Suryaa.co.in

Andhra Pradesh

దోపిడీకి కాదేదీ అనర్హం చందంగా వైసీపీ దోపిడీ

– దేవతా మూర్తులనూ వదలని వైనం
– దొంగల ముఠా దోపిడీ పాలనలో రాష్ట్రం దుస్థితి
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్

వైసీపీ దొంగల ముఠా పరిపాలన దోపిడీకి కాదేదీ అనర్హం అన్న విధంగా కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దోపిడీలపై టీడీపీ నాయకులు విజయవాడ కృష్ణానది నుండి కనకదుర్గమ్మ ఆలయం వరకు వినూత్న నిరసన కార్యక్రమాన్ని సోమవారం బుచ్చిరామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా కృష్ణమ్మను, కనకదుర్గమ్మను వైసీపీ దొంగల నుండి తమను తాము కాపాడుకోవాలని టీడీపీ కార్యకర్తలు వేడుకున్నారు.

ఈ సందర్భంగా బుచ్చిరామ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీరుస్తున్న కృష్ణమ్మను వైసీపీ దొంగలు నిరంతరం దోచుకుంటూనే ఉన్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలను మంటగలిపి కృష్ణానదిలోని ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకకుండా చేస్తున్నరని తెలిపారు. వైసీపీ నాయకులు ఇసుకను దోచుకుని, పేదవాడికి రెట్టింపు ధరకు ఇసుకను అమ్ముకుంటున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు జరుగుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిలేక లక్షలాది కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని తెలిపారు. ఈ పాపం ఊరికే పోదని, కార్మిక కుటుంబాలు వైసీపీ దొంగల ముఠాకి తగిన బుద్ధి చెబుతాయన్నారు. వైసీపీ దొంగలు రాష్ట్రంలో దొరికిన ప్రతి వనరును దోచుకుంటున్నారని విమర్శించారు.

కృష్ణానదిని అడ్డగోలుగా వైసీపీ పాలకులు వాటాలు వేసుకుంటూ దోచుకుంటున్నారని, ఈ దోపిడీలో చివరకు అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ కూడా బాధితురాలు కావడం అత్యంత భాధాకరమన్నారు. కృష్ణమ్మ నుండి కనకదుర్గమ్మ అమ్మవారి వరకు వైసీపీ దొంగల ముఠా తమ దోపిడీని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. దుర్గమ్మ చెంత వెండి విగ్రహాల చోరీ, అమ్మవారి సొమ్ము దోచుకోవటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, వీటిపై వైసీపీ పెద్దదొంగ నోరువిప్పే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. వైసీపీ దొంగల రాజ్యం నుండి తమను తాము కాపాడుకోవాలని, దొంగల రాజ్యం పై కన్నెర్ర చేయాలని కోరుతూ తేదేపా నాయకులు కనకదుర్గ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి దుర్గమ్మను వేడుకొన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగలపై కన్నెర్రజేసి ఈ రాష్ట్రాన్ని, తనని తాను కాపాడుకోవాలని దుర్గమ్మను వేడుకున్నారు. దోచుకున్న ప్రతి రూపాయిని ఒక్క పైసా కూడా వదలకుండా వెనక్కి రప్పించేవరకు ఈ పోరాటం ఆగదన్నారు. వైసీపీ దొంగల ముఠాకు త్వరలోనే దుర్గమ్మ, కృష్ణమ్మ తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పరేటర్ గండూరీ మహేష్, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు శివశర్మ పలువురు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE