ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననంపైనే జగన్ శ్రద్ధ

ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననంపై జగన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాలను కాపాటంలో లేదు
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననంపైనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడటంలో లేదు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 12 మంది మృతి చెందారు. 57 మంది గల్లంతయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడటంలో జగన్ రెడ్డి విఫలమయ్యారు.
సొంత జిల్లానే ముంచేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. మున్సిపల్ ఎన్నికలకు 3 రోజుల ముందే దొంగ ఓటర్లను ఇళ్లల్లో దాచేసిన జగన్మోహన్ రెడ్డి.. వర్షాలు వరదలపై ముందే హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కాదా? కడప జిల్లాలోని పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులను ముందుగానే ఎందుకు ఖాళీ చేయించలేదు?
వరదల ధాటికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. పింఛలో కొత్తగా నిర్మించిన రింగు బండ్ కొట్టుకుపోయింది. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ సమూల మార్పులు చేయాలని నిపుణులు సూచించినా పట్టించుకోలేదు. అన్నమయ్య ప్రాజెక్టుకు అదనపు గేట్లు పెట్టాలని సిఫార్సు చేసినా నిర్లక్ష్యం వహించారు. పింఛ ప్రాజెక్టు రింగ్ బండ్ కు గతేడాదే గండ్లు పడ్డాయి. అయినా పట్టించుకోలేదు. జలశయాల నిర్వహణపై జగన్ రెడ్డి అంతులేని నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పులిచింతల గేటు కొట్టుకుపోయి వరదనీరు సముద్రంపాలైంది. ఫ్లడ్ మేనేజ్ మెంట్ లో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. ఆర్టీజీఎస్ ను సరిగా ఉపయోగించుకోలేదు. చంద్రబాబు గారి ప్రకృతి విపత్తులు, హుద్ తుఫాన్ల సమయంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడటం జరిగింది. టీడీపీ హయాంలో.. హుదూద్, తిత్లీ, లైలా వంటి తుఫాన్లు సంభవించినా.. చంద్రబాబు గారు బస్సులోనే ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలను స్వయంగా పరిశీలించారు.
హుదూద్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన విశాఖలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. విశాఖ నగరాన్ని వారం రోజుల్లోనే చక్కదిద్ది.. నయా విశాఖను ప్రజలకు చూపించారు. గంటల వ్యవధిలో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిత్యావసరాలు పంచారు. తిత్లీ సమయంలో శ్రీకాకుళంలో విచ్ఛిన్నమైన విద్యుత్ వ్యవస్థను రికార్డు టైంలో మరమ్మతులు చేశారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారందరికీ గంటల వ్యవధిలో పరిహారం అందించడం చంద్రబాబు గారికే చెల్లింది.
కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇంటి నిర్మాణానికి, లేదా ఇతర ప్రాంతాల్లో శాశ్వత నివాసానికి చంద్రబాబు గారు కృషిచేశారు. తిత్లీ, పెథాయ్ తుఫాన్లలో పంట దెబ్బతిన్న ధాన్యం రైతులకు హెక్టారుకు పరిహారం రూ 15 వేల నుంచి రూ.20 వేలకు పెంచి అందజేశారు.. ఇందుకు రూ.3,608 కోట్లు వెచ్చించడం జరిగింది. ఇప్పుడు జగన్ రెడ్డి ఆర్భాటంగా అందరి మెప్పు పొందడం కోసం మోసపూరిత హామీలిచ్చి.. అమలు చేసే సమయంలో, బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో మొండి చేయి చూపుతూ వంచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలతో పలు ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం ఏర్పడింది. మెట్ట పంటలతో పాటు కోత దశలో ఉన్న వరి కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట రైతన్న కళ్ల ముందే కొట్టుకుపోయింది. మొత్తంగా 3.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తక్షణమే పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి.

Leave a Reply