– 14న జరిగే సభకు అంతా సమాయత్తం
– పండుగ వాతావరణంలో పిఠాపురం
– జనసైనికుల్లో ఫుల్ జోష్..
అమరావతి: అందరి చూపు పిఠాపురం వైపే కనిపిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల సమక్షంలో ఈ నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కార్యక్రమం కావడంతో జనసేన ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు ఆవిర్భావ సభ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందుకోసం పిఠాపురం పరిధిలోని చిత్రాడ ఆవిర్భావ వేడకలకు వేదికగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో..:
జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి పార్టీలోని దాదాపుగా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ సాగుతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు సంబంధించిన పలు కమిటీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు.అందుబాటులోకి వస్తున్న మరింత మంది నేతలను ఆయా కమిటీల్లోకి జత చేస్తూ సాగుతున్నారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అయితే ఈ ఏర్పట్లలో నిండా మునిగిపోయారు. సభ ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్న ప్రతి చిన్న పనిని కూడా ఆయన దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కింది స్థాయి కార్యకర్తలు అంతా ఈ ఏర్పాట్లలోనూ మునిగిపోయారు. ఫలితంగా పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఊరూరా జనసైనికుల జోష్:
జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ఫ్లెక్సీలు, జెండాలు వారం ముందు నుంచే రెపరెపలాడుతున్నాయి. పార్టీ అధినేతలు, ద్వితీయ శ్రేణినేతలు, జనసైనికులతో చిత్రాడ ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకూ అందరిలో ఆవిర్భావ సభ జోష్ కనిపిస్తోంది.
కాకినాడలో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ:
తాజాగా శనివారం జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షించేందుకు ఏకంగా కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చింది. పిఠాపురంలో ఈ కంట్రోల్ రూంను నాదెండ్లతో కలిసి ఉదయ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఏర్పాట్ల తీరు చూస్తుంటే.. నిజంగానే జనసేన ఆవిర్భావ వేడకలు ఏ రేంజిలో జరుగుతాయన్న అంశం అసలు ఊహకే అందట్లేదు. ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం, పవన్ చట్టసభల్లోకి అడుగుపెట్టడతోనే డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తీరుతో పార్టీ శ్రేణులు ఉరిమే ఉత్సాహంతో ఉన్నారు. ఫలితంగా ఈ సభకు 10 లక్షలకు మించిన జనం హాజరైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదన వినిపిస్తోంది.
ఇంటింటికి ఆహ్వానం:
పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలా ప్రత్యేకంగా రూపొందించిన బొట్టు స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ కంట్రోల్ రూమ్లో ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరఫున ఆడపడుచులను ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించేలా పార్టీ వీరమహిళ విభాగానికి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది.