Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారి చూపే దార్శనికుడు చంద్రబాబు

– సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడి 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి.అవి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. పెట్టిస్తూనే ఉన్నారు అని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబునాయుడు తరచూ చెప్పే మాట.. చెప్పడమే కాదు దాన్ని ఆయన ఆచరణలో చూపించిన గొప్ప వ్యక్తి అన్నారు.

అపార పరిపాలనా అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నవ్యాంధ్ర అభివృద్ధి జరిగి తీరుతుందన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కిందపడిన ప్రతిసారీ అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు.. అది ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రాసంఘాల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్‌ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తుచేశారు.

కీ. శే. ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, ప్రతిభా పాటవాల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీకి మంత్రిగా పని చేస్తే, అదే శాఖకు తాను ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత చేపట్టడం, తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమల్ని తేవడం వంటి కీలక బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE