Suryaa.co.in

Political News

అమృత్ సర్… అమరావతి

2004 సంవత్సరం దసరా సెలవల్లో మేం కొంత మంది కలిసి ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల పర్యటనకు వెళ్ళాం. అప్పటికి నాలుగు నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మేం అమృత్ సర్ లో రైలు దిగేసరికి అర్థరాత్రి అయింది. ముందుగా బుక్ చేసుకొన్న హోటల్ కు వెళ్ళేసరికి ఒంటి గంట.

హోటల్ రిసెప్షన్ లో పాతికేళ్ల యువకుడు గాఢ నిద్రలో ఉన్నాడు. మేం లేపితే లేచి వివరాలు రాసుకోవడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పగానే ఒక్క సారి నిద్ర మత్తు లో నుంచి ఉలిక్కిపడి మావైపు తేరిపార చూసి ఓ … మీది హైదరాబాదా సార్ అన్నాడు. ఏమిటంత ఆశ్చర్యం అని అడిగితే జీవితంలో ఒక్కసారైనా హైదరాబాద్ చూడాలని నా కోరిక సార్ అన్నాడు. ఎందుకని అడిగాం. హైదరాబాద్ ఫారిన్ కంట్రీ లా ఉంటుందంటగా సార్… ఇక్కడ అందరూ అనుకొంటారు అని చెప్పాడు.

మేం తర్వాత అక్కడ నుంచి జై పూర్ వెళ్ళాం. ఒక రోజు సిటీ టూర్ లో ఉన్నప్పుడు అప్పటి ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షేఖావత్ కాన్వాయ్ వెళ్తుంటే మా వాహనాలు ఆపేశారు. ఆయన సొంత రాష్ట్రం అదే. శేఖావత్ కు మంచి పేరే ఉందా అని నా పక్కన ఉన్న టూర్ గైడ్ ను అడిగా. మంచి పేరు ఉందని… ఆధునిక రాజస్థాన్ కు పునాది వేసింది ఆయనేనని ఆ గైడ్ చెప్పాడు. మేం ఏపీ నుంచి వచ్చామని అంతకు ముందే అతనికి చెప్పాం. మేం అడగక పోయినా గైడ్ సంభాషణ పొడిగించాడు.

“మీ రాష్ట్రాన్ని చంద్ర బాబు ముందుకు తీసుకు వెళ్లినంతగా మా నాయకులు మా రాష్ట్రాన్ని తీసుకు వెళ్లలేకపోతున్నారు. చంద్ర బాబు దేశానికి ప్రధాని అవుతాడని మేం అనుకున్నాం. ఓడిపోతాడని అనుకోలేదు” అని అతనన్నాడు. ఎందుకు ఓడిపోయాడని మీరు అనుకుంటున్నారని కుతూహలంగా అడిగాం. “ఏముంది సార్. ఉద్యోగులే ఓడగొట్టారు. పని చేయమంటే ఎవరికైనా బాధే కదా” అని అతను వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ కు సుదూరంగా ఉన్న ఒక రాష్ట్రంలో ఇక్కడి ఎన్నికలపై అప్పట్లో వినిపించిన విశ్లేషణ అది.

ఆ తర్వాత కొద్ది రోజులకు భారత ప్రధాన మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ అమెరికా లోని నగరాలతో పోటీ పడగలిగే హైదరాబాద్ వంటి ఆధునిక నగరాలు తమ దేశంలో కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీ, బాంబే లను ఉదహరించక పోవడం విశేషం.

చంద్ర బాబు ప్రభుత్వం తయారు చేసిన 2020 విజన్ ప్లాన్ మీద ఏపీ అసెంబ్లీ లో చర్చ జరిగింది. మేం ప్రెస్ గ్యాలరీలో ఉండి వింటున్నాం. ఎం వీ మైసూరా రెడ్డి కాంగ్రెస్ పక్షానికి ఉప నేత. విజన్ ప్లాన్ పుస్తకం బాగా లావుగా ఉండేది. ఆయన దానిని టేబుల్ మీద ఎత్తి పడేశారు.

“ఎవడో కాకమ్మ కథలు రాస్తే ఇవన్నీ మేం నమ్మాలా? రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు అవుతుందట. మేం ఏమన్నా చెవిలో పూలు పెట్టుకొని వచ్చామా ఇవి నమ్మడానికి” అని ఆయన ఆగ్రహంగా మాట్లాడారు. ఆ రోజుకు రాష్ట బడ్జెట్ ముప్పై వేల కోట్ల రూపాయల లోపే ఉంది. మైసూరా విమర్శ చాలా సబబైనదని నాకు కూడా ఆనిపించింది. 2020 కాదు. 2009 సంవత్సరం నాటికే రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు దాటిపోయింది. విడిపోయిన తర్వాత 2014 లో రెండు తెలుగు రాష్ట్రాలు చెరి రెండు లక్షల కోట్లతో బడ్జెట్లు పెట్టాయి. రెండూ కలిపితే నాలుగు లక్షల కోట్లు.

కరోనా తర్వాత హైదరాబాద్ చుట్టు పక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే సిటీకి బాగా దూరంగా ఉన్న వికారాబాద్ ప్రాంతంలో ధరలు కొద్దిగా తక్కువగా ఉంటాయనుకొని కాలక్షేపానికి నన్ను తోడు తీసుకొని వెళ్ళాడు. వికారాబాద్ దగ్గరలో ఒక గ్రామంలో సర్పంచ్ ఇంటికి వెళ్ళాం. సర్పంచ్ చాలా విషయాలు మాట్లాడాడు.

” బాబు గారు చెప్పిన విజన్ 2020 ఇప్పుడు మా కళ్ళ ముందు కనిపిస్తోంది. మాది బాగా వెనకబడిన ప్రాంతం. సిటీకి చాలా దూరం. ఇక్కడ కూడా మా భూముల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. బాబు గారు 2004 లో ఓడిపోకుండా గెలిచి ఉంటే ఈ ధరలు మాకు పదేళ్ళ క్రితమే వచ్చి ఉండేవని మేం ఎప్పుడూ అనుకుంటాం” అని ఆయన అన్నాడు.

రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ మొదలుపెట్టారు. ఐదు వేల ఎకరాలు కావాలి. ఆ ప్రాంతం హైదరాబాద్ సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

సిటీకి ఇంత దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఇంత తక్కువ పరిహారమా అని రైతులు ఎదురు తిరిగారు. పెద్ద ఉద్యమం రెండేళ్లపాటు జరిగింది. లాఠీ ఛార్జీలు, కేసులు, అరెస్టులు చాలా జరిగాయి. కొంత కాలంపాటు ఆ గ్రామాలను పోలీసులు దిగ్బంధించి లోకల్ ఆధార్ కార్డ్ ఉంటేనే లోపలికి పోనిచేవారు. చివరకు ఆ పరిహారం ఏడున్నర లక్షలకు పెంచిన తర్వాత ఉద్యమం చల్లబడింది.

ఇదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సేకరణ మొదలు పెట్టారు. ఆయన లాండ్ పూలింగ్ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. నీటి వసతి ఉన్న ప్రాంతంలో రైతులు ఒక ఎకరం భూమి ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వెయ్యి గజాలు రెసిడెన్షియల్, నాలుగు వందల గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇస్తుంది. నీటి వసతి లేని మెట్ట భూముల రైతులకు కమర్షియల్ రెండు వందల గజాలు తగ్గిస్తారు. ప్లాట్లు అభివృద్ధి చేసే వరకూ ప్రభుత్వం ఏటా కౌలు ఇస్తుంది.

ఈ ప్యాకేజీకి అంగీకరించిన రైతులు గ్రామాల్లో క్యూలో నిలబడి మరీ తమ భూములు ఇచ్చారు. 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు రాజధాని గ్రామాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఒక గజం భూమి కనీస ధర 30 వేల రూపాయలు అని వినిపిస్తుంటే అత్యధిక ధర 65 వేలు ఉంది. సరాసరిన ఒక గజం 40 వేలు ఉందనుకుంటే ఒక ఎకరం భూమి ఇచిన రైతు తనకు వచ్చిన ప్లాటు అమ్ముకుంటే రూ. నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ వస్తోంది.

లాండ్ పూలింగ్ వల్ల రైతులకు కలిగిన ప్రయోజనం ఇది. చాలా సందర్భాల్లో రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు బాగా నష్ట పోతే పక్కన ఉన్న రైతులు బాగుపడేవారు. కానీ మొదటిసారి అమరావతి నిర్మాణంలో భూములు ఇచ్చిన రైతులు తామే ఫలాలు పొందే అవకాశం కలిగింది. ఇరవై ఏళ్ళ కిందట అమృత్ సర్ లో హోటల్లోని యువకుడు హైదరాబాద్ గురించి సంబ్రమాశ్చర్యాలతో అడిగినట్లు మున్ముందు దేశం ఆమరావతి గురించి మాట్లాడుకొనే రోజులు వస్తాయా? చూడాలి.

పాలనలో తప్పొప్పులు ఉండవచ్చు. ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉండవచ్చు. కాని సమకాలీన రాజకీయవేత్తల్లో చంద్ర బాబు మాదిరిగా దూర దృష్టితో ఆలోచనలు చేసినవారు అరుదు. కేవలం ఆలోచనల వద్దే ఆగిపోకుండా అవి ఆచరణ రూపం తీసుకోవడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. ఈ నెల ఇరవైన 75 వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు..

– రాజశేఖర్ వడ్లకొండ

LEAVE A RESPONSE