Suryaa.co.in

Telangana

కరెంట్ పై కట్టు కథలు చెప్పడం మానండి

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కల్వకుంట్ల కవిత కౌంటర్

నిజామాబాద్ : కరెంటు సరఫరా పై కట్టు కథలు చెప్పడం మానేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోందంటూ కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి “ఎక్స్” (ట్విట్టర్)లో చేసిన పోస్ట్ కు కల్వకుంట్ల కవిత ధీటుగా కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందని కవిత తెలిపారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టిపిసి ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు.

సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసిఆర్ దేనని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE