Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు దగ్గర చందమామ కథలు నడవవు

చంద్రబాబు నాయుడి దగ్గర చందమామ కథల్లోలా నడవవు! చందమామ కథల్లో రాక్షసులు చెట్టు తొర్రలలో దాగి రాత్రి వేళ బయటకు వచ్చి ప్రజల్ని భయపెట్టేవారు. ఆ రహస్య నేలమాళిగలలో వున్న పాతాళ స్థావరాలకు తొర్రల నుండి దారులు వుండేవి. అలా జగన్ హయాంలో తయారైన రాక్షసులు సారాను చెట్టు తొర్రలో దాచి అడ్డంగా దొరికిపోయారు.

తిరుపతి జిల్లాలో ఆకాశం నుండి దూసుకొచ్చిన ఓ అదృశ్య “నిఘా కన్ను”.. ఎవరూ ఊహించని రీతిలో ఓ భారీ రహస్యాన్ని బట్టబయలు చేసింది. చెట్టు తొర్రలో చాకచక్యంగా దాచి ఉంచిన నాటుసారా గుట్టును రట్టు చేసింది. అసలు ఈ “నిఘా కన్ను” కథేంటి? ఈ అసాధారణ విజయం ఎలా సాధ్యమైంది? ఎర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన, వేములవాడ గ్రామాలలో నాటుసారా తయారీ ఇటీవలి కాలంలో రహస్యంగా సాగుతోంది. దాన్ని తయారుచేసి ఎవరికీ అనుమానం రాకుండా వివిధ ప్రాంతాల్లో దాచి, రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

పోలీసులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా, ఈ ముఠాలు దొరకడం గగనమైంది. ముఖ్యంగా చెట్ల చాటున సారా తయారుచేసి, పోలీసుల కళ్ళుగప్పి చెట్ల తొర్రల్లో దాచి ఉంచడం పోలీసులకు ఓ పెద్ద సవాల్‌గా మారింది. చందమామ కథల్లో రహస్య నిధులు దాచిపెట్టే చెట్టు తొర్రల ప్రస్తావన గుర్తుందా? సరిగ్గా అలాంటి పద్ధతిలోనే వీరు సారాను దాచేవారు. ఎంతోమంది సిబ్బంది, రోజుల తరబడి గాలించినా ప్రయోజనం లేకుండా పోయేది. అయితే, ఈసారి పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరించారు.

భాకరాపేట సీఐ ఇమ్రాన్‌బాషా ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసులు అత్యాధునిక డ్రోన్‌లను రంగంలోకి దించారు. అవును, ఆకాశంలో గరుడ దృష్టితో గాలిస్తూ, అత్యాధునిక కెమెరాలతో ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టే డ్రోన్‌లే ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి. ఎర్రావారిపల్లె మండలం వేములవాడ గ్రామం, తలకోన వాటర్‌ కెనాల్‌, భాకరాపేటతో పాటు దాదాపు 25 ప్రాంతాల్లో డ్రోన్‌లు గాలిలో చక్కర్లు కొట్టాయి. అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్ని, చివరకు దట్టమైన ఆకుల చాటున ఉన్న చెట్టు తొర్రలను కూడా నిశితంగా పరిశీలించాయి.

ప్రత్యేక బృందం సీఐ వినోద్‌కుమార్‌ డ్రోన్‌ అందించిన స్పష్టమైన ఫొటోల ఆధారంగా సారా తయారు చేసి దాచి వుంచిన రహస్య స్థలాలను గుర్తించారు. వెంటనే పోలీసులు మెరుపు వేగంతో ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ వారికి ఎదురైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊహించని విధంగా, చెట్ల తొర్రల్లో దాచి వుంచిన 14 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్‌ నిఘా వల్లే వేములవాడ గ్రామానికి చెందిన హనుమంతు, వేణు, మునస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో డ్రోన్ టెక్నాలజీని అన్ని రంగాల్లో వాడమని పదే పదే ప్రోత్సహించడం వల్లే పోలీసులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. జగన్ జమానాలో మర్రి ఊడల లెక్కన తయారైన గంజాయి నుండి నాటుసారా మాఫీయాల వరకు నిర్వహిస్తున్న అక్రమ కార్యకలాపాలను కనుగొనడంలో ఇలాంటి అసాధారణ విజయాలు లభిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరస్తులు ఎంత చాకచక్యంగా వ్యవహరించినా, చట్టం నుండి తప్పించుకోలేరని ఈ సంఘటన గట్టిగా స్పష్టం చేస్తోంది.

మారిన కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీ.. నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మానుల్లో దాచినా, మారుమూల ప్రాంతాల్లో దాక్కున్నా చట్టం తన వేటను ఆపదు. చట్టం నుండి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు.

LEAVE A RESPONSE