అమరావతి ఒక కుల రాజధాని మాత్రమే

– రాయలసీమ,ఉత్తరాంధ్రలు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదన్నదే బాబు కుట్ర
– ఉత్తరాంధ్ర, రాయలసీమ మీద దండయాత్ర ఇది
– తన బినామీలతో చంద్రబాబు చేయిస్తున్న నకిలీ ఉద్యమం ఇది
– బాబులా, కులం, ప్రాంతం అభివృద్ధిని కాంక్షించేవాడు ప్రజా నాయకుడు కాలేడు
– టిడీపీ హిడెన్ ఎజెండాకు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, కమ్యునిస్టులు మద్దతా..?
– రేణుకా చౌదరికి ఆంధ్రా రాజకీయాలతో పనేంటి..?
– విభజనకు అనుకూలంగా ఓటు వేసిన ఆమె రాష్ట్ర ప్రజలందరికీ ఉమ్మడి శత్రువు
-: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

బాబు బినామీల నకిలీ ఉద్యమం అది
రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకునేందుకు, రాయలసీమ, ఉత్తరాంధ్రలు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదనే లక్ష్యంతో.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలో భాగమే.. అమరావతి రాజధానిపై రాద్ధాంతం, ఈ పాద యాత్రలు. రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే అని, అక్కడ మాత్రమే రాజధాని నిర్మాణం జరగాలని, మిగతా ప్రాంతాల్లో ఏ అభివృద్ధి జరగకూడదనేది చంద్రబాబు ఉద్దేశం. అందులో భాగంగానే తన బినామీ రైతులుతో చేయిస్తున్న నకిలీ ఉద్యమం ఇది. రాష్ట్ర నాయకుడు ఎవరైనా సరే.. రాష్ట్ర ప్రజల సంపూర్ణ అభివృద్ధిని ఆకాంక్షిస్తాడు కానీ, కులం, ప్రాంతం, మతం అభివృద్ధిని ఆకాంక్షించేవాడు నాయకుడు కాజాలడు.

తన సామాజిక వర్గాన్ని మాత్రమే అభివృద్ధిలోకి తీసుకు రావాలనే తాపత్రయం తప్ప, రాష్ట్ర అభివృద్ధి గురించి చంద్రబాబు ఆలోచించడం లేదు. అందుకే అమరావతి రాజధాని వ్యవహారాన్ని ఆయన భుజానికి ఎత్తుకుంటే, చంద్రబాబు దత్తపుత్రుడు, బాబుకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా, వారి సోషల్‌ మీడియా తలకు ఎత్తుకున్నాయి. ఇలాంటి క్రిమినల్‌ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. కొంతమంది బాగు కోసం, మిగతా ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు రకరకాల కుట్రలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదన్నదే ఇందులో దాగి ఉన్న బాబు కుట్ర.

టిడీపీ హిడెన్ ఎజెండాకు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, కమ్యునిస్టులు మద్దతా..?
కేంద్రంలో బీజేపీ విధానాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ లు టీడీపీ హిడెన్ ఎజెండాకు సపోర్టు చేస్తున్నాయి. మరోవైపు ప్రశ్నించే పార్టీ అనే పవన్‌ కల్యాణ్‌ చివరకు చంద్రబాబు ఏం చెబితే దాన్ని ఫాలో అవుతున్నాడు. ఇక బీజేపీ మీద భయంకరమైన వ్యతిరేకత ప్రదర్శించే కమ్యూనిస్ట్‌ పార్టీలు కూడా ఇక్కడ ఆ పార్టీకి వంత పాడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ప్రతి రాజకీయ పార్టీలో ఒక మనిషి పని చేస్తాడు. సీపీఐలో నారాయణ, రామకృష్ణ, జనసేనలో పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి, రేణుకా చౌదరి, బీజేపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్‌ లు పనిచేస్తారు.

రేణుకా చౌదరికి ఆంధ్రా రాజకీయాలతో పనేంటి..?
కుట్రలు, కుతంత్రాలు, మోసంతో మహా భారతం యుద్ధం ఎలా జరిగిందో.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలోనూ అదే జరుగుతోంది. రేణుకా చౌదరికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో ఏం పని అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేస్తున్నది పాదయాత్ర కాదు ఉత్తరాంధ్ర, రాయలసీమ మీద దండయాత్ర. మా ప్రాంత అభివృద్ధి మీద చేస్తున్న దండయాత్ర. ఈ పాదయాత్ర కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన రేణుకా చౌదరి ట్రాక్టర్‌ నడిపి… దాన్ని రైతుల ఉద్యమంగా అభివర్ణించడం సిగ్గుచేటు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఓటు వేసిన రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఉమ్మడి శత్రువు. రాష్ట్రం విడిపోయి మానసికంగా క్షోభ అనుభవించడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి, అన్నింటికి మించి తెలుగు ప్రజల మనోభావాలకు భిన్నంగా ఓటు వేసిన వ్యక్తి రేణుకా చౌదరి.

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక్కరోజు కూడా ప్రశ్నించని వ్యక్తి రేణుకా చౌదరి. ఆ గొంతు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు సిద్ధాంతాన్ని బలపరిచి రాష్ట్ర ప్రజలను మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని ఉద్దేశం కేవలం కుల రాజకీయాలే. చంద్రబాబు నాయుడు, రేణుకా చౌదరి, సుజనా చౌదరి.. వీళ్ళంతా వేర్వేరు రాజకీయా పార్టీల్లో ఉండే ఒక సామాజిక వర్గానికి సంబంధించవాళ్లే. అందుకే వీళ్లంతా అమరావతి రాజధాని ఉండాలని, ఆప్రాంతంలో ఉండే సామాజక వర్గం బలపడాలన్నదే ఉద్దేశం. చంద్రబాబు పాలనలో, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ చుట్టుప్రక్కల భూములు కొన్నవారు, ఆయన సామాజిక వర్గం మాత్రమే ధనికులు అయ్యారు. వాళ్లే బాగుపడ్డారు. ఇప్పుడు అమరావతిని కూడా రాజధాని చేసి, ఆ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపరచాలన్నదే వారి ఆలోచన. ఇక మిగతా ఏ కులస్తులు, మతస్థులు కూడా అభివృద్ది చెందకూడదా…? రేణుకా చౌదరి లాంటి వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదు. ఆమె ఎండిపోయిన చెట్టు. అలాంటి ఆమె ఏపీకి వచ్చి నకిలీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమా?.

అమరావతి ఒక కుల రాజధాని మాత్రమే
రాయలసీమలో కడప జిల్లాలో జన్మించి పౌరుషం ఉన్న వ్యక్తిగా కుండబద్ధలు కొట్టి మాట్లాడుతున్నాను. నిజాలు మాట్లాడటమే నాకు తెలుసు. అమరావతి ఈ రాష్ట్ర రాజధాని కాదు. అమరావతి ఒక కుల రాజధాని. అది కేవలం ఒక కులానికి సంబంధించిన రాజధాని అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడి హోదాలో కాకుండా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రాష్ట్రంలో ఆ ఒక్క కులమేనా?. తన సామాజిక వర్గాన్ని బలపరిచేందుకు చంద్రబాబు నాయుడు చేసే కుట్ర ఇది.

ఎవరైనా సరే.. తమకు ఏది కావాలో అది అడుగుతారు. అంతేకానీ పక్కవాళ్లకు ఇవ్వద్దు అన్న దాఖలాలు మనం ఎక్కడా చూడం. తనకు ఏది కావాలో అది అడగటం న్యాయం. కర్నూలు న్యాయ రాజధాని, విశాఖను పరిపాలనా రాజధాని చేయొద్దని మీరు అంటున్నారు. కేవలం అమరావతిని మాత్రమే రాజధాని చేయాలట. కర్నూలులో హైకోర్టు పెట్టవద్దట. రాయలసీమ బిడ్డలుగా మా ప్రాంతంలో హైకోర్టు పెట్టాలని, న్యాయ రాజధానిగా చేయాలని మేం అడుగుతాం. మాకు ఇవ్వొద్దని చెప్పటానికి మీరెవరు.. ?

29 గ్రామాలకు చెందిన ఒక సామాజిక వర్గ అభివృద్ధి కోసం అమరావతియే రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు బినామీ రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు. గతంలో ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ అని పాదయాత్ర చేసి, ఇప్పుడు అమరావతి నుంచి అరసవల్లి అంటూ పాదయాత్ర చేయడం సిగ్గుచేటు. అందరూ కలిసి ఉత్తరాంధ్ర, సీమను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. మా ప్రాంతంలో ఓటు, సీట్లు మీకు అవసరం లేదా? మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా? రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, ఓట్లకు… సీట్లకు ముడివేయకూడదు. రాజకీయాలతో ఒక ప్రాంతం అభివృద్ధిని మాత్రమే కొలవకూడదు. మమ్మల్ని మనుషులుగా చూసి, మానవత్వంతో ఆలోచించండి. అన్ని ప్రాంతాలను సమానంగా చూసేలా పాలకులు ఆలోచన చేయాలి. మా సీమలో నీరు పారకూడదు… రక్తం పారితేనే మీకు సంతోషం కలిగేలా ఉంది. మాకు అభివృద్ధి జరగకూడదనేదే చంద్రబాబు ఉద్దేశం.

రాయలసీమకు అభివృద్ధి అక్కర్లేదా..?
మా రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగనివ్వరా అని మిగతా రాజకీయ పార్టీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, రాయలసీమకు ఏమిచ్చారని, ఏం చేశారని చంద్రబాబును అడుగుతున్నాం. సాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి రాయలసీమకు సాగు, తాగునీరు లేని పరిస్థితి, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు. కనీసం మా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు చెప్పుకోదగ్గ ఆస్పత్రులు కూడాలేవు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు కూడా లేవు. మా ప్రాంతంలో అభివృద్ధి శూన్యం. రక్తం తాగే రాక్షసులు అని మమ్మల్ని పదే పదే చంద్రబాబు అవమానిస్తున్నారు. అలా ఎందుకు మమ్మల్ని అభివర్ణిస్తున్నారు.

రాజకీయ నాయకులకు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉండాలి. అది పాలకుల్లో లోపించడం వల్లే ఈ సమస్యలు. సీమలో అభివృద్ధి జరిగితే ఇక్కడ కక్షలు ఉంటాయా? కక్షలకు చరమగీతం పాడే ఔషధం కేవలం అభివృద్ధే. ఏ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందో అక్కడ కక్షలు, ఫ్యాక్షన్ లు ఉండవు. మేము కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నామే తప్ప ఫ్యాక్షన్లు, కక్షలు కోరుకోవడం లేదు. మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వైయస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులుగా, కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉంటూ, మా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు పెడతామని చెబితే దాన్ని కూడా వద్దంటారా? అభివృద్ధి అంతా కేవలం అమరావతికేనా, మాకు మాత్రం కరువును ఇస్తారా? అయినా మేము ప్రశ్నించకూడదా?

అమరావతిలో ఖర్చు పెట్టాలనుకునే రూ. 1.10 లక్షల కోట్లు.. సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెడితే.. ఈ ప్రాంతాలు వెనుకబాటుతనం నుంచి బయటపడవా..?, ఆ ఆలోచన బాబు ఎందుకు చేయలేదు..? ఎవర్ని ఉద్దరించడానికి అమరావతి…?. మాకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేదు కానీ… మీకు మాత్రం తినేందుకు పంచభక్ష పరమాణ్ణాలు కావాలా? ఇదెక్కడి న్యాయం అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సీమ, ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, మేధావులు, ప్రజలంతా చంద్రబాబు నాటకాలను గమనిస్తున్నారు. మా హక్కులు సాధించుకోవడానికి మేము కూడా ఉద్యమిస్తాం. అలాగే చంద్రబాబు చెడ్డబుద్ధిని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ప్రజల్ని చైతన్యపరుస్తాం.

విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే మాకు లేని నష్టం మీకేంటి..?
ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని ప్రాంతాలు, అన్నివర్గాలు అభివృద్ధి చెందాలని ప్రణాళికలు తయారుచేసి, పథకాలు అమలు చేస్తున్నారు. అయినా మేమేమీ అమరావతిని వ్యతిరేకించడం లేదు. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది. రాష్ట్రంలో ఏ శాసనం అయినా అక్కడే జరుగుతుంది. పరిపాలనా రాజధానిని విశాఖకు మారిస్తే మాకు లేని నష్టం మీకేంటని ప్రశ్నిస్తున్నాం. ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిన ప్రాంతం. ఉత్తరాంద్రలో మూడు జిల్లాలు, రాయలసీమలో నాలుగు జిల్లాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయని, విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం జరిగినా ఆ నిధులు కూడా రాని పరిస్థితి. మీ కర్కశమైన మనసుతో చేసే కుట్రలు చూస్తుంటే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోకూడదా అని అడుగుతున్నాం.

ముఖ్యమంత్రి సీమ అభివృద్ధి జరగాలని కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయిస్తే.. దాన్ని మీరు బినామీ ఉద్యమాలతో అడ్డుకుంటారా? కొద్దో గొప్పో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే దానికి మోకాలు అడ్డుతారా? శ్రీబాగ్‌ ఒప్పందం ఏం చెప్పింది. మా ప్రాంతంలో రాజధాని అయినా, హైకోర్టు ఉండాలని చెప్పింది. జగన్‌ గారి పుణ్యాన కర్నూలులో హైకోర్టు వస్తుందనుకుంటే చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదు. మీరు కుట్రలు చేస్తుంటే.. మేము ఎందుకు మౌనంగా ఉండాలి?

రాజకీయాలకు అతీతంగా మా ప్రాంతం అభివృద్ధి కోసం, మీ కుట్రలకు వ్యతిరేకంగా నడుం బిగించుతాం. మా స్వరాలు పెంచుతాం. 2024 ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీని గెలిపించుకోవడం, తద్వారా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా మా ముందున్న ప్రధాన అంశం. మా బిడ్డల భవిష్యత్‌ కోసం మా ప్రాంత అభివృద్ధే మా లక్ష్యం. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైనా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా పెట్టకూడదని కోరుకుంటారా?, రాయలసీమలో హైకోర్టు పెట్టకూడదని ఈ ప్రాంత ప్రజలు మీకు చెప్పారా.. ?. మేము తలచుకుంటే సీమలో మాకు వ్యతిరేకింగా మీరు జరుపుతున్న యాత్రలను అడుగుపెట్టనిస్తామా?, మాకు సంస్కారం ఉంది కాబట్టే, మీరు మా ప్రాంతానికి వచ్చి యాత్రలు చేయగలుగుతున్నారు. మా ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మా ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అది మరచిపోవద్దు.

Leave a Reply