గుజరాతీ వ్యాపారులు దొంగలా?

స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?

2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో ప్రముఖంగా కార్పొరేట్ లకు మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ, వారి అప్పులను కూడా మాఫీ చేసాడు అంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇవి ఏవో కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అని అనుకుంటున్నారేమో .. కాదు అంత కంటే ఎక్కువ.. దేశ వ్యాపార రంగాన్ని నీరు గార్చే ప్రయత్నం లో భాగంగా ఇలా చేస్తున్నారు అనే విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి.

అసలు కార్పొరేట్ వ్యాపారులు అంటే ఎవరో తెలుసుకుందాం.. ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాపారాన్ని ఆరంభించి తనతో బాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పించి ఆ వ్యాపారం ద్వారా నెమ్మదిగా లాభాలను ఆర్జిస్తూ ..అలా వందల వేల మందికి ఉపాధి కల్పించేంత ఎత్తుకు ఎదిగి , తన వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్కుంటూ వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసి , తన సంస్థను స్టాక్ మార్కెట్ జాబితా లో చేర్చే స్థాయికి తీసుకొస్తే … వారిని కార్పొరేట్ వ్యాపారస్తులుగా పిలుస్తారు. నిజానికి కార్పొరేట్ వ్యాపారులను ఇండస్ట్రియలిస్టులు అంటారు. లేదా ఉద్యోగాల కల్పన ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పాటుని ఇస్తున్న ‘ఉద్యోగపతులు’ అని కూడా అంటారు.

అయితే కార్పొరేట్ వ్యాపారవేత్తల వల్ల దేశానికి ఎంత లాభం చేకూరుతుందో ప్రతీ భారతీయుడు తెలుసుకుని తీరాలి..
ఉదాహరణకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అనే కార్పొరేట్ కంపెనీని తీసుకుందాం.. నేషనల్ స్టాక్ ఎక్సచెంజ్ మరియు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయిన కంపెనీ ఇది.. వీరు రైతు ఉత్పత్తులను తమ సూపర్ మార్కెట్ ల ద్వారా విక్రయిస్తూ లాభాలు అర్జిస్తుంటారు. సాధారణంగా ఎవరైనా ఈ కంపెనీ ఓనర్ ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్థిపరుడు వంటి అంశాలనే ఆలోచిస్తారు కానీ వీరి వల్ల ఎంతమందికి లాభం చేకూరుతుందో ఆలోచించరు.

ఈ హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో ప్రస్తుతం 3500 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.. వీరి ఉత్పత్తులు తమ దుకాణాల ద్వారా విక్రయిస్తూ, లేదా రవాణా చేస్తూ ఇలా కూడా మరో 10,000 మంది దాకా పరోక్షంగా ఉపాధి పొందడమో లేదా లాభాలను అర్జించడమో చేస్తుంటారు. మరో వైపు రైతుల ఉత్పత్తులను వీరు కొనడం వల్ల రైతులకూ లాభం చేకూరుస్తున్నారు.

అదీ కాక కార్పొరేట్ కంపెనీ లు సంపాదించే ఆదాయం నుండి సుమారు 25 నుండి 30 శాతం దేశానికి పన్నుల రూపం లో కట్టాల్సి ఉంటుంది.. ఉదాహరణకు హెరిటేజ్ సంస్థ సంవత్సర నికర ఆదాయం 1000 కోట్లు (టాక్స్ ఫైల్ చేసే ఆధారంగా) ఉంటే అందులో కనీసం 250 కోట్లు దాకా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ ఖజానాకు డైరెక్ట్ గా పన్నులు కట్టడమే కాకుండా, ఉద్యోగులకు ఇచ్చే జీతాల ద్వారా వారికి ఉపాధి, ఉద్యోగుల ఆదాయం నుంచి ప్రభుత్వానికి కట్టే పన్నులు, ఉద్యగులకు ESI ఆరోగ్య భీమా సదుపాయం, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పన , అంతే కాకుండా వారి వ్యాపార ఉత్పత్తులను బట్టి GST వంటి పరోక్ష వస్తు సేవల పన్నులకు కంపెనీ సేవల కారణం ప్రభుత్వ ఖజానాకు చేరడం.

ఇలా ఎన్నో రకాలుగా ఒక్క వ్యక్తి స్థాపించిన ఒక సంస్థ.. దేశ సమాజ శ్రేయస్సుకి ఇంతలా సహాయ పడుతుంది. ఇలా వేలమంది కార్పొరేట్ వ్యాపారస్తులు ఉన్న ఈ దేశం లో , ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది”? ఎంత పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయి? ఎంత డబ్బు దేశానికి మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతున్నాయి వంటివి ప్రముఖంగా ఆలోచించాలి మనం.

ఒక పెద్ద కార్పొరేట్ వ్యాపార సంస్థ కట్టే సంవత్సరం పన్నుల ద్వారా ఏకంగా ఒక రాష్ట్రము లో లక్షల మందికి ‘ప్రజా సంక్షేమ పథకానిక’ ఖర్చు చేసేంత డబ్బు వస్తుంది తెలుసా? అయితే ఇవ్వన్నీ వదిలేసి అంబానీ ఇంత సంపాదించాడు, ఆదాని అంత సంపాదించాడు అని మాత్రమే ప్రచారం చేస్తూ , అదేదో వారి సంపాదన అంతా దొంగ సంపాదన అనేలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కుల కుటుంబ కమ్మీ పార్టీలు.

నిజానికి అంబానీ అదానీ అంటూ నిత్య ఏడుపు స్వరాన్ని వినిపించే వారి, అసలు టార్గెట్ ప్రధాని మోడీనే అనేది సుస్పష్టం. అంబానీ అదానీ లు గుజరాతీలు. కావున అదే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధానిని గుజరాతీ వ్యాపారస్థులకు లింక్ పెట్టి.. ఇక వారి వ్యాపార ఎదుగుదలకు ప్రధాని అండగా ఉంటున్నాడు అనే పుకార్లను సృష్టిస్తే, ప్రజల్లో కార్పొరేట్ వ్యాపారస్థుల పై , అలాగే ప్రధాని పై ఒక వ్యతిరేక భావన కలుగుతుంది అనేది కుల కమ్మీల ఆలోచన.

గుజరాతీ ప్రజల్లో ప్రతీ 10 మందిలో 7గురు వ్యాపారం చేస్తారు.. గుజరాతీలు తరతరాలుగా వ్యాపారం చేయడం లో ఆరితేరిన వారు. గుజరాత్ రాష్ట్రం అరేబియా సముద్రం అంచున ఉండడంతో .. భారతీయ వస్తువులను గుజరాతీ వ్యాపారులు సముద్ర మార్గము ద్వారా వెళ్లి , గత 6 వందల సంవత్సరాలుగా అరబ్ మరియు ఆఫ్రికా దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం మూలానా .. వాణిజ్యం, వ్యాపారం వంటి వాటి పై మంచి పట్టు వచ్చింది వారికి.

వందల సంవత్సరాలుగా అతిపెద్ద ఓడరేవులు కలిగి, అతిపెద్ద ఓడలు నిర్మించి అందులో ప్రయాణిస్తూ వ్యాపారాలు చేసేవారని చరిత్ర కారులు గుజరాతీల గురించి గొప్పగా రాశారు. ఇలా వ్యాపారం చేయడమనేది గుజరాతీ లకు వారసత్వంగా వచ్చిన ఒక ట్యాలెంట్ అనే చెప్పుకోవాలి అంతేకానీ అదేదో మోడీ వచ్చాక.. గుజరాతీలు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టారు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం హాస్యాస్పదం.

అయితే అంబానీల రిలయన్స్ సంస్థ.. ఇందిరా గాంధీల సమయంలోనే కార్పొరేట్ స్థాయి కంపెనీ గా పేరు పొందింది అనేది తెలుసా?
1950ల్లో ధీరుభాయి అంబానీ తన 20 ఏళ్ల వయసు లోనే అరబ్ దేశాల్లో నివసించి, అక్కడ వ్యాపార అనుభవం సంపాదించి భారత్ లో ఒక చిన్న వస్త్ర వ్యాపారం మొదలుపెట్టి , ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ అలా వచ్చిన లాభాలతో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కష్ట నష్టాలు అన్ని చూసి .. 20 ఏళ్ల తరువాత తన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ని కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లాడు.

Reliance Industries అనే సంస్థ 1973లోనే రిజిష్టర్ అయ్యింది. ధీరుభాయి అంబానీ పేరుకి గుజరాతి అయినా , తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొదలు పెట్టింది ముంబై లోనే. అలాగే అక్కడే స్థిరపడిపోయారు కూడా. అలా తండ్రి నుంచి వచ్చిన రిలయన్స్ గ్రూప్ వ్యాపార సంస్థలను ముకేశ్, అనిల్ లు పంచుకుని ఆ వ్యాపార సముదాయాలకు ఓనర్ లు గా చెలామణి అవుతూ వస్తున్నారు.

మోడీ 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి గా పదవి చేపట్టే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క సంవత్సర నికర ఆదాయం 28,000 కోట్లు, వారు 2000-01 సంవత్సరం ప్రభుత్వానికి కట్టిన పన్నులు 4000 కోట్ల పై మాటే. ఆనాడే వారి కంపెనీ ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 15,000. 2004 సంవత్సరం లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచం లో మేటి సంస్థల జాబితా అయిన ‘ఫార్చ్యూన్ 500’ లో స్థానం సంపాదించింది.

మరి అప్పటి మార్కెట్ కి ఈనాటికి తేడాను గమనిస్తే వారి వ్యాపారం ఎన్నో రేట్లు ఎదుగుతుంది అనేది సుస్పష్టం కదా..!! ఇప్పుడు కేవలం ముకేశ్ అంబానీ చైర్మన్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 2020-21 సంవత్సరం దేశానికి కట్టిన పరోక్ష పన్నులు 1,35,000+ కోట్లు. వారి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,30,000 పైనే. వీరి వ్యాపారానికి అనుబంధంగా 10,000 చిన్న మధ్య తరహా కంపెనీ లు నడుస్తున్నాయి. ఇదంతా దేశ అభివృద్ధి లో భాగం కాదా? రిలయన్స్ సంస్థ మొదటి నుండి పెట్రోకెమికల్స్, గ్యాస్ నిక్షేపాల వెలికితీత దాని విక్రయం, రిటైల్ రంగం, టెలి కమ్యూనికేషన్స్ ఇలా విపరీతమయిన ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాల్లో వ్యాపారం చేయడం అనేది వారికి కలిసి వచ్చింది. ఇదంతా ప్రధానిగా మోడీ ఎన్నికయ్యాకే వారు ఇంత ఆదాయాన్ని సృష్టించుకున్నారు అనేది సత్య దూరం. ప్రాకృతికంగా ఒక సంస్థ తన లక్ష్యాల వైపు కష్టించి వెళ్తూ ఉంటె దాని ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవిస్తారు.

రిలయన్స్ సంస్థకు 4జి టెలికాం లైసెన్స్ వచ్చింది కాంగ్రెస్ హయాం లోనే అనేది తెలుసా? .. అలా జియో సంస్థను 2016 లో స్థాపించి , దేశంలో మొదట 4జి సేవలు అందించడం వల్ల తక్కువ ధరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాని మూలంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వంటివి ఈ రోజు ఏంతో సులువుగా చేయగలుగుతున్నాం.

ఇదంతా మనకు సౌకర్యంగా లేవా ఆలోచించండి? డిజిటల్ కనెక్టివిటీ అవసరాన్ని తీర్చిన సంస్థగా గుర్తించకుండా, కేవలం అంబానీ అంత సంపాదించాడు, ప్రధాని మోడీ నే సహాయం చేసాడు వంటి నెగటివ్ కామెంట్ లు చేయడం నీతి మాలిన పనిగా చెప్పుకోవాలి.

