Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు

-చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరం
-ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ మోసగించారు
-విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనాచౌదరి
-బీజేపీ కార్యాలయంలో ఘనంగా బాబు జన్మదిన వేడుకలు

ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి 75 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు.

ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ అధికారం లోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని, అమరావతి అభివృద్ధి, ఏపీ ప్రయోజనాలు, శాంతి భద్రతలు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలిపారు. చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్య క్షుడు అడ్డూరి శ్రీరామ్‌, టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ఎస్‌.బేగ్‌, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, జనసేన ఆంధ్ర జొన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌, జనసేన నాయకురాలు రజిని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE