టీడీపీ సిండికేట్ల వల్లే ఆక్వా ధరలు పతనం

–ఆక్వా రైతాంగ సమస్యలను వారం-పది రోజుల్లో పరిష్కరిస్తాం
– అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులే ధరల పతనానికి కారణం.
– ఆక్వా సిండికేట్‌లకు కొమ్ముకాస్తున్న టీడీపీ.. రైతులపై మొసలి కన్నీరు
– మూడేళ్ళలో ఆక్వా రైతులకు రూ. 2,377 కోట్లు విద్యుత్ సబ్సిడీ ఇచ్చాం
– కోవిడ్‌ కష్టకాలంలోనూ ఆక్వా రైతులకు అండగా నిలిచింది సీఎం శ్రీ వైఎస్‌ జగనే
– ఇచ్చిన మాట ప్రకారం రూపాయిన్నరకే సబ్సిడీతో విద్యుత్ సరఫరా
-ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు

అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కారణంగానే ఆక్వా ఎగుమతులు తగ్గాయని, వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, పాదయాత్రలో ఆక్వా రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం, సబ్సిడీ ద్వారా రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తున్న ఈ ప్రభుత్వంపై టీడీపీ పనిగట్టుకుని బురదచల్లుతుందని ధ్వజమెత్తారు.

గతంలో ఆక్వా సిండికేట్ వ్యాపారులుకు కొమ్ముకాసిన టీడీపీ.. ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. గడిచిన మూడేళ్ళలో విద్యుత్ సబ్సిడీ ద్వారా రూ. 2,377 కోట్లు ప్రభుత్వం అందించిందని వివరించారు. కొద్దిమంది బడా కార్పొరేట్ సంస్థలకు మినహా, నిజమైన 86 శాతం మంది రైతులకు విద్యుత్ సబ్సిడీ అందుతోందని చెప్పారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయ్యి, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సిండికేట్ దారులంతా చంద్రబాబు శిష్యులేనని, ఇందులో ఆయన కుట్ర కూడా ఉందని తెలిపారు. కొవిడ్ సమయంలోనూ ప్రభుత్వం ఆక్వా రైతాంగానికి అండగా అండగా నిలిచిందని ప్రసాదరాజు గుర్తు చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం రూ.1.50కే విద్యుత్ ఇస్తున్నాం
ఆక్వా రైతులను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు అన్నివిధాలా ఆదుకుంటున్నారు. ఆక్వా రంగానికి చేయూతనిస్తూ ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మద్దతుగా నిలిచింది. కోవిడ్‌ లాంటి విపత్కర సమయంలో, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా.. వారిని ఆదుకున్నది, అండగా నిలిచిందీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారే. ఆక్వారైతులు నిలదొక్కునేలా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఆక్వా రంగంలో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఆక్వా రంగానికి ఎటువంటి సహకారం అందించలేదు.

వైఎస్‌ జగన్‌ చేసిన తన సుదీర్ఘ పాదయాత్రలో ఆక్వా రైతుల సమస్యలను గుర్తించి, వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి వచ్చాక అన్నివిధాలా సహకారం అందిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా ధర యూనిట్‌కు రూ. 3.85 ఉంటే.. దానిని రూ. 1.50కే అందిస్తానని పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ గారు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుకు రూ.1.50 కే విద్యుత్‌ ఇస్తున్న పరిస్థితి ఉంది.

