– ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
ఢిల్లీ: దేశంలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇంధన ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా ఇవాళ భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.
త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో మన ఎనర్జీ అవసరాలు భారీగా పెరగనున్నాయి. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల దిశగా మన దేశాన్ని నడిపించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. మౌలిక వసతుల కల్పన వేగతవంతం చేయడు, ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయంగా ఎదిగేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
అంతర్జాతీయంగా ప్రతికూల రాజకీయ, భౌగోళిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇంధన భద్రతా రంగంలో అవకాశాలుగా మలుచుకుంటున్నాం. స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యం విషయంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో, వాయు పవన విద్యుత్లో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది. 2014 నుంచి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. దేశంలోని విద్యుత్ అవసరాల్లో సగం మేర శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతోంది.
అయితే, ఇప్పటికీ బొగ్గు వంటి సంప్రదాయ మూలాధారాల నుంచే ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో కూడా మన విద్యుత్ భద్రత విషయంలో బొగ్గు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
గతేడాది రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగింది. 2030 నాటికి బొగ్గు డిమాండ్ 1.6 బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) ఇంధన రంగంలో సుస్థిరతను సాధించేందుకు పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిపై దృష్టి సారించాయి.
ఇప్పటికే 1,900 మెగావాట్ల సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించాం. 2030 నాటికి 15 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ద్వారా 2030 నాటికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం.
భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ అవసరం కూడా పెరగనుంది. ముఖ్యంగా లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరాలు 2040 నాటికి భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి, క్రిటికల్ మినరల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
స్వదేశీ వస్తువులనే వాడాలంటూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ఇటీవల పిలుపునిచ్చారు. ఇదే స్ట్రాటజీ ఖనిజ రంగం, ఇంధన రంగానికి కూడా వర్తిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గత 10 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నాం.
బొగ్గు, గనుల రంగంలో గతంలో అవినీతి తాండవం చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను సమూలంగా మార్చేశాం. మన సంపద అన్యాక్రాంతం కాకుండా ఉండేలా పారదర్శకంగా వేలం ప్రక్రియ ప్రవేశపెట్టాం. కాబిల్, నాల్కో, హెచ్సీఎల్, ఎంఈసీఎల్ సంస్థల ఆధ్వర్యంలో అర్జెంటీనా వంటి విదేశాల్లో లిథియం గనులను మన అధీనంలోకి తీసుకుని, తవ్వకాలు ప్రారంభించాం.
క్రిటికల్ మినరల్స్ను రీసైక్లింగ్ చేసేందుకు రూ.1500 కోట్లతో ఇన్సెంటివ్ పథకాన్ని తీసుకొచ్చాం. పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటుచేశాం. 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు ఇంధన భద్రత, పర్యావరణ సుస్థిరత రెండు స్తంభాల్లాంటివి. వీటిని సాధించేందుకు బొగ్గు, గనుల రంగం అంకిత భావంతో పనిచేస్తోంది.
జీఎస్టీ 2.0 ద్వారా బొగ్గుపై గతంలో ఉన్న సెస్ పూర్తిగా ఎత్తేశాం. దీంతో బొగ్గు ఆధారిత ఉత్పత్తులు, రంగాలలో ధరలు తగ్గుతాయి. ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించి, పండుగ కానుక అందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.