చంద్రబాబు భయాలకు కారణాలున్నాయి!

-భయపడుతూనే ఏపీ పాలకపక్షానికి భయం పుట్టించాలంటున్న చంద్రబాబు భయాలకు కారణాలున్నాయి!
(ఎంపి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఇష్టారాజ్యంగా అధికారం చెలాయించిన నారా చంద్రబాబు నాయుడుకు నిజంగానే భయం పట్టుకుంది. అందుకేనేమో, ‘ఈ ప్రభుత్వానికి భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని మనమే పుట్టించాలి,’ అంటూ మొన్నీమధ్య విజయనగరంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు ‘దిశానిర్దేశం’ చేశారు ఈ పెద్ద మనిషి. ప్రజారంజకంగా, ఏ మాత్రం దిగులు లేకుండా పరిపాలిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ఈ దివాళాకోరు పార్టీ భయం పుట్టించడం అసలు జరిగే పనేనా?

కానీ, ఊహల్లో విహరిస్తున్న టీడీపీ నేత మాత్రం అధికారం లేదనే కుంగుబాటుతో జావగారిపోతున్న పార్టీ కార్యకర్తలను అరాజక మార్గంలో నడిపించడానికి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జనసంక్షేమమే లక్ష్యంగా సాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి భయాందోళనలు, అనుమానాలు లేకుండా ముందుకు సాగుతోంది. చక్కటి కార్యక్రమాలతో నిరంతరం ప్రజల మధ్యనే పనిచేస్తూ ఏడాది నాలుగు నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవడానికి సమాయత్తమౌతోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా అధికార వికేంద్రీకరణతో ప్రజల గడపలకే పాలన తీసుకొస్తోంది.

ఇవేమీ కళ్లతో చూడలేని చంద్రబాబు అధికారం కోసం అలమటించిపోతున్నారు. మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం గెలుపు నీటి మీద రాతేనని తెలిసినా పార్టీని బతికించుకోవడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలో తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుంటే–‘ ప్రస్తుత ప్రభుత్వం పాలనలో మీలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?’ వంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో తన రోడ్‌ షోలకు వచ్చిన వారిని వేధిస్తున్నారు.

ఈ 72 ఏళ్లు దాటిన వృద్ధ రాజకీయ నాయకుడు ఏం చెబుతాడో చూద్దామని వచ్చిన జనానికి చంద్రబాబు గారు కనీసం వినోదం అయినా పంచకుండా దిక్కుమాలిన ప్రశ్నలతో, అడ్డగోలు ‘పిలుపుల’తో విసిగిస్తున్నారు. ‘ఇదేం ఖర్మరా, బాబూ!’ అని ప్రేక్షకులు విలవిలలాడిపోయేలా సాగుతున్నాయి టీడీపీ చివరి సీఎం గారి ప్రసంగాలు. అయితే, 2014–19 మధ్యకాలంలో ఉత్తరాంధ్రకు అంతులేని ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే రీతిలో మొసలి కన్నీరు కారుస్తున్నారు.

నవ్యాంధ్రలో ఐదేళ్ల బాబుగారి పాలనకు, ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం జనరంజకంగా నడుస్తున్న తీరుకు మధ్య తేడాను గుర్తించలేనంత అమాయకులు కాదు ఆంధ్రాజనం. బాబు వస్తే..జాబు సంగతి దేవుడెరుగు, కనీసం ప్రశాంతంగా, ఆర్థిక, సామాజిక సమస్యలు లేకుండా బతికే అవకాశం ఉండదని వారికి తెలుసు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత అనవవసర బెదిరింపులు, ఆక్రందనలు కట్టిపెట్టి పార్టీకి కనీసం రెండు సీట్లయినా వచ్చేలా శ్రమపడితే మంచిది.

Leave a Reply