– టూరిజం అధికారులకు చైర్మన్ సూచన
శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఏపీ పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్ను సందర్శించారు. హోటల్ను పరిశీలించిన అనంతరం, ఆయన హోటల్ నిర్వహణ, వసతి సదుపాయాలు, భద్రతా ప్రమాణాలపై పలు కీలక సూచనలు చేశారు.
చైర్మన్ అధికారులతో మాట్లాడుతూ హోటల్ సేవలను మరింత మెరుగుపరచాలని, పర్యాటకుల అనుభవాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. హోటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రాంగణానికి తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హోటల్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తక్షణమే సుందరీకరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
వసతి, భోజనం, పార్కింగ్, శుభ్రత వంటి అంశాల్లో పర్యాటకులకు పూర్తి సంతృప్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, హోటల్లో పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, దీనిలో ఎటువంటి రాజీకి తావులేదని స్పష్టంగా తెలిపారు. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని, అవసరమైన సాంకేతిక మద్దతుతో పాటు, సిబ్బందిని శిక్షణనిచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించాలని సూచించారు.
రెస్టారెంట్ సేవలపై దృష్టి పెట్టుతూ, అక్కడ పని చేసే సిబ్బంది యూనిఫామ్ ధరించాలని, శుభ్రమైన మరియు రుచికరమైన ఆహారం అందించాలన్నారు. రెస్టారెంట్లో ఆధునిక ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ, పర్యాటకులకు మరింత హైజెనిక్ అనుభూతి కలిగేలా చూడాలని తెలిపారు.
ప్రచారం మరియు మార్కెటింగ్ అంశాలపై చైర్మన్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. హోటల్ ఆక్యుపెన్సీ పెంచేందుకు ప్రాచుర్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హోటల్ ప్రాంగణంలో అరకు కాఫీ కౌంటర్ ఏర్పాటు చేసి, స్థానిక ప్రత్యేకతలను పర్యాటకులకు పరిచయం చేయాలని సూచించారు.
శ్రీకాళహస్తి బైపాస్ రహదారి ఇరువైపులా హరిత హోటల్కు సంబంధించిన ఆకర్షణీయమైన విజువల్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రజాభాగస్వామ్యం కలిగిన ప్రదేశాల్లో హోటల్కు సంబంధించిన ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.