ఆయుధ పూజకు ఎందుకంత ప్రాధాన్యత ?

దసరా పండుగకు ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పవిత్రమైన పర్వదినాన హిందువులలో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ , ఇతర సామాగ్రిని దుర్గా మాత ముందు ఉంచి పూజలు చేస్తారు.

రైతులు అయితే కొడవలి , నాగలి , వాహనం ఉన్న వారు తమ వాహనాలకు , టైలర్లు తమ కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు , ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు , ఇతర పనిముట్లకు పసుపు , కుంకుమతో అది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పాండవుల ఆయుధాలు..
పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

శక్తి స్వరూపిణిని..
అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని , పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు.

శత్రుబాధలు తొలగుతాయని..
పంచ ప్రకృతి మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.

ఈ మంత్రాన్ని పఠించాలి..
ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.

ప్రస్తుత పూజలు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం ఆయుధ పూజలంటే ఆట వస్తువుల నుండి వంట వస్తువుల దాకా పాకింది. కరోనా వంటి మహమ్మారి కాలంలో చాలా మంది తమ బ్యాట్లు , క్రికెట్ కిట్లు , గ్యాస్ స్టవ్ , ఫోన్లు , కంప్యూటర్ల వంటి వాటిని పూజిస్తున్నారు.

బొమ్మల కొలువు..
ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ దేవి పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను ‘గోలు’ అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు.

Leave a Reply