– యాదవుల ఓట్లపై బీఆర్ఎస్ కన్ను
– ఏపీలో తలసాని ఇమేజ్ను వాడుకోనున్న కేసీఆర్
– ఏపీలో రెండవ అతిపెద్ద బీసీ కులం యాదవులే
– విజయవాడలో బీఆర్ఎస్ ఆఫీసు
– స్థల పరిశీలనకు 18న విజయవాడకు మంత్రి తలసాని?
– జనవరిలో ఏపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు
– జక్కంపూడి ఇన్నర్ రింగ్రోడ్ హైవేపై బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం
– శంకుస్థాపనకు హాజరవనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
దక్షిణ భావతదేశంలో భారత రాష్ట్ర సమితి విస్తరణకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్గా దృష్టి సారించారు. అందులో భాగంగా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో, బీఆర్ఎస్ను బలోపేతం చేసే బాధ్యతను తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయ యాదవ్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఏర్పాటయిన తర్వాత, విజయవాడలో కేసీఆర్ను స్వాగతిస్తూ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమయింది.
గత ఎన్నికల ముందు బీసీలను ఏకం చేసి, టీడీపీకి వ్యతిరేకంగా వారిని వైసీపీ వైపు మళ్లించేందుకు, తలసాని విజయవాడలో పర్యటించారు. ఆ సందర్భంలో ఆయనకు కృష్ణా జిల్లా సరిహద్దు నుంచి, బెజవాడవరకూ ఘన స్వాగతం లభించింది. ఏపీలో అతిపెద్ద రెండవ బీసీ కులమైన యాదవులను బీఆర్ఎస్ వైపు మళ్లించే వ్యూహంతో, తలసానినిని బీఆర్ఎస్ ఏపీ ఇన్చార్జిగా నియమించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో తలసాని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా పనిచేశారు. టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ కడప జిల్లా నేత సుధాకర్ యాదవ్ ఆయన వియ్యంకుడే.
ఏపీలోని అనేక వర్గాలతో సత్సంబంధాలున్న తలసాని, ప్రతి సంక్రాంతి పండుగకు భీమవరం వెళ్లి కోడిపందాలలో పాల్గొంటారు. తలసాని టీడీపీలో ఉండగా, ఆయనతో ఏపీకి చెందిన టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో సత్సంబంధాలు కొనసాగించారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా,వారంతా ఇంకా ఆయనతో ఆ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సనత్నగర్లోని కమ్మ, క్షత్రియ నేతలతో తలసాని సత్సంబంధనన్నాయి. ఈ క్రమంలో ఏపీ నేతలతో తలసానికి ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీకి, ఆయననే ఏపీ ఇన్చార్జిగా నియమించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా జక్కంపూడి ఇన్నర్ రింగ్రోడ్ హైవేపై, 800 గజాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఇప్పటికే స్థలాన్ని కూడాపరిశీలించినట్లు చెబుతున్నారు. దానిని పరిశీలించేందుకు మంత్రి తలసాని, ఈనెల 18,19వ తేదీల్లో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం.
దానిని ఖరారు చేసిన తర్వాత, పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాగా, జనవరిలో బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర, జిల్లా కమిటీలు వేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.