– పార్టీలో యువజన విభాగం పదవి తొలి అడుగు
– ఎదగడం మీ చేతుల్లో ఉంది
– మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది
– మీరు ప్రజలతో నిత్యం మమేకం కావాలి
– చిరునవ్వుతో పలకరించాలి. వ్యవహరించాలి
– ప్రజలకు కష్టం వస్తే వారితో కలిసి పోరాడాలి
– పార్టీ యువజన విభాగం ప్రతినిధులకు వైయస్ జగన్ స్పష్టీకరణ
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యా.లయంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం
తాడేపల్లి: రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకమని, అది తొలి అడుగు కాగా, ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలతో నిత్యం మమేకం కావడం, ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారికి అండగా నిల్చి, వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని ఆయన వెల్లడించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని, అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశంలో వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి వచ్చిన మీ అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. పార్టీలో క్రియాశీలకంగా నిర్మాణ కార్యక్రమం సాగుతోంది. ప్రతిపక్షంలో ఉంటూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తూ, వారు హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుతున్నాం. ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాం. అయితే ఇంకా ఎదగాలి.
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు, పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది, కాబట్టి నాయకుల దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది సాధ్యం. మన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవాళ్లు.
2011లో మన పార్టీ స్థాపించాం. నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా వెనక ఎవరూ లేరు. నేను, నా అమ్మ ఇద్దరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం. అప్పుడు నాతో రావడానికి కొందరు సిద్ధం కాగా.. ఇప్పుడు నా పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది.
కాబట్టి, నాతో రమ్మని చెప్పను. రాజకీయంగా తెరమరుగైపోతావ్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాతో రమ్మని చెప్పలేనన్నాను. దేవుడు దయ తలచి, పరిస్థితులు చక్కబడ్డప్పుడు, నేను బాగున్నప్పుడు రమ్మని చెప్పాను. ఎందుకంటే అప్పుడు నేను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఢీ కొడుతున్నాను.
నేను, నా అమ్మ ఇద్దరితోనే పార్టీ ప్రస్థానం. మా వెనక ఎవరూ లేరు.
నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాను.ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏరోజూ నేను వాటి విషయంలో రాజీ పడలేదు. నాతో పాటు, కాంగ్రెస్ను వీడి 18 మంది వస్తామన్నారు. వారందరినీ రాజీనామా చేయమన్నాను. ఎంపీ ఎం.రాజమోహన్రెడ్డి కూడా వస్తానంటే, తననూ రాజీనామా చేయమన్నాను.
అలా 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాజమోహన్రెడ్డి అందరం ఉప ఎన్నికలకు పోయాం. అప్పుడు నాకు అత్యథిక మెజారిటీ, 14వ లోక్సభలోనే రికార్డు సష్టిస్తూ ఏకంగా 5.50 లక్షల మెజారిటీ వచ్చింది. పార్లమెంటులో అందరూ మనవైపే చూశారు. కానీ జీర్ణించుకోలేని పరిస్తితుల్లో… నాపై కక్ష కట్టారు. అలాగే ఎంపీగా ఎం.రాజమోహన్రెడ్డి కూడా కాంగ్రెస్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెల్చారు. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి 15 మంది గెల్చారు. ఎక్కడా విలువలు, విశ్వసనీయత తగ్గలేదు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచితే, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. దానికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరినా.. చంద్రబాబు కలిసి రాలేదు. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చి, నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. అలా అప్పుడు కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం గట్టెక్కింది. అలా ఆ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయం చేశాయి.
రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. మన పార్టీ నుంచి కొందరు తప్ప, చాలా మంది కొత్తవారు. ఆ ఎన్నికల్లో మన పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెల్చారు. వారిలో 23 మందిని ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. అలా అనైతిక రాజకీయాలు చేశారు.
కానీ, ఏం జరిగింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీకి అఖండ విజయం దక్కింది. అదే టీడీపీకి ఆ ఎన్నికల్లో దేవుడు మొట్టికాయ వేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంతకు ముందు మన పార్టీ నుంచి ఎంత మందినైతే అనైతికంగా లాక్కున్నారో, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. అయితే అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. అలాగే చిక్కటి చిరునవ్వుతో చక్కగా పలకరించాలి. అందరితోనూ అలాగే వ్యవహరించాలి. ఇంకా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారితో కలిసి పోరాడాలి. ప్రజల తరపున నిలబడాలి. వారికి తోడుగా ఉండాలి. ఈ మూడు చేయగలిగితే, ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారు.
