మళ్లీ గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించిన గొల్ల, కురుమలకు సబ్సిడీ పై గొర్రెల పంపిణీ 2 వ విడత కార్యక్రమం శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంచిర్యాల జిల్లాలో ప్రారంభించనుండగా, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ప్రారంభిస్తారు.

అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో కూడా 2 వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆయా జిల్లాల మంత్రులు, MP లు, MLC లు, MLA లు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు గొర్రెల యూనిట్ల ను పంపిణీ చేస్తారు. కులవృత్తులను ప్రోత్సహించాలి…గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుండి రూపొందినదే గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం.

ఈ పథకానికి స్వయంగా ముఖ్యమంత్రే రూపకల్పన చేశారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్దికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకం దారుల సొసైటీ లలో సభ్యత్వం కల్పించింది.

వీరికి 20 గొర్రెలు, ఒక పొటేలు కలిపి ఒక యూనిట్ గా, ఒక్కో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇందులో ప్రభుత్వం 75 శాతం(93,750 రూపాయలు), లబ్దిదారుడి వావాటాధనం 25 శాతం (31,25౦ రూపాయలు) చెల్లించాలి. మొదటి విడతలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 3 లక్షల 93 వేల 552 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వ వాటా నిధులు 3 వేల 751 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటాదనం 1250 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

గొర్రెల ధరలు పెరిగిన కారణంగా 2 వ విడతలో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయల నుండి 50 వేలకు పెంచి ఒక ఒక లక్ష 75 వేల రూపాయలు చేయడం జరిగింది. ఇందులో ఒక్కో యూనిట్ కు ప్రభుత్వ వాటాధనం ఒక లక్ష 31 వేల 25౦ రూపాయలు కాగా, లబ్దిదారుడి వాటా 43,75౦ రూపాయలు ఉన్నది. నేటి నుండి ప్రారంభించే 2 వ విడత లో 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 6085 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది.

ఇందులో ప్రభుత్వ వాటాధనం 4,563.75 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటాధానం 1521.25 కోట్ల రూపాయలు ఉంటుంది. లబ్దిదారులకు గొర్రెల యూనిట్ తో పాటు గొర్రెల కు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. గొర్రె చనిపోతే ఇన్సురెన్స్ క్లెయిమ్ గా గొర్రెను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అవసరమైన మందులు, కొనుగోలు ప్రాంతం నుండి లబ్దిదారుడి ఇంటి వరకు గొర్రెలను తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

Leave a Reply