– కాంగ్రెస్ కండకావరమా?అధికార మదమా?
– బీఆర్ఎస్ సభ సక్సెస్ పై ఎందుకంత అక్కసు?
– మీరా అవినీతి గురించి మాట్లాడేది?
– పీసీసీ అధ్యక్షుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– బీఆర్ఎస్ రజతోత్సవ సభ బ్లాక్ బస్టర్ హిట్
– ఎన్నికలెప్పుడు జరిగినా ఇందిరమ్మ హింసారాజ్యానికి చరమగీతం
– బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్: వరంగల్ -ఎల్కతుర్తి లో నిన్న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో విస్కీ బాటిళ్లే కనిపించాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు విస్కీ బాటిళ్లా? సభా ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా క్రిక్కిరిసిన లక్షలాది మంది ప్రజలు నీకు కనిపించలేదా?. నీకు కంటి చూపు మందగించిందా?. లేక కాంగ్రెస్ కండకావరమా?అధికార మదమా? అని ఆయన ఒక ప్రకటనలో నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ సభ సక్సెస్ పై కాంగ్రెస్ కు ఎందుకంత అక్కసు? అని మండిపడ్డారు.
వరంగల్ లో బీఆర్ఎస్ జనసునామీతో కాంగ్రెస్ సర్కారులో వణుకు మొదలైందని
ఆయన అన్నారు. వరంగల్ సభ ద్వారా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలకు బీఆర్ఎస్ భయాన్ని పరిచయం చేసిందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఏం చేయాలో తెలియక మతి చలించి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఓర్వలేని విమర్శలకు దిగి తమ డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు.
పాలన చేతకాక విపక్షంపై నోరు పారేసు కుంటున్నరని, సీఎం రేవంత్ కు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి, అరాచకం కాంగ్రెస్ కవచకుండలాలని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి కాంగ్రెస్ అవినీతి బురదమడుగులో మునిగితేలుతున్న మీరు కేసీఆర్ ఫ్యామిలీని ఆడిపోసుకుంటున్న తీరు చూస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టుందని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.
పీసీసీ అధ్యక్షుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా వరంగల్ – ఎల్కతుర్తి లో నిన్న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అని జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్, బీజేపీల ఖేల్ ఖతం అని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన వ్యాఖ్యా నించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబురం అనగానే కాంగ్రెస్ పార్టీ కండ్లలో నిప్పులు పోసు కుందని, వరంగల్సభ జరగకుండా సర్కారు పెద్దలు కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆయన మండిపడ్డారు. అడుగడుగున పోలీసు ఆంక్షలు, నిర్బంధాలు విధించారని, సభా స్థలికి కార్యకర్తలు చేరకుండా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే దాదాపువెయ్యికి పైగా వాహనాలను హుస్నాబాద్ దాటిన తర్వాత కొత్తపల్లి నుండి యూ టర్న్ చేసి తిరిగి వెనక్కి మళ్ళించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికికక్కడ ట్రాఫిక్ జామ్ ల పేరుతో స్వయంగా పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపడం సర్కారు దమననీతికి నిదర్శనమని ఆయన ధ్వజ మెత్తారు.
ఆర్టీవో స్థాయి అధికారులను అడుగడుగునా పెట్టి వాహనాలు చెక్ చేయించారని, స్కూల్ బస్సులు అద్దెకిచ్చిన వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని జీవన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ సభను ఎలాగైనా అడ్డుకోవాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ దుష్టపన్నాగాన్ని, సహాయ నిరాకరణ తో సభను విచ్ఛిన్నం చేసే కుట్రను తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారని ఆయన అన్నారు. సభకు వచ్చే అన్ని రహదారులను దిగ్బంధం చేసి సభ జరగకుండా చేయాలన్న కాంగ్రెస్ సంకుచిత బుద్ధి తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తల ముందు పారలేదన్నారు.
తండోపతండాలుగా తరలివచ్చిన సబ్బండ వర్గాలు, బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పవర్ చూపించారని జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నక్కజిత్తులను, అప్రజాస్వామిక ఎత్తుగడలను గులాబీ సైన్యం చిత్తుచేసి వరంగల్ పోరుగడ్డ పోటెత్తిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ స్పీచ్ తో కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలెప్పుడు జరిగినా ఇందిరమ్మ హింసారాజ్యానికి ప్రజలు చరమగీతం పాడటం, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సంక్షేమ రాజ్యానికి స్వాగతం పలకడం ఖాయమని వరంగల్ సభ చాటి చెప్పిందని ఆయన అన్నారు.