Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత

– పాలనలో విఫలమైన బాబు ప్రభుత్వం
– ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ముడుపులు
– కేసులకు ఏ మాత్రం భయపడొద్దు
– ఈ ప్రభుత్వ దుర్మార్గాలు చూసి నాలోనూ మార్పు వచ్చింది
– కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది
– మనల్ని అభిమానించేవాళ్లు ఇబ్బంది పడుతున్నారు
– వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
– ఎక్కడ ఏం జరిగినా నాతో నేరుగా చెప్పండి
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు, రీజినల్‌ కోఆర్డినేటర్ల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..: చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్‌ కోఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఆ పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో బావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం.

ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనే విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్‌ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి, ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్ధితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆరోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. అదీ మోసంగా తయారైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది.

చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు వరకు మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. ఇప్పుడు ఆ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేశాడు. అది ఒకటైతే.. చంద్రబాబు చెప్పింది చేయకపోవడం రెండో అంశం. అందుకే ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్‌ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారు అంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.

ఇలాంటి సమయాల్లో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. వారానికి మూడు రోజులు మీరు కచ్చితంగా మీ మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. మీకు కేటాయించిన జిల్లాల్లో మీరు వారానికి మూడు రోజులు ఉంటేనే జిల్లా మీద పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం.

పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లాగా పని చేయాలి. లేకపోతే రాజకీయం చేయలేం. కలియుగం పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియగంలో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో భయపడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం.

ఈ రోజు 99.99 శాతం గ్రామస్ధాయిలో కేడర్‌ కూడా, నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్‌ బుక్‌ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామస్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్ధితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్ధితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది. ప్రజలు కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు.

ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్లకు ఏదైనా చేసిన తర్వాతనే మిగిలినవి అన్న ఆలోచనకు నేను వస్తున్నాను. అలా రాక తప్పుదు. చంద్రబాబు హయాంలో ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మనం కూడా మన ప్రయారీటీస్‌కు అనుగుణంగా కచ్చితంగా పని చేయాలి. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్దాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా నేను చెప్పిందే చేస్తాను. చేయలేనిది చెప్పను. ఎప్పుడైనా చెప్పినవి మాత్రం నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. జగన్‌ 2.0లో ఈ మాదిరిగా ఉండదు. వేరే రకంగా ఉంటుంది అని స్పష్టంగా చెబుతున్నాను.

మనల్ని అభిమానించే వారని కొడుతున్నారు. వాళ్లు దెబ్బలు తింటున్నారు. వారిని ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయి. అది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే వచ్చే దఫా ఇలా ఉండదు. మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్‌ ధైర్యంగా నిలబడింది. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్రమైన అగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తున్నారు.

LEAVE A RESPONSE