Suryaa.co.in

Andhra Pradesh

ఆరుద్రకు బాబు అభయం!

– సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర
– తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు
– ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం..పెన్షన్ పై హామీ

అమరావతి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర కు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదరైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం….కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర కు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని….ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సిఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తన సమస్యను అప్పటి సిఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు.

పైగా ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురిచేశారని…పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటిపర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి…ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని ఆమెకు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE