పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ బెస్ట్

-అపార సహజ వనరులు, సకల సదుపాయాలకు నెలవు ఆంధ్రప్రదేశ్
-ముఖ్యమంత్రి సుపరిపాలన ఏపీకి అతిపెద్ద వనరు
– స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అందించే నిర్ణయం ఓ అద్భుతం
– విశాఖ నగరాన్ని హైదరాబాద్ తరహాలో మలుస్తాం
– ఉత్తరాంధ్ర వాసి నైన నేను పరిశ్రమల మంత్రినవడం అదృష్టం
– విశాఖను పరిపాలన రాజధానిగానే కాదు పారిశ్రామిక నిలయంగా చేస్తాం
– మంగళగిరి ఏపీఐఐసీలోని మంత్రి కార్యాలయాన్ని సందర్శించిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్
– ప్రత్యేక పూజాల అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టిన మంత్రి గుడివాడ
– పరిశ్రమలు, ఏపీఐఐసీ ఉద్యోగులను పలకరిస్తూ భవన సముదాయాన్ని విజిట్ చేసిన మంత్రి

అమరావతి, ఏప్రిల్, 22 : పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అని పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. అపార సహజ వనరులు, సకల సదుపాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వరుస కడతారని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సుపరిపాలన ఏపీకి అతిపెద్ద వనరుగా మంత్రి పేర్కొన్నారు.

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అందించే నిర్ణయం ఓ అద్భుతమని అమర్ నాథ్ తెలిపారు. విశాఖ నగరాన్ని హైదరాబాద్ తరహాలో మలుస్తామని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రవాసినైన తాను పరిశ్రమల మంత్రినవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగానే కాదు పారిశ్రామిక నిలయంగా చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.

అంతకు ముందు మంత్రి గుడివాడ అమర్ నాథ్ మంగళగిరిలోని ఏపీఐఐసీలోని పరిశ్రమల శాఖ మంత్రి కార్యాలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు మంత్రి అమర్ నాథ్ తన కుర్చీలో కూర్చోగానే పుష్పగుచ్ఛం అందజేసి . ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి అభినందించారు. అనంతరం ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మంత్రికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీఐఐసీ ఉన్నతాధికారులైన ఈడీ సుదర్శన్ బాబు, మరొక ఈడీ రాజేంద్రప్రసాద్, సీజీఎంలు మంత్రికి తమ శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి అమర్ నాథ్ ఉద్యోగులను అందరినీ పలకరిస్తూ కార్యాలయం మొత్తం కలియతిరిగారు. 11వ అంతస్తులో ఉన్న ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీల కార్యాలయాలను కూడా ఆయన విజిట్ చేశారు. ఎక్స్ పీరియన్స్ రూమ్ లో ప్రదర్శితమవుతోన్న పరిశ్రమలకు సంబంధించిన వీడియోలను తిలకించారు. 12వ అంతస్తులో ఇటీవల ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాంటీన్ ను పరిశీలించారు. అక్కడే సాధారణ శైలిలో ఎండీ, ఈడీలతో కలిసి భోజనం చేశారు.

క్యాంటీన్ లో తన భోజనం అనంతరం బిల్లును తానే చెల్లించి తన ప్రత్యేకతను మంత్రి అమర్ నాథ్ చాటుకున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం సామాన్య ధరలకే పౌష్ఠికాహారం అందజేస్తుండడాన్ని మంత్రి అభినందించారు. ఆరోగ్యం కోసం ఉద్యోగులకై ఏర్పాటు చేసిన జిమ్ ని కూడా ఆయన పరిశీలించారు. వచ్చే వారం నుంచి ఉద్యోగులతో సమీక్షలు నిర్వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply