-రాజీనామాలకు వెనకాడబోము
-మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
విశాఖపట్నం పాలనా రాజధాని కోసం దేనికైనా తాము సిద్ధమని, అందుకు ముఖ్యమంత్రి మాట కోసం ఎదురుచూస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని కోరుతూ వికేంద్రీకరణకు మద్దతుగా నరసన్నపేట ప్రధాన రహదారి వైయస్సార్ కూడలిలో రిలే నిరాహార దీక్షలును ఆయన శనివారం ప్రారంభించారు. వందలాదిగా చేరుకున్న కార్యకర్తలతో కలిసి ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశాఖ రాజధాని కావాల్సిందే అంటూ ప్ల కార్డులు చేతబూని నినాదాలు చేస్తూ హోరెత్తించిన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. విజేంద్రీకరణ వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. ముఖ్యమంత్రి తమ పట్ల అనుకూలంగా ఉన్నారనీ, ప్రజల కోసం అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. అనేక దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రకు సీఎం జగన్ సారథ్యంలో తొలిసారి న్యాయం జరగబోతోందని చెప్పారు. వికేంద్రీకరణ అనేది విజ్ఞత గల మా నాయకుని ఆలోచన అని, అనురావతికి మద్దతు ఇస్తున్న టీడీపీ నేతలను ఉద్దేశించి వారి కడుపులు ఇప్పటికే నిండాయి, మా ఆశలు చంపొద్దని అన్నారు.
ఉత్తరాంధ్ర అంటే విశాఖ జగదాంబ సెంటర్ ఒకటి మాత్రమే కాదని తమ గ్రామాలకు వచ్చి చూసి తమ దయనీయ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. సరసన్నపేటలో ఐదు రోజులు పాటు దీక్షలు కొనసాగుతాయనీ, తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ వెనుకబడిన స్థితిలో ఉన్న తమను వెక్కిరించేందుకు మహా పాదయాత్ర పేరుతో అరసవెల్లికి వస్తారా? విశాఖ రాజధాని వద్దు అంటూ ఇక్కడకు వచ్చి చెబుతారా! ఇది సమంజసమేనా? అని ప్రశ్నించారు. వికేంద్రీకరణ నినాదం ఉద్యమ స్థాయికి వెళ్తుందన్నారు. విశాఖకు రాజధాని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని నిలదీశారు. అవసరమైతే ప్రజలతో రోడ్లు ఎక్కుతామనీ, ప్రజా ఉద్యమాలను తీవ్రస్థాయిలో చేపడతామని హెచ్చరించారు.
అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అయితే లక్షల కోట్ల పెట్టుబడి ఒక్కచోటే పెట్టడానికి తాము ఎప్పటికీ వ్యతిరేకమన్నారు. విశాఖ రాజధాని వద్దన్న ప్రతి ఒక్కడు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం మరో సారి విడిపోకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఒకటే మార్గమని వివరించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అత్యంత వెనుక బాటుకు గురైన ప్రాంతాలనీ, చంద్రబాబుకు ఎంతసేపూ స్వార్థ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి తప్ప ప్రజా ప్రయోజనాలు కావనీ వారిని మరోసారి బాదెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, డిసిసి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు. నరసన్నపేట ఎంపీపీ అరంగి మురళీధర్, పోలాకి మండల పరిషత్తు ప్రత్యేక ఆహ్వానితులు ముద్దాడ బైరాగి నాయుడు, సరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురెళ్ళ శంకర్, పోలాకి మండల పార్టీ అధ్యక్షులు కణితి కృష్ణారావు, సుడా చైర్పర్సన్ ప్రతినిధి కేసీహెచ్బి గుప్త, జెడ్పీటీసీ ప్రతినిధి చింతు రామారావు, పొందర కూరాకులు కార్పొరేషన్ చైర్ పర్సన్ ప్రతినిధి రాజావు అప్పన్న, కో ఆప్షన్ మెంబర్ షేక్ బాషా, వైసీపీ నాయకులు పతివాడ గిరీశ్వర్రావు, తోట అప్పారావు, చింతాడ ఉమా మహేశ్వరరావు, తూలుగు అశోక్, బొబ్బది ఈశ్వరరావు, బగ్గు రమణయ్య, సురంగి నర్సింగరావు, అవ్వ రవి, రెంటికోట త్రినాధ్, కలగదండు తాతారావు, సనపల సోమేశ్వరరావు, రావాడ అప్పనురాజు, పొన్నన తవిటి రాజు తదితరులు పాల్గొన్నారు.