Suryaa.co.in

Andhra Pradesh

అన్నదానం..మహాదానం

– టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపిస్తాం
– వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టింది
– రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నడుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
– రేవేంద్రపాడు అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా నారా భువనేశ్వరి వ్యాఖ్య

మంగళగిరి నియోజకవర్గం, రేవేంద్రపాడు గ్రామంలో నారా లోకేష్ సహకారంతో, తెలుగుయువత నాయకులు కాసర్ల జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ ను నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సందర్భంగా ప్రారంభించారు. క్యాంటీన్ ఏర్పాటు చేసిన జస్వంత్, నిర్వాహకులను భువనేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ….

పేదవారి ఆకలి తీర్చడానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు రూ.2కే కేజీ బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లుగా భావించిన ఎన్టీఆర్ గుర్తుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2018లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 368 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదవాళ్లు కేవలం రూ.5తో తమ ఆకలి తీర్చుకోవడానికి అన్న క్యాంటీన్లు ఎంతో సహకరించాయి.

ఒక్కో క్యాంటీన్లో రోజుకు వెయ్యి మంది భోజనం చేసేవారు. రాష్ట్రవ్యాప్తంగా 2.25లక్షల మంది భోజనం చేసేవారు.అన్నదానం మహాదానం అనేది చంద్రబాబు, తెలుగుదేశంపార్టీ ఉద్దేశం. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అడ్డగోలుగా మూసేసి పేదవాళ్ల పొట్ట కొట్టింది. నేటికీ రాష్ట్రంలో 140 అన్న క్యాంటీన్లను టీడీపీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. అన్నదాతలందరికీ నా కృతజ్ఞతలు.

జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసే నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో 7.25కోట్ల మంది ప్రజలు భోజనం చేశారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం అడ్డుపడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా తగ్గకుండా పేదల ఆకలి తీరుస్తున్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE