నీటిలో పడిన చీమకు గడ్డిపోచ ఆసరా. అది గడ్డిపోచే కానీ, చీమ ప్రాణాలు కాపాడేది అదే. జీవనసమరంలో పేదలు, దిగువ మధ్యతరగతి జీవులు తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు నానా అగచాట్లు పడుతుంటారు. రోడ్ల పక్కన గోనెసంచులు పరుచుకుని ఆకుకూరలో, కాయగూరలో,పండ్లో అమ్ముతూ జీవనం సాగిస్తారు. మరికొందరు ఒక కట్టెల పొయ్యి పెట్టుకుని టిఫిన్లు వేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. చెట్ల కింద, దుకాణాల అరుగుల వద్ద ఇస్త్రీ చేసుకుని కాలం గడిపేవాళ్లూ వున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకునే పని చేతిలో ఉంది. లేనిదల్లా చిన్నషెల్టర్. తాము ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా, సరుకు పాడవకుండా సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు తోపుడు బండ్లు అనుకూలంగా వుంటాయి. అయితే అవి కొనే స్థోమత వీరికి లేదు. అద్దెకి తీసుకుంటే సంపాదించిన దాంట్లో సగం అద్దెకి పోతే ఇంకేమి తినడానికి మిగలదు. రోడ్లపై గతుకుల్లాగే సాగుతున్న వీరి బతుకులకు నారా లోకేష్ రూపంలో ఆసరా దొరికింది.
తమకాళ్ల మీద తాము నిలబడుతూ ఉపాధి పొందుతున్న బడుగుజీవులకు తోడ్పాటు అందించాలని లోకేష్ అనుకున్నారు. సొంత సొమ్ముతో తోపుడు బండ్లను చేయించి అందించడం ప్రారంభించారు. కాయగూరలు అమ్మేందుకు వీలుగా ఒక మోడల్ బండి, ఇస్త్రీ చేసేందుకు అనువైనది మరో మోడల్ బండి, టిఫిన్ బండి ఇలా వారి వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యంగా బండ్లు చేయించి అందజేయిస్తున్నారు.
ఇప్పటివరకూ పండ్లు, కూరగాయలు, ఇతరత్రా సామాన్లు అమ్మేవాళ్లకు 157 తోపుడు బండ్లు అందజేశారు. 14 ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశారు. టిఫిన్ స్టాళ్ల కోసం 8 బండ్లు, వికలాంగులకి 13 ట్రైసైకిళ్లు నారా లోకేష్ అందజేశారు. ఒకరికి బడ్డీకొట్టు చేయించి ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నారా లోకేష్ పంపిణీ చేసిన తోపుడు బండ్లు శుభకరమైన పసుపు రంగుతో స్వాగతం పలుకుతున్నాయి. ఉపాధికాంతులు వెదజల్లుతున్నాయి. లబ్దిదారుల మోముల్లో చిరునవ్వులు చిందుతున్నాయి.
ఒక బండి చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు నారా లోకేష్ ని కలిసి విన్నవించినా, మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయం(ఎంఎస్ఎస్ భవన్)కి దరఖాస్తు ఇస్తే చాలు. బండి కావాలని అడిగేవారి కులం, మతం, ప్రాంతం చూడరు కానీ వారు పేదలో కాదో పరిశీలిస్తారు. పేదలైతే చాలు బండిని ఆకర్షణీయంగా తయారు చేసి అందిస్తారు. వివిధ రకాల ఉపాధికి సాయంగా నిలిచిన 200కి పైగా తోపుడు బండ్లు ఆయా కుటుంబాలకి ఆసరాగా నిలుస్తున్నాయి. మరో 400 బండ్లు సిద్ధం అవుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందిస్తున్న ఆసరాతో తమ బతుకు బండి ఇలా సాగుతోందంటున్నారు లబ్ధిదారులు.