Home » పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం

పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం

పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు.

పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణులు బృందం సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు, పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్​ను పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు.

కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. నేటి నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు. మొదటి రెండ్రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్‌ సిద్ధమైంది. ఆ తర్వాత మరో రెండ్రోజుల పాటు సమస్యలను పరిష్కారాలపై మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్‌ సంస్థ అఫ్రి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు.

అంతర్జాతీయ స్థాయి నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జలసంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్‌ బి పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోన్నెల్లీలు నియమితులయ్యారు. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరంతా నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జలసంఘం పేర్కొంటోంది.

ఎగువ కాఫర్‌ డ్యాం సందర్శనతో పర్యటన మొదలు:
నిపుణులు నేడు కొద్దిసేపు అధికారులతో మాట్లాడతారు. తర్వాత ప్రాజెక్టులోని ఎగువ కాఫర్‌ డ్యాం సందర్శనతో వీరి పర్యటన ప్రారంభమవుతుంది. ఆయా కట్టడాలు, నిర్మాణాలు పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్, అధ్యయనాల నివేదికలు, నిర్మాణ క్రమం సందర్భంగా తీసిన ఫోటోలు వారికి అందించేందుకు పోలవరం అధికారులు తగు ఏర్పాట్లను చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ క్రమంపై ఫొటోలతో రిపోర్టును సమర్పించనున్నారు.

2018వ సంవత్సరంలో ఈ డ్యాం భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక, ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీపై ప్రొఫెసర్‌ రాజు 2021లో ఇచ్చిన నివేదికలు, 2022, 2023లలో ఫీజోమీటర్ల సాయంతో సీపేజీపై జరిపిన విశ్లేషణలు, 2024 జనవరిలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సమర్పించిన రిపోర్టు, కొత్తగా వచ్చిన అఫ్రి సంస్థ జియో టెక్నికల్‌ పరిశోధనలకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ నిపుణుల బృందానికి అందిస్తారు. తర్వాత దిగువ కాఫర్‌ డ్యాంను దాదాపు గంటన్నర పాటు పరిశీలించేలా షెడ్యూల్‌ రూపకల్పన చేశారు. ఈ సీపేజీ రిపోర్టులూ వారికి అందిస్తారు.

రెండో రోజు మొత్తం అక్కడే:
ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రం వాల్‌ విధ్వంసం పరిశీలన, అగాధాలు, అక్కడ భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందం ఎక్కువగా ఫోకస్‌ చేయనున్నారు. తొలి రోజు రెండు గంటల పాటు అక్కడే ఉండటంతో పాటు రెండో రోజు మొత్తం ఇందుకే కేటాయిస్తారు. ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాళ్లన్నీ ఇక్కడే ఉండటంతో, రెండు గంటల పాటు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్‌ ప్రాంతాన్ని నిపుణులు పరిశీలిస్తారు.

ఇప్పటికే అక్కడ కొంత వరకూ పని జరిగింది. ఎడమ వైపున అక్కడ నిర్మించిన డయాఫ్రం వాల్‌ని సైతం పరిశీలిస్తారు. జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ) నివేదికలను సమర్పిస్తారు. 2020 దిల్లీ ఐఐటీ ఇచ్చిన రిపోర్టును, అగాధాలు ఏర్పడ్డ ప్రాంతాల్లో వైబ్రో కాంపాక్షన్‌ పనులు, వాటిపై అధ్యయన పత్రాలు, డయాఫ్రం వాల్‌పై ఎన్‌హెచ్‌పీసీ నివేదికలు అందిస్తారు. తర్వాత రెండు రోజులలో నిపుణులు, అధికారులతో చర్చించనున్నారు.

Leave a Reply