నియోజకవర్గస్థాయి ఇంఛార్జ్లకు చెబుతున్నాను. ఈరోజు నుంచి మీరు మొదలుపెట్టండి. మీరు పిలుపునిస్తే, కనీసం 2 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ దిశలో ఇంకా కృషి చేయాలి. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు. మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావాలి.
‘ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. మీరు పై మూడు గుణాలు పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. మీకు ఒక విషయం చెబుతున్నా. ఆరు నెలల్లో మీరు దాన్ని సాధించాలి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది రావాలి.
ఇది నియోజకవర్గం ఇంఛార్జ్లకు ఇస్తున్న టార్గెట్.
దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల, మున్సిపాలిటీలు, వార్డు కమిటీలు ఏర్పాటు కావాలి. వాటిలో సమర్థులను నియమించండి. ఎదగడానికి సిద్దంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుకురండి. అసంఘటిత రంగంలో ఉన్నవారిని సంఘటిత రంగంలోకి తీసుకురావాలి. అలా మీరు పక్కా ప్రణాళికతో పని చేస్తే, చొరవ చూపితే, కృషి చేస్తే మీరు రాజకీయంగా బాగా ఎదుగుతారు. అప్పుడు మీరు ఒక్క పిలుపునిస్తే జనం కదిలి వస్తారు.
ఇంకా పార్టీ జిల్లా అధ్యక్షులు. యువజన విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే, కనీసం 5 వేల మంది రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే, వెంటనే కమిటీల మీద దృష్టి పెట్టండి.. వాటిని ఏర్పాటు చేయండి. వాటి పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేయండి. నియోజకవర్గ స్దాయిలో ఉన్న యూత్ అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సలహాలు ఇస్తూ… వారిని చేయి పట్టుకుని నడిపించండి. మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు పిలుపునిస్తే అప్పుడు కేవలం 5 వేలు కాదు. 20 వేల మంది కదిలి వస్తారు.
ఇక పార్టీ జోన్ విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపినిస్తే 10 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ స్ధాయికి ఎదగడం కోసం పక్కాగా ప్లాన్తో పని చేయండి. పార్టీలో కింది శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించడం.. మీ కార్యాచరణ కావాలి. అలా మీరు రాజకీయంగా ఎదిగాక, మీరు పిలుపునిస్తే, 10 వేలు కాదు. 40 వేల మంది వస్తారు.
మొత్తం ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడం కోసం పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాం. వారు మీకు అండగా ఉంటారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తాం. ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్లు మీకు తోడుగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారు. అలా కేసులు పెట్టినా ఎదుర్కొనేలా.. పార్టీ మీకు అండగా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యంగ్ అభ్యర్ధులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకొస్తున్నాం. అంటే వారు పార్టీ జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేస్తారు.
ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలి. ఇది సోషల్ మీడియా యుగం. కాబట్టి మీ ఫోన్ ఒక గన్ వంటిది. అంటే అది ఒక ఆయుధం అన్నమాట. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఎక్కౌంట్, యూట్యూబ్, ఎక్స్ పోస్టు.. ఇలా అన్ని మాథ్యమాల్లో మీరు చురుకుగా ఉండాలి. గ్రామస్దాయి వరకు భాగస్వామ్యం కావాలి.
మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, పార్టీలో మా వరకు తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్సార్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్లాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదీ విజన్. ఈ విజన్ తో భాగస్వామ్యులు కావాలి. ఇది మీ అందరికీ తెలియాలి.
పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది. ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. అంటే, ఇక ముందు మనం మళ్లీ మళ్లీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు. మీ మీ జిల్లాల్లో మీతో కలిసి ఎక్కువ ప్రయాణించే పరిస్థితులు ఉంటాయి. మన పరిచయాలు ముందు ముందు ఇంకా పెరుగుతాయంటూ, సమావేశంలో వైయస్ జగన్, పార్టీ యువజన విభాగం ప్రతినిధులకు స్ఫూర్తినిచ్చారు. పార్టీ యువజన విభాగం ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా, ఆ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.