఓట్ల సమయంలో మాత్రమే కనిపిస్తారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌కి భూములు ఇచ్చినవారికి ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు.
‘‘ఢిల్లీలో ఉన్నవాళ్లకి ఏం తెలుస్తుంది. 25 మంది ఎంపీలు విశాఖకు గనులు కావాలని ఎందుకు అడగలేదు. మనకు కులాలు, వర్గాలు మాత్రమే ముఖ్యమే . కరోనా సమయంలో దేశాన్ని ఆదుకున్న విశాఖ ఉక్కు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలి. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయింది. నా వెంట ప్రజలున్నారనే కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారు. నష్టాలు లేని వ్యాపారం అంటూ ఏదీలేదు. 18 వేల మంది రైతులు భూములు వదులకుంటే వచ్చింది విశాఖ ఉక్కు. 1971లో విశాఖ ఉక్కుకు శంకుస్థాపన, 1992లో జాతికి అంకితం. నాటి నేతల రాజీనామాలతోనే ఉక్కు సంకల్పం సాధ్యమైంది. విశాఖ ఉక్కు కోసం 32 మంది యువకులు బలిదానం. కులాలు, వర్గాలకి అతీతమైన నినాదం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. మౌలిక సదుపాయల రంగానికి కీలకం ఉక్కు కర్మాగారం.’’ అన్నారు.కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా అని అన్నారు.
నేను సైతం….
నేను సైతం అంటూ శ్రీశ్రీ కవితతో తన ఉపన్యాసాన్ని ఆయన ప్రారంభించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అది భావోద్వేగ నినాదమన్నారు. స్టీల్ ప్లాంట్ప్రవేటీకరణ నిర్ణయం బాధేసిందన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి ఉక్కు కీలకమన్నారు.
వారం గడువు….
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వానికి వారం గడువు ఇస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ‘‘చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభం. వైసీపీ మాటలకు అర్థాలు వేరులే. చెప్పినమాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం. వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలు. జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏదీ మనది అనిపించదా?. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలి.’’ అని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

Leave a Reply