-ఇయాళ, రేపు పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించండి
-ఎల్లుండి జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు ఇవ్వండి
-ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుదాం
-జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా నేతలకు బండి సంజయ్ ఆదేశం
-బూత్ స్వశక్తీకరణ అభియాన్, మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను సక్సెస్ చేయాలని పిలుపు
వడగండ్ల వానతో రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి కోలుకోని విధంగా దెబ్బతిన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీజేపీ నేతలంతా రైతులకు అండగా నిలవాలని కోరారు. అందులో భాగంగా ఇరోజు, రేపు జిల్లా నేతలంతా దెబ్బతిన్న పొలాల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఆ వివరాలతో నివేదిక రూపొందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఎల్లుండి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుండి వచ్చే స్పందనను బట్టి బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
బండి సంజయ్ కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుల, ఇంఛార్జీలు, కిసాన్ మోర్చా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి పాల్గొన్న ఈ టెలికాన్ఫరెన్స్ లో వడగండ్ల వానతో నష్టపోయిన రైతును ఆదుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు ఈనెల 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్, బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాలపై చర్చించారు.
వరుసగా కురుస్తున్న వడగండ్ల వానలతో రాష్ట్ర రైతాంగంపై కోలుకోని దెబ్బపడింది. చేతికొచ్చిన పంట చాలాచోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. అసలే దోమకాటుతో ఈ ఏడాది రైతులు ఎకరానికి రూ.20 వేల అదనపు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకుంటే వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నాశనమవ్వడంతో రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఇగ కౌలు రైతుల బాధ వర్ణణాతీతం. అప్పు తెచ్చి కౌలుకు తీసుకుంటే చేతికొచ్చిన పంట నష్టపోవడంతో అప్పులెలా తీర్చాలో… కౌలు పైసలు ఎట్లా కట్టాలో? కుటుంబాన్ని ఎట్లా నెట్టుకురావాలో అర్ధం కాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.
గత నెల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టపోతే… ఎకరానికి రూ.10 వేలు సాయం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు నయాపైసా ఇయ్యలేదు. ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరిచి ఉంటే 30 నుండి 50 శాతం మంది రైతులు ఈరోజు పంట నష్టపోయే వాళ్లు కాదు… లేటుగా కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల విధిలేక పంట కోతలు లేటుగా ప్రారంభించడంతో వడగండ్ల వానకు మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా రైతులకు అండగా నిలవాలి. తక్షణమే మీరంతా ఇయాళ, రేపు పంట పొలాలను సందర్శించి పంట నష్టం వివరాలను సేకరించండి. రైతులకు భరోసా ఇవ్వండి. ఎల్లుండి జిల్లా కలెక్టర్లకు పంట నష్ట సాయంపై వినితి పత్రం అందజేయండి. ప్రభుత్వం నుండి వచ్చే స్పందనను బట్టి ఆందోళన కార్యక్రమాలను రూపొందిద్దాం.
ఈనెల 30న ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కేంద్రాలను ఏర్పాటు చేసి టీవీ, స్క్రీన్లు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమాలు వీక్షించేలా చూడాలి. అట్లాగే ఇప్పటి వరకు చేపట్టిన బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాల వివరాలను రేపటిలోగా పంపించాలని ఆదేశించారు.