Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పిలుపునకు అద్భుత స్పందన

టిడిపి ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా పెద్దఎత్తున విరాళాలు
ఇప్పటివరకు విరాళాలు పంపిన 5వేలమంది కార్యకర్తలు

అమరావతి: టిడిపి ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో విరాళాలు అందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. మూడురోజుల క్రితం ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ను చంద్రబాబు ప్రారంభించగా, ఇప్పటివరకు 5వేలమందికిపైగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విరాళాలు అందజేశారు.

“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మూలసిద్ధాంతంతో ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత గత నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అప్రతిహతంగా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంది. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా లక్షలాది మంది తెలుగు ప్రజల మద్దతుతో ఎప్పటికప్పుడు పసుపు జెండా సగర్వంగా ఎగురుతూనే ఉంది.

అయిదేళ్ల అరాచకపాలన కారణంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. రాజధాని లేదు, పోలవరం ఆగిపోయింది, మౌలిక సదుపాయాల్లేవు. ఇసుక, మద్యం పేరుతో ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. ఉపాధి లేక లక్షలాది ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ప్రాణాలకు తెగించి అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ స్థిరపడినా నా జన్మభూమి అనే భావనను మదినిండా నింపుకున్న తెలుగువారు తమ సంపాదనలో కొంతమొత్తాన్ని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీకి విరాళంగా ఇవ్వాల్సిందిగా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విరాళాలు అందించేవారు టిడిపిఫర్ఆంధ్ర.కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి విరాళాలు అందజేయడం ద్వారా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోంది.

LEAVE A RESPONSE