– విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల చంద్రబాబు హమీ ఇచ్చారు
– ఇప్పుడు ప్రతి యూనిట్కు సగటున రూ.1.25 పెంచుతున్నారు
– ఫిబ్రవరి తర్వాత మరో రూ.9,412 కోట్ల భారం మోపబోతున్నారు
– మొత్తంగా రూ.15,485 కోట్ల విద్యుత్ భారం
– 6 నెలల్లో రూ.70 వేల కోట్ల అప్పులు
– కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై పవన్ డ్రామా
– తన మంత్రే ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలియదా?
– తన మంత్రిపై అనుమానంతో కూడా వెళ్ళి ఉండవచ్చు!
– పోర్టులో బియ్యం ఎగుమతులపై వ్యాపారులతో బీజేపీ నేతల సమావేశాలు
– ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అనుమతులు ఇప్పించింది వాస్తవం కాదా?
– షర్మిలను ఒక పార్టీ నాయకురాలిగా మేం గుర్తించడం లేదు
– విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ నెల నుంచి ప్రజలపై రూ.6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం మోపుతున్నారని, ప్రతి యూనిట్ కు సగటున రూ.1.25 పెంచుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్సీపీ త్వరలోనే తన విధానాన్ని ప్రకటించబోతోందని, తమ పార్టీ ప్రజాగళాన్ని వినిపిస్తుందని వెల్లడించారు.
మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..: విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా రూ.6,072 కోట్ల భారాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత మరో రూ.9,412 కోట్ల భారం మోపబోతున్నారు. అంటే మొత్తంగా రూ.15,485 కోట్ల మేర విద్యుత్ భారాన్ని ప్రజలపై వేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ. 67,237 కోట్లు అప్పులు చేసింది. ఈ మంగళవారం మరో రూ.4 వేల కోట్లు అప్పు తీసుకోబోతున్నారు. అంటే దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులు చేశారు. దీనిలో నుంచి విద్యుత్ ట్రూఅప్ భారం రూ.15,485 కోట్లు డిస్కంలకు చెల్లించలేరా?
పెన్షన్ వెయ్యి రూపాయల పెంపు, అరకొర సిలిండర్లు తప్ప ఇప్పటి వరకు ఏ హామీని మీరు నెరవేర్చారు? కనీసం బడ్జెట్ లో మీ హామీలను నెరవేర్చడానికి కేటాయింపులు కూడా చేయలేదు.
కూటమి ప్రభుత్వానికి ఒక విధానం, నిర్దిష్ట ప్రణాళిక లేదు. పాలన అస్తవ్యస్తంగా మారింది. బూడిద ఆదాయం కోసం కూటమి ఎమ్మెల్యేలు పోట్లాడుకుంటున్నారు. దానిపై సీఎం చంద్రబాబు ఏకంగా పంచాయితీ చేస్తున్నారు.
నూతన మద్యం విధానం పేరుతో బెల్ట్షాప్లకు బహిరంగ వేలం వేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని ఒక ఊరిలో బెల్ట్షాప్ నిర్వహణను వేలంలో రూ.50 లక్షలకు దక్కించుకున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై టీడీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చాయి.
కాకినాడ పోర్టులో పవన్ హంగామా. గబ్బర్సింగ్ సినిమా పార్ట్–3:
కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా గబ్బర్సింగ్ పార్ట్–3ని తలపిస్తోంది. బియ్యం అక్రమ రవాణాపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యేను నిలదీసిన పవన్కళ్యాణ్కు అసలు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నది తన పార్టీ సభ్యుడే అనే విషయం తెలియదా? అలాగే పౌర సరఫరాల అధికారులు ఎవరి ఆధీనంలో పని చేస్తున్నారు?.
బియ్యం రవాణాపై సంబంధిత మంత్రి తనిఖీలకు వెళ్ళారంటే అర్థం ఉంది. పవన్కళ్యాణ్ కూడా వెళ్లారంటే తన మంత్రిపై అనుమానంతో కూడా వెళ్ళి ఉండొచ్చని అనుకోవాల్సి వస్తోంది. బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం చిత్తశుద్ది ఏమిటో త్వరలోనే బయటకు వస్తుంది.
దీనిపై మాట్లాడుతున్న బిజెపి నేతలు గతంలో ఏం చేశారో మరిచిపోయారు. పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై వ్యాపారులతో ఆ పార్టీ నేతలు ఇళ్ళలో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ అనుమతులు ఇప్పించిన విషయం వాస్తవం కాదా?
కాకినాడ పోర్టులో పనులు ఏ సామాజికవర్గం వారు చేస్తున్నారంటూ డైవర్షన్ రాతలు పత్రికల్లో రాయిస్తున్నారు. తప్పు జరుగుతోందా? లేదా? తప్పు జరిగితే దానికి ఎవరు బాధ్యులు?. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామన్న విషయాన్ని పక్కకు పెడుతున్నారు.
షర్మిలను అసలు మేం ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగానే గుర్తించడం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రెస్మీట్లో పాల్గొన్నారు.