కూటమి పాలన వస్తుందని తెలిసే జగన్ కు బీపీ

* ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ ప్రభుత్వమే
* జగన్ భయపడేలా కూటమి అభ్యర్థులకు బలమైన మెజార్టీ ఇవ్వండి 
* 70 మంది సిట్టింగులను మార్చిన జగన్.. నేను నియోజక వర్గం మారడంపై మాట్లాడటం హాస్యాస్పదం 
* వైసీపీ పాలనలో పదిసార్లకు పైగా కరెంటు బిల్లులు పెంచారు 
* ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తాం 
* పెడన ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ 

‘ఒక్క ఛాన్స్… ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడ’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్   అన్నారు. జగన్ భయపడేలా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే తెలిసే జగన్ కు బీపీ పెరిగిపోతోందని, ఆయన ఈ సారి ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా ధనం, ప్రకృతి సంపదను లూటీ చేసిన ప్రతి ఒక్కరికీ శిక్షపడేలా చేస్తామన్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పెడనలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు తో కలిసి ఆయన పాల్గొన్నారు. మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న  కాగిత కృష్ణ ప్రసాద్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ… “భీమవరం నుంచి పిఠాపురం వెళ్లిపోయాను అని జగన్ మాట్లాడాడు. 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాడు..? పెడనలో ఉన్న ఎమ్మెల్యేను మరో నియోజక వర్గానికి ఎందుకు పంపించాల్సి వచ్చిందో జగన్ సమాధానం చెప్పాలి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు జగన్.
ఈ ఐదేళ్లలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశావ్.. ఆడబిడ్డలకు రక్షణ లేదు.. రైతులు కన్నీరు కారుస్తున్నారు… నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతమందిని ఏడిపించిన ఈ దుష్టప్రభుత్వాన్ని ప్రజలంతా ఐక్యంగా ఇంటికి పంపించాలి.

పేదలను దోచేసి క్లాస్ వార్ అని మాట్లాడతాడు
జగన్ మాట్లాడితే క్లాస్ వార్ … క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే డబ్బున్న వాడు పేదవాడిని దోచేయడం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట పొట్టకొట్టింది పేదవాడినే. రూ.337 కోట్ల జాతీయ ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారు. కేవలం 6.22 కోట్లు మాత్రమే ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు చేశారు. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎక్కువగా జరిగిన రాష్ట్రమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వీ నిరంజన్   పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు.

పోలీసుల శ్రమ దోపిడీ చేసిన వ్యక్తి జగన్. టీఏ, డీఏలు ఇవ్వలేదు. సకాలంలో జీతాలు వేయడం లేదు. వారాంతపు సెలవు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ. 450 కోట్లు దారి మళ్లించి దోపిడీ చేశారు. 900 చేనేత సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.80 లక్షల నుంచి కోటి వరకు రావాల్సిన ఆప్కో నిధుల రాకుండా చేసిన వ్యక్తి జగన్. మత్స్యకారులకు ఉపాధి కల్పించలేకపోగా… వాళ్ల పొట్టకొట్టాలని జీవో నెంబర్ 217 తీసుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు.

విద్యుత్ కొనుగోళ్లలో రూ. 27,500 కోట్లు దోచుకున్నారు
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో కరెంటు బిల్లులను పదిసార్లు పైగా పెంచారు. రకరకాల ఛార్జీల పేరుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో యూనిట్ ధర రూ.5 ఉంటే ఇప్పుడు రూ.18కు పెరిగిపోయింది. చంద్రబాబు గారు 20 ఏళ్లకు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. చంద్రబాబు గారు అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఈ రోజు కరెంటు బిల్లులు చూస్తే జేబులకు చిల్లు పడేలా కనిపిస్తున్నాయి. కరెంటు కోనుగోళ్లలోనే దాదాపు రూ. 27,500 కోట్లు అవినీతి జరిగింది.

అతని నోరే పెద్ద డ్రైనేజ్ 
గత ఏడాది మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే… స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. కొత్త పాస్ పుస్తకం కావాలంటే రూ. 10 వేలు… చేపల చెరువుకు పర్మిషన్ కు లక్ష… చేపల దాణా షాపు పెట్టుకోవాలంటే రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరూ వెళ్లిన నమస్కారం పెట్టాలంటా.. పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తాడు. మట్టి మాఫియాపై ఫిర్యాదు చేస్తే చెట్టుకు కట్టి కొట్టాడు. చివరకు చనిపోయిన న్యాయమూర్తి ఆస్తులను ఆయన అనుచరులతో కబ్జా చేయాలని చూశారు. మున్సిపల్ వర్కర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఐదేళ్ల కాలంలో పెడనలో డ్రైనేజ్ పనులు చేయలేకపోయాడు కానీ … ఆయన నోరే పెద్ద డ్రైనేజీగా మార్చేశాడు.
పెడన నియోజకవర్గంలో దాదాపు 18 వేల మంది కలంకారీ, చేనేత వృత్తి చేసే కార్మికులు ఉన్నారు. ఇటీవల అప్పుల బాధతో పద్మనాభం, నాగలీలావతి అనే దంపతులు వాళ్ల బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కేవలం అధిక వడ్డీకి తీసుకొచ్చిన రూ. 3 లక్షల అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఏ ఒక్క చేనేత కార్మికుడు చనిపోకూడదన్నదే మా కూటమి లక్ష్యం. వారికి అండగా నిలబడే బాధ్యత తీసుకుంటాం. మల్టీకలర్ ప్రింటింగ్ మెషీన్ల రాకతో సహజ సిద్ధమైన రంగులు అద్దే ఈ కళ కళతప్పింది. కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కలంకారి వృత్తికి గ్లోబల్ ట్యాగ్ ఉంది. ఇమిటేషన్ ఆపి కలంకారీలను ఆదుకుంటాం. సహజ సిద్ధమైన రంగులు అద్దే ఈ కళకు నీటి ప్రవాహం అవసరం ఉంటుంది. ప్రింటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ వస్త్రాలను నదీ జలాల్లో శుభ్రపరుస్తారు. మొత్తం తయారీలో రెండు సార్లు ప్రవహించే నీటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా చంద్రబాబు   సమక్షంలో మాట ఇస్తున్నాం. ఐదెకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలా కలంకారీ కార్మికులకు ఏర్పాటు చేస్తాం.

నీలి విప్లవం తీసుకొస్తాం 
రాష్ట్రంలో దాదాపు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక జెట్టీ నిర్మిస్తాం. అధికారంలోకి రాగానే 13 జెట్టీలకు పనులు ప్రారంభిస్తాం. మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోకుండా ఇక్కడే ఉపాధి లభించేలా చూస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉండేలా మ్యానిఫెస్టోలో నీలి విప్లవం అని చెప్పింది. మత్స్యకారులకు జెట్టీల నిర్మాణం, మత్స్య సంపద పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దానిని ఇక్కడ బలంగా అమలు చేసి మత్స్యకారులకు అండగా ఉంటాం. మహిళలు తమ కాళ్లు మీద వాళ్లు నిలబడేలా చర్యలు తీసుకుంటాం. రైతాంగం కన్నీరు పెట్టకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. శ్రీరామనవమి పర్వదినం కావడంతో ఈ రోజు మా పార్టీ అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చాం. వాళ్లతో ప్రమాణం చేయించాను, రాష్ట్ర భవిష్యత్తు కోసం బలంగా పనిచేసేలా కృషి చేస్తామని మాటిచ్చారు. మేము రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. మా అభ్యర్థులను గెలిపించండి. జగన్ భయపడేంత బలమైన మెజారిటీతో గెలిపించండి. కుల వివక్ష తీసుకొచ్చి మాలో మేము కొట్టుకోవాలని జగన్ కోరుకుంటున్నాడు. అందుకే చంద్రబాబు ని, నన్ను మా సామాజికవర్గం వ్యక్తులతో తిట్టిస్తాడు. ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయన ఆశ నెరవేరదు. మీరు తిట్టే కొద్దీ మేము బలపడతాం తప్ప బలహీన పడం.

జగన్ పచ్చి అబద్ధాలు చెబుతాడు 
అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్… సారా వ్యాపారిగా మారిపోయాడు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా పారిస్తున్నాడు. ఈ కల్తీ మద్యం తాగినవారిలో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. మద్యం వ్యాపారంలో జగన్ రూ. 40 వేల కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతోనే ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తున్నాడు. కల్తీ మద్యంతో ఆడపడుచుల పసుపుకుంకుమను దూరం చేస్తున్న ఇలాంటి వ్యక్తిని తన్నితరిమేయండి.  జగన్ చెప్పినట్లు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయడం సాధారణ విషయం కాదు. ఎన్డీఆర్ గారు ప్రయత్నించిన చేయలేకపోయారు. మన రాష్ట్రానికి  ఒడిశా, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, తెలంగాణ, యానాం సరిహద్దులుగా ఉన్నాయి. మనం ప్రయత్నించినా అక్కడ నుంచి వచ్చేస్తాయి. మద్యం ఆదాయంలో లాభం చూసుకోకుండా, నాణ్యమైన మద్యం ఇవ్వడం, మహిళలు వద్దు అన్న చోట మద్యం దుకాణాలు లేకుండా చూడటం విధానంగా ముందుకు వెళ్తాం.

నిండు మనసుతో ఆశీర్వదించండి
కృష్ణా జిల్లాలో 56 ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి. 40 లక్షల ఇళ్లకు మంచినీటి సౌకర్యం లేదు. జిల్లాలో చర్మ, కిడ్నీ వ్యాధిగ్రస్థులు పెరిగిపోయారు. ముఖ్యంగా ఎ.కొండూరు, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కృత్తివెన్ను, నందిగామ, మైలవరం వంటి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఇసుక మాఫియా చేసిన గుంతల్లో పడి ఈ జిల్లాలో దాదాపు 76 మంది మృత్యువాత పడ్డారు. జగన్ ఇంటిపక్కన కూడా అక్రమ ఇసుక రీచ్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుకను అడ్డగోలుగా దోచుకున్న వారిని శిక్షిస్తాం. సీపీఎస్ రద్దుకు ఏడాదిలోపు పరిష్కార మార్గం కనిపెడతాం. ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఉద్యోగులు, రైతులు, ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడేలా చూస్తాం. రైతులు సంతోషంగా ఉండాలనే కూటమి లోని మూడు పార్టీలు త్యాగాలు చేసి ప్రజల ముందుకు వచ్చాం. నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Leave a Reply