అప్పట్లో వైఎస్‌ జగన్‌ ఈ ప్రకటన చేశాక.. ఎన్నికలకు హడావుడిగా చంద్రబాబు యూనిట్ 2 రూపాయలకు ఇస్తానని హామీ ఇచ్చినా, షరామామూలుగా ఆక్వా రైతులను సైతం మోసం చేశాడు. చంద్రబాబు హాయాంలో ఆక్వా చెరువుల తవ్వకాలపై కూడా నియంత్రణ ఉండేది. కానీ ఆక్వా రైతాంగానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇస్తూ వారికి అండగా నిలుస్తోంది. కొత్తగా తవ్వుకునే చెరువులకు అనుమతులు కూడా ఇచ్చాం. విద్యుత్‌ కావాలంటే ఫిషరీస్‌ సర్టిఫికెట్‌ కావాలి. ఆనాడు చంద్రబాబు హయాంలో ఆ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తే.. నేడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీని కూడా ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తోంది. ఫీడ్, సీడ్‌ విషయంలో కూడా ప్రత్యేక చట్టాలు తెచ్చి రైతులకు నష్టం లేకుండా నాణ్యమైనవి అందించేలా మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో అమలు జరుగుతోంది. పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోతే రైతులు, ఎక్స్‌పోర్టర్స్‌ తో సంప్రదింపులు జరిపి రైతులకు నష్టలేకుండా చేస్తోంది. ఒక స్థిరమైన ధర ఉండేలా గడిచిన మూడేళ్లుగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు తగ్గడం వల్లే ధరల పతనం
ఈ మధ్య కాలంలో చైనా, అమెరికా లాంటి దేశాలకు ఎగుమతులు లేని కారణంగా ఆక్వా ధరలు పతనమయ్యాయి. ఈక్వెడార్‌ నుంచి రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరగడం కూడా మన ఆక్వా ఉత్పత్తుల ధర తగ్గడానికి ఒక కారణం. దీనిపై మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ చర్యలకు కృషి చేస్తున్నారు. ఆక్వా రైతులకు మద్దతు ధర ఉండేలా ఇప్పటికే ఎగుమతిదారులతో ప్రభుత్వం మాట్లాడింది. ఈ మూడేళ్ళలో ఫీడ్‌ ధరలను ప్రభుత్వ ప్రమేయంతో మూడు సార్లు ధరలు తగ్గించారు. మార్కెటింగ్‌ ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా స్టోరేజీ కోసం 23 ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం.

మూడేళ్ళలో రూ. 2,377 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చాం
టీడీపీ హయాంలో ఏనాడైనా ఆక్వా రైతాంగం గురించి చంద్రబాబు ఆలోచించాడా, రైతుల పక్షాన ఉన్నారా..?. ఆనాడు పట్టించుకోకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాలని ప్రయత్నం చేస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. కోవిడ్‌ సమయంలో ఆక్వా ఉత్పత్తులకు రవాణా సౌకర్యం నిలిచిపోతే, ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో మాట్లాడి ఎగుమతికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. టీడీపీ హయాంలో ఈ రంగంపై కనీసం 100 కోట్లు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,377 కోట్ల రూపాయల విద్యుత్‌ సబ్సిడీని ఈ మూడేళ్లలో అందించాం. ప్రాసెసింగ్‌ యూనిట్లు, విద్యుత్‌ సబ్సిడీ, ఆక్వా ల్యాబ్స్‌ కోసం కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నాం. దీనివల్లే ఆక్వా రైతులు నిలదొక్కుకుని ముందుకు వెళ్లగలిగారు.

బడా కార్పొరేట్‌ సంస్థలకు తప్ప నిజమైన రైతులందరికీ సబ్సిడీ
ప్రతి చిన్నరైతుకు సబ్సిడీ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. పది ఎకరాల లోపు ఉన్న రైతులకు సబ్సిడీ ద్వారా విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్దిమంది బడా కార్పొరేట్‌ సంస్థలకు తప్ప, ఆక్వా రైతుల్లో 86 శాతం మందికి ఈ విద్యుత్‌ సబ్సిడీ అందుతోంది. నిజమైన రైతులందరికీ విద్యుత్‌ సబ్సిడీ అందుతోంది. గతానికి, ఇప్పటికీ పరిస్థితిని ప్రతిపక్షం బేరీజు వేసుకుని మాట్లాడాలి. ఎవరి దగ్గరో ముడుపులు తీసుకుని రేట్లు తగ్గించినట్లు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల అబద్దపు మాటలను నమ్మాల్సిన అవసరం లేదు. రైతులు ఎవ్వరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.

వారం రోజుల్లో పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేస్తూ ఆక్వా ఎగుమతులకు మార్గం సుగమం చేసేలా చర్యలు చేపడుతోంది. వారం- పది రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర కూడా ప్రకటించింది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. మద్దతు ధర వచ్చేలా, రైతులకు నష్టం లేకుండా చేసేందుకే చర్యలు తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా నూతన టెక్నాలజీతో ఆక్వా రైతులకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తోంది. విద్యుత్‌ సరఫరా విషయంలోనూ అధికంగా ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఆక్వా సిండికేట్ దారులంతా బాబు శిష్యులే
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
ఆక్వా రంగాన్ని దెబ్బతీసేలా.. కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయ్యి, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ సిండికేట్‌ వ్యవస్థల్లోని వారంతా చంద్రబాబు శిష్యులే.. వారంతా సిండికేట్‌ అయ్యి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా మేము వెనకడుగు వేసేది లేదు. ఈ నెల 21న నరసాపురానికి సిఎం వైఎస్‌ జగన్‌ వస్తున్నారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు… అని చీఫ్ విప్ ప్రసాదరాజు వివరించారు.

Leave a Reply