– నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
– వానాకాలం నాటికి పరీక్షలు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ లో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ తో భేటి అయ్యారు.
బ్యారేజీల రిపేర్లు, పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక ను చర్చించారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను వివరించారు. అన్ని కోణాల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పరీక్షలు చేపడుతున్న తీరుపై ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తాను స్వయంగా బ్యారేజీలను సందర్శన కు వస్తానని చెప్పారు.
దశలవారీగా శాస్త్రీయ పరీక్షలు
బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నిపుణుల సంస్థలను ప్రభుత్వం నియమించింది. డిజైనింగ్, టెస్టింగ్ సంస్థలు రంగంలోకి దిగాయి. డిజైన్కు ముందు అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను సీడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థ చేస్తుంది. బ్యారేజీల పునరుద్ధరణ కోసం జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) స్కానింగ్ , డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్ , జియోటెక్నికల్ , జియోఫిజికల్ పరీక్షలతో భూమి, అక్కడ నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు.
సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇరిగేషన్ శాఖ అధికారులు, సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు , డిజైనింగ్ సంస్థ ప్రతినిధులు, ఇతర టెక్నికల్ ఏజెన్సీలు సభ్యులుగా ఉన్నారు. పరీక్షలు సకాలంలో జరిగేలా చూడడం..
అవసరమైన డేటా సమయానికి అందించడం, అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగేందుకు, కేంద్ర స్థాయి నిపుణుల పర్యవేక్షణ కూడా ఉండే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా ఇందులో చేర్చే అవకాశముంది.
అన్ని కోణాల్లో విశ్లేషించి..
ప్రస్తుతం బ్యారేజీల ఫౌండేషన్, కట్ ఆఫ్ వాల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయనున్నారు. అన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇప్పుడున్న నిర్మాణ లోపాలు గుర్తించి… పూర్తి సమాచారం విశ్లేషణల ఆధారంగా వాటికి అనుగుణంగా పునరుద్ధరణ పనులకు డిజైనింగ్ సంస్థ కొత్త డిజైన్లు సిద్ధం చేస్తారు. ఈ డిజైన్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కి పంపించి.. వాళ్ళు ఇచ్చే సూచనలు మార్గదర్శకాలకు అనుగుణంగా పునరుద్దరణ పనులకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేశంలో ప్రాజెక్టులు, బ్యారేజీల భద్రతను నిరంతరం పర్యవేక్షించే బాధ్యత కలిగిన చట్టబద్ధమైన సంస్థ.
వానాకాలం ముందే పరీక్షలు
రానున్న మూడు నాలుగు నెలల్లో (వర్షాకాలం ముందు) అన్ని పరీక్షలు పూర్తి చేసి, డిజైన్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలం తరవాత పునరుద్ధరణ పనుల ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది.
దీర్ఘకాలిక మనుగడ లక్ష్యం
పునరుద్ధరణ పనులు పూర్తిగా శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం అమలు చేసి, భవిష్యత్తులో 50 నుంచి 100 ఏళ్ల పాటు బ్యారేజీలు సురక్షితంగా భద్రంగా ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యారేజీలను శాస్త్రీయ పద్దతుల్లో బాగు చేస్తం
గత ప్రభుత్వ లోపాల వల్ల దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను శాస్త్రీయ పద్ధతుల్లో బాగు చేయడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ఎన్ డీఎస్ ఏ, సీడబ్లూసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఐఐటి ముంబయిలోని నిపుణుల సహకారంతో అత్యధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు పూర్తి చేసి, వర్షాకాలం తర్వాత శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పారదర్శకత కోసం ప్రత్యేక కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.