– అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్
– ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణం
– లులూ గ్రూపునకు రూ.1500–2వేల కోట్ల విలువైన భూమి
– రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడి
– యథేచ్ఛగా అంచనాల వ్యయం పెంపు. కాంట్రాక్ట్లు
– రూ.36 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంపు
– కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్ధతి తీసుకొచ్చారు
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్
– పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం
తాడేపల్లి: రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నియామకాలు పూర్తైతే పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో నిర్మాణం పూరై్తనట్లు అవుతుంది. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.
రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి గురించి ప్రజల్లోకి రాకుండా ఈ ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం పరాకాష్టకు నిదర్శనం. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసుల అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు కూడా తప్పు బట్టింది. మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నాం.
చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. దీని కోసం మనుషులను భయపెడుతున్నారు. వారిని ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి. ఒక దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ఈ ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదు.
లోక్సభ సభ్యుడు మిథున్రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. చంద్రబాబునాయుడు పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు.
చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై సీఐడీ గతంలో కేసుకూడా పెట్టింది. మరి ఏది స్కాం? ప్రభుత్వం అన్యాయాలను గట్టిగా ప్రశ్నించాలి. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?.
ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి పెట్టారు.
ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రియింబర్స్మెంట్ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7 వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీని వల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో చేస్తున్నారు.
లులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెరిగాయని.. రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీ గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలతో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. పార్టీ అధికారంలోకి వస్తుంది. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధానాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.
చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలలు పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కానీ భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు.
కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీ పడొద్దు.