అందరికీ ‘అమ్మ’చేతి వడ్డన!

– లోకేష్ పాదయాత్ర సైనికులకు తల్లి భువనేశ్వరి వడ్డన
– అందరికీ కృతజ్ఞతలు చెప్పిన తల్లి మనసు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సుదీర్ఘ పాదయాత్ర లక్ష్యంతో అడుగులు వేస్తున్న లోకేష్ పాదయాత్రకు వందరోజులయిన సందర్భంగా, ఆయన తల్లి భువనేశ్వరి సహా బంధువులంతా లోకేష్ పాదయాత్రలో కలసి ఉత్సాహంగా అడుగులేశారు. బంధువులతోపాటు, లోకేష్ మిత్రులు కూడా పాదయాత్రలో నంద్యాల వచ్చి, పాదయాత్రలో పాల్గొన్నారు. బంధుమిత్రులంతా కలసి గ్రూపు ఫొటోలు దిగారు. పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, ప్రజలకు అభినందనలు తెలిపారు.

అంతకంటే ముందు.. తన పాదయాత్రకు వచ్చిన తల్లి భువనేశ్వరి ఆశీస్సులు తీసుకున్న లోకేష్.. కిందకు వంగి ఆమె కాలి బూట్లకు లేసులు వేశారు. ఆ ఫొటో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వందరోజుల నుంచి ఎండ-వానలకు లెక్కచేయకుండా, అవిశ్రాంతంగా నడుస్తున్న లోకేష్… తనను చూసేందుకు తల్లి రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

తల్లి భువనేశ్వరి కొడుకు ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పాదయాత్రను పర్యవేక్షిస్తు, లోకేష్‌కు దన్నుగా ఉన్న యువగళం దళాన్ని భువనేశ్వరి పేరుపేరునా పలకరించి, వారికి కృతజ్ఞతలు చెప్పారు. టీడీపీ నేతలనూ పలకరించి, వారికి ధన్యవాదాలు చెప్పారు.

అంతటితో ఆగకుండా.. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భువనేశ్వరి ప్రత్యక్షమయ్యారు. కొడుకు పాదయాత్రకు సహకరిస్తూ, ఆయన వెన్నంటే ఉన్న లోకేష్ బృందానికి ఆమె స్వయంగా కొసరి కొసరి

అన్నం వడ్డించడంతో, లోకేష్ బృందం ఖుషీ అయింది. ఆమె స్వయంగా తమ వద్దకు వచ్చి అన్నం వడ్డించడం మరిచిపోలేని అనుభూతి అని వాలంటీర్లు- లోకేష్ బృందం ఆనందం వ్యక్తం చేశారు.

‘‘ లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు, మీరంతా నెలల తరబడి కుటుంబాలను విడిచి ఇక్కడకు రావడం ఎంతో గొప్ప విషయం. అది సామాన్య విషయం కాదు. అది ఎంతో గొప్ప విషయం. మిమ్మల్ని పంపించినందుకు మీ కుటుంబాలకు కృతజ్ఞతలు. మీ ప్రేమ లోకేష్‌కు ఉండాలి. మీ సేవలు అమూల్యం. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు. ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు లోకేష్ అదృష్టవంతుడు. వాలంటీర్లకు ధన్యవాదాలు. మీడియా, పోలీసులకు కృతజ్ఞతలు’’ అని వారినుద్దేశించి వ్యాఖ్యానించారు.

సహజంగా ఎప్పుడూ తెరపైకి రాని భువనేశ్వరి, తన కొడుకు లోకేష్ పాదయాత్ర వందరోజుల సందర్భంగా బయటకు వచ్చి, పాదయాత్రలో పాల్గొని, వాలంటీర్లు-లోకేష్ బృందానికి స్వయంగా భోజనం వడ్డించడం అందరినీ ఆకర్షించింది.

కాగా.. భువనేశ్వరితోపాటు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన వైద్యులు, ప్రతిరోజూ లోకేష్ ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. లోకేష్ డైట్‌ను వైద్యులు హైదరాబాద్ నుంచే పర్యవేక్షిస్తుండగా, పాదయాత్ర ముగిసిన తర్వాత లోకేష్ అప్పుడప్పుడూ కుటుంబసభ్యులతో ఫేస్‌టైంలో మాట్లాడుతున్నారు. మొత్తానికి లోకేష్ కు ఇది మదర్స్‌డే గిఫ్టు అనే చెప్పాలి.

Leave a Reply