Suryaa.co.in

Devotional

బిల్వమంగళుడు (లీలాశుకుడు )

బిల్వమంగళుని జీవితంలో యెన్నో కుదుపులు. మరెన్నో మలుపులు. ఆయన పూర్వజన్మ కూడా యెంతో ఆశ్చర్యం కొలుపుతుంది. బిల్వమంగళుడు పూర్వజన్మలో గొప్పసన్యాసి. శ్రీకృష్ణునికి అమితభక్తుడు. శ్రీకృష్ణునితో భావైక్యము పొందినవాడు. అయన అనేక భాగవత సప్తాహాలు చేస్తుండేవాడు, సన్యాసిగావుంటూ. ఆసమయంలో వచ్చిన భక్తులకు కష్టం కలుగకుండా, శ్రీకృష్ణ ప్రసాదాన్ని తయారు చేయించి పంచిపెడుతూ వుండేవాడు.

అలాంటి ఒక సమయంలో, సప్తాహం జరుగుతుండగా, మధ్యలో ఆయనవద్దవున్న ధనం అంతా ఖర్చు అయిపొయింది. ఇంకా ధనం కావలసివచ్చింది. ‘ ఎక్కడ తనకు సంపద దొరుకుతుందా భక్తులను సేవించడానికి, ‘ అని వెదుకసాగాడు. కొద్దిదూరం అలా వెదుకుతూ వెళ్లగా, యవ్వనంలో 18 వ యేట చనిపోయిన ఒక రాకుమార్తె శరీరాన్ని దహనం చేయడం కనిపించింది. ఆమె తల్లిదండ్రులు దుఃఖంతో కార్యక్రమం పూర్తికాకుండానే వెళ్లిపోయారు. ఆమె దేహంమీద యెంతో విలువైన వజ్రాలతో కూడిన బంగారునగలు ఆయనకు కనిపించాయి. ‘ ఈబాలిక శరీరంతో ఆ ఆభరణాలు దగ్ధమైతే యేమి ప్రయోజనము ? నేను తీసుకుని కృష్ణభక్తులను సంతృప్తి పరుస్తాను, యివి అమ్మగా వచ్చిన ధనంతో ‘ అని ఆమె పార్థివశరీరంపై, ఆ సన్యాసి, చేయి వేయబోయాడు.

అంతలో సన్యాసి నివ్వెర బోయేటట్లుగా, ‘ అగు మహానుభావా ! ఇవి నీవు తీసుకోకూడదు. నీకు సంపద కావలసివస్తే, నాతండ్రి యీ రాజ్యానికి రాజుకాబట్టి, ఆయన వద్దకువెళ్లి ధనం అడుగు. ఆయనకు నమ్మకం కలిగేట్లుగా, నా శయన మందిరంలో తలగడవద్ద వున్నపెట్టెలో, అఖండ సంపద వున్నదని చెప్పు. ఆ ధనాన్ని కృష్ణుని భక్తులకు ఉపయోగించు. ‘ అనిచెప్పింది. ఆ విధంగానే సన్యాసి, మహారాజుకు జరిగినదంతా చెప్పాడు. చనిపోయిన రాకుమార్తె చెప్పినట్లుగానే, ఆమె శయనాగారంలో పెట్టెలో సంపద వుండడం చూసి, సన్యాసి మాటలునమ్మి, మన:స్ఫూర్తిగా ఆ సంపదనంతా సన్యాసికి యిచ్చివేశాడు.

భాగవత సప్తాహంలో ఆ సొమ్మునంతా ఖర్చుచేసాడు, సన్యాసి. అయినా యింకాధనం కావలసివచ్చింది. అప్పుడు మళ్ళీ రాకుమార్తె శవం వద్దకువెళ్లి, ఆమె వంటిమీద వున్న వజ్రాల కంఠహారాన్ని తీసుకున్నాడు. అక్కడనుండి లేవగానే, రాకుమార్తె ఆత్మ, ‘ ఓ సన్యాసీ ! నీవు చాలా తప్పు చేసావు. నీవు చేసినది శ్రీకృష్ణభక్తుల కోసమే అయినా, నీ తప్పు నేను క్షమించలేక పోతున్నాను. నీవుచేసిన యీపాపానికి మళ్ళీ మానవజన్మ ధరించి, కాముకుడవై, నీతిమాలిన జీవితం అనుభవిస్తావు. ఇదే నాశాపం. ‘ అని కోపంగా శపించింది.

తరువాతి జన్మలో ఆ సన్యాసి బిల్వమంగళునిగా జన్మించి, స్త్రీలోలుడు అయ్యాడు. ఆ రాకుమారి ‘ చింతామణి ‘ అనే వేశ్యగా జన్మించింది. ఆమెయే ఆయన గురువుగా చివరకు మోక్షమార్గం చూపించింది.
ఆ సన్యాసి దక్షిణభారత దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చింతామణి అనే వేశ్య యొక్క గాఢమైన ప్రేమలో పడ్డాడు. ఆమెతో తన దేహవాంఛలు తీర్చుకుంటూ, ఆమెలేనిదే బ్రతకలేననే స్థితికి వచ్చాడు. భార్యాబిడ్డలను తృణీకరించాడు. యావదాస్తిని పోగొట్టుకున్నాడు.

ఆయన యెంతగా చింతామణి వ్యామోహంలో కొట్టుకుపోతున్నాడంటే, ఒకనాడు, అతి పెద్ద తుఫాను వాతావరణంలో, తన తండ్రిగారి శ్రార్ధ కర్మలు ఆచరించీ ఆచరించగానే, చింతామణి పొందుకోరి, విరహం తట్టుకోలేక, ఆమె యింటికి చేరడానికి ఒక నదిని దాటవలసి వస్తే, ఆ తుఫానులో కొట్టుకువస్తున్న, ఒకశవాన్ని, అది శవమని కూడా ఆలోచింపకుండా, దానినే ఆలంబనగా చేసుకుని ఆవలి ఒడ్డుకువెళ్లి, అక్కడ చింతామణి యింటి ద్వారాలు మూసివుండడంతో, గోడ ప్రక్కనుండి, ఇంకొక ఆధారంతో అది తాడు అనుకుని, దానితో ఆమె వుండే పైఅంతస్తుకు చేరుకున్నాడు. అయన గోడ యెక్కడానికి చేసుకున్న ఆధారం, నల్లత్రాచు. అదికూడా గమనించే స్థాయిలో లేడు బిల్వమంగళుడు.

ఆ సమయంలో, కామంతో రగిలిపోతున్న బిల్వమంగళుని చూసి, చింతామణి, ‘ నీవు నా రక్త మాంసాలతో కూడిన యీదేహం మీద యింత వ్యామోహం పెంచుకున్నావు. నీ ప్రాణాలను లెక్క చేయకుండా, తుఫానులో ఇంత సాహసం చేసి నా పొందు కోసం వచ్చావు. నా మీద చూపిస్తున్న యీ వ్యామోహంలో సహస్రపాలు అయినా, ఆ గోవిందుని మీద చూపించితే, నీకు జన్మ సార్ధకం అవుతుంది. నీవు వెంటనే బృందావనం వెళ్లి ఆశ్రీకృష్ణుని దర్శించి, అలౌకిక ఆనందం అనుభవించు. ‘ అని దిశా నిర్దేశం చేసింది చింతామణి.

అ విధంగా బయలుదేరిన బిల్వమంగళునిలో యింకా కామపుపాలు నశించలేదు. దారిలో, తాను బయలుదేరిన లక్ష్యం మర్చిపోయి, ఒక బ్రాహ్మణస్త్రీతో, తన కామం తీర్చుకున్నాడు. తాను చేసినపనికి తానే సిగ్గుపడి, యే స్త్రీతో అయితే, ఆయన ఆనందించాడో, ఆమె తలకు పెట్టుకునే, జడకు పెట్టుకునే పదునైన పరికరంతోనే, తన కళ్ళు ఊడబెరుక్కున్నాడు, బిల్వమంగళుడు. ఆ విధంగా, యిక తన జీవితంలో, మళ్ళీ బాహ్య ఆనందాలపై మనసు మరలకుండా, మాంసనేత్రాలు విసర్జించి, కనులముందు శ్రీకృష్ణుడే కదలాడేటట్లు కఠోరనిర్ణయం తీసుకుని అంధత్వాన్ని ఆహ్వానించాడు.

బిల్వమంగళుడు బృందావనం చేరిన తరువాత, కృష్ణ కర్ణామృతం రచించి గానం చేసాడు. రాధాకృష్ణుల బృందావన లీలలను కడురమ్యంగా వర్ణించాడు. కాలాంతరమున, సోమగిరి అనే మహాస్వామి వద్ద దీక్ష పుచ్చుకుని, ‘ లీలాశుకునిగా ‘ నామాంతరం చెంది, రాధాకృష్ణుల సేవలో తపించి తరించాడు. వారి లీలలు వర్ణిస్తూ వీణావాదనలో మైమరుస్తుంటే, యితర యేవాద్యాలు అవసరం లేకుండా పోయేవి.
బృందావనంలో బిల్వమంగళునికి ( లీలాశుకునికి ) కృష్ణ పరమాత్మ స్వయంగా, ప్రతిరోజూ, ప్రసాదం తినిపించి, సురక్షితమైన ప్రదేశంలోకి తీసుకువెళ్లి వదిలేవాడు.

అయితే, ఒకరోజు తనను నడిపిస్తున్న వ్యకి మధుర మనోహరంగా వేణువు వాయిస్తుంటే, సర్వం మరచిపోయి వినసాగాడు, లీలాశుకుడు. వెంటనే, ఆనందం పట్టలేక, కృష్ణుని చేయి పట్టుకున్నాడు లీలాశుకుడు, ఆప్యాయంగా, ‘ ఇక వదలను ‘ అన్నట్లు, ‘ నీవెవరో నాకు తెలిసిపోయింది ‘ అనేభావనతో. లీలామానుష విగ్రహుడైన, గోవిందుడు కూడా, ఒక్కసారి, లీలాశుకుని హస్తాన్ని స్పృజించి, మధురంగా నవ్వుతూ, అక్కడనుండి, పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. బిల్వమంగళుడు ( లీలాశుకులు ) యెంతో ఆనందంగా, ‘ గోవిందా ! నీవెవరో నాకు తెలిసిపోయిందిలే ! నా చేతిని వదిలి నీవు పరుగెత్తినా, నా గుండెలలో నుండి నిన్ను వెళ్లనీయనుగా ! ‘ అంటూ ఆయనకీర్తనలు పాడుకుంటూ మురిసిపోసాగాడు.
కాలాంతరమున, లీలాశుకులు ఎన్నో కీర్తనలు వ్రాసారు. అన్నింటిలో రాధాకృష్ణ ప్రేమను ఆవిష్కరించారు.
భోగిని యోగిగా చేసిన యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారాలతో….

– ఎంబీఎస్‌ గిరిధర్‌రావు

LEAVE A RESPONSE