మరో వైపు అదానీ.. అదానీ 1980ల్లోనే ముంబై లో ఒక చిన్న ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ లో వ్యాపార అనుభవాల్ని నేర్చుకుని, తాను సొంతంగా 1988లో వాణిజ్య సంస్థను నెలకొల్పి 1994 లోనే గుజరాత్ లో షిప్పింగ్ పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పని ప్రారంభించారు. అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ పోర్ట్ అయిన ‘ముంద్రా పోర్ట్’ మేనేజింగ్ అనుభవం వల్ల లాజిస్టిక్స్ రంగం లో తన కంపెనీ నేర్పరి ఆధారంగా , ఈ రోజు ఎయిర్పోర్ట్ ల ఆధునీకరణ, వాటి నిర్వహణ కాంట్రాక్టులు కూడా ఓపెన్ టెండర్ ద్వారా దక్కించుకున్నాడు.

దీన్ని అడ్డం పెట్టుకుని ప్రధాని ఎయిర్పోర్ట్ లను అదానీ కి అమ్మేశాడు అంటూ అర్ధంపర్ధం లేని రాతలు రాయడం ప్రారంభించారు. ఓపెన్ టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకుంటే, దాన్ని విక్రయించడం అంటారని కుల కమ్మీలు ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనం.

ముంబై ఎయిర్ పోర్టులో జీవీకే వారి షేర్లు కొనడం ద్వారా , అదానీ గ్రూప్ చేతిలోకి వచ్చింది. అయితే తాను మొదలు పెట్టిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో విద్యుత్ మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన వస్తువులను రవాణా చేయడం మూలాన, పవర్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు, ఇది 1996 లోనే. అలాగే వ్యవసాయ రంగానికి అనుబంధంగా నడిచే రిటైల్ రంగం లో 1999 లోనే అడుగుపెట్టాడు.

అలాగే కాంగ్రెస్ పరిపాలన సమయం 2009 లోనే ఆస్ట్రేలియా లో ఒక షిప్పింగ్ పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అదీ కాకుండా అదే సమయంలో 2010 లో ఆస్ట్రేలియా లో అతి పెద్ద మైనింగ్ కంపెనీ ‘కార్మైఖేల్ బొగ్గు మైనింగ్’ టెండర్ వేసి కాంట్రాక్టు దక్కించుకుని తన షిప్పింగ్ పోర్ట్ ద్వారా వివిధ దేశాలకు బొగ్గు ఎగుమతులు చేయడం ప్రారంభించాడు..\ అక్కడ 2016 లో మైనింగ్ తవ్వకాలు పార్రంభం అయ్యి 2020 తన మైనింగ్ కంపెనీ వెలికితీసిన బొగ్గు విక్రయం ద్వారా తన సంస్థ ఆదాయం పెరగడం ప్రారంభం అయ్యింది.

ఈ రోజు అతని నికర ఆదాయం పెరగడానికి ముఖ్య కారణం ఇలా పలురకాల వ్యాపారాల్లో తలమునకలై పనిచేయడమే అంతే కానీ… ప్రధాని మోడీ వచ్చాక అదానీకి ఎదో దేశ సంపదను దోచిపెట్టాడు అంటూ , అందుకే అతని ఆదాయం పెరిగింది అనేది అసలు బేసిక్ సెన్స్ లేనోడు మాట్లాడే పనికిమాలిన మాటలు. ఇవే కాకుండా సిమెంట్ రంగం, పెట్రో కెమికల్స్, సోలార్ పవర్ ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు.

ముఖ్యంగా ఏ కార్పొరేట్ సంస్థ అయినా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వ్యాపారాల్ని విస్తరించుకుంటాయి.. ఎందుకంటే విస్తరణకు అవసరమయ్యే అంత పెట్టుబడి ఒక కంపెనీ నికరంగా భరించలేదు కాబట్టి. అయితే ఇలా తన కంపెనీ ఆస్ట్రేలియా లో మైనింగ్ కోసం తీసుకున్న రుణాన్ని అడ్డుపెట్టుకుని.. అదాని కంపెనీ కి ప్రధాని మోదీ రుణాలు మాఫీ చేసారంటూ, అలాగే వారు రుణాలను కూడా ఎగ్గొట్టారంటూ కుల కమ్మీలు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అదానీ గ్రూప్ కి సంబంధించిన ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన నెలవారీ EMI డిఫాల్ట్ అవ్వలేదు. ఆ గ్రూప్ కంపెనీ లు ఇప్పటివరకు ఆర్ధిక క్రమశిక్షణను ఎప్పుడూ తప్పలేదు.

అదానీ అత్యంత సంపన్నుల జాబితాలో, ప్రస్తుతం రెండవ స్థానానికి చేరుకునే సరికి.. ఈ కుల కుటుంబ కమ్మీ పార్టీల ఏడుపులు రెట్టింపు అయ్యాయి. పెద్దలు చెప్పేవారు కదా .. మనల్ని చూసి ఏడ్చే వారే మన ఎదుగుదలకి సహాయపడుతారు అని. అందుకే అదానీ ఆ స్థాయికి వెళ్లాడు.

గుజరాత్ లో ఎవరైనా సరే ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారి ని చూసి.. వారిలా అలా అవ్వాలని కోరుకుంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే… మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎదుగుతున్న వాడిని చూసి , వాడిలా మనమూ కష్టించి పైకి రావాలి అనే ఆలోచన కన్నా, ఎదుగుతున్న వాడిని ఎలా కిందకు దించాలి అనే ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది. అందుకే మన వద్ద ఉన్న కార్పొరేటు వ్యాపారుల శాతం, ఇతర రాష్ట్రాల వారితో పోల్చుకుంటే అతి తక్కువ ఉంటుంది.

మరి భారత్లోని వ్యాపారులు ప్రపంచ కుబేరులతో, ఎలా పోటీ పడగలుగుతున్నారు అని కొంతమంది సందేహపడొచ్చు.. దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. ప్రపంచం లో అత్యంత జనాభా కలిగిన దేశం భారత్. ఈ దేశ మార్కెట్ ఇతర ఏ దేశ మార్కెట్ తో పోల్చి చూసినా, ఇక్కడ ఆదాయాన్ని సృష్టించే మార్గం వ్యాపారులకు సులువుగా దొరుకుతుంది. గుజరాతీలు మొదటి నుంచి వ్యాపారాల్లో ఆరితేరిన వారు.

అలా గుజరాతీలు అయిన అంబానీ, అదానీ, టాటా, అజీమ్ ప్రేమ్ జీ వంటి వారు ఆల్రెడీ వివిధ కంపెనీలు స్థాపించి, వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్న వారే. నిజానికి అంబానీ అదనీలే కాదు. దేశంలో ఉన్న చాలా స్వదేశీ వ్యాపారులు Oyo, Zomato, Ola వంటి స్టార్టప్ లు సైతం వారు చేసే వ్యాపారాల ద్వారా, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.. కానీ మోడీ ని నిందించాలంటే, గుజరాతీలు అయిన అదాని అంబానీలను టార్గెట్ చెయ్యాలి కాబట్టే అలా విషం చిమ్ముతూ వస్తున్నారు.

మన దేశ వ్యాపార మార్కెట్ ని ఇది వరకు కేవలం విదేశీ వ్యాపారులు మాత్రమే శాసించేవారు. కానీ ఇప్పుడు మోదీ వచ్చాక .. స్వదేశీ వ్యాపారులు వివిధ వ్యాపార రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సమయాన్ని చూసి, కొన్ని శక్తులు ఎలాగైనా భారత్ ని నిరోధించాలంటే.. అక్కడి ప్రజల ప్రతిభ కు పట్టం కడుతున్న స్వదేశీ వ్యాపారులపై విష ప్రచారం చేసి, తద్వారా భారత ఆర్ధిక మూలలను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే ప్రధాని ‘ఆత్మనిర్భర్’ లక్ష్యాలకు తోడుగా నిలుస్తున్న, స్వదేశీ వ్యాపార రంగాన్ని నీరుగార్చే ప్రయత్నం బలంగా జరుగుతోంది. మన దేశం ఆత్మ నిర్భర్ అవ్వడమే కాదు. ఈ దేశం పై ప్రపంచ దేశాలు ఆధారపడేలా చెయ్యాలంటే, మన దేశ వ్యాపారాలను దేశ విదేశాల్లో నెకొల్పే స్థాయికి తీసుకు వెళ్ళాలి. అప్పుడే భారత్ ప్రపంచం లోనే అత్యంత బలమైన ఆర్ధిక శక్తి గా నిలదొక్కుకుంటుంది.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )

Leave a Reply