హైదరాబాద్: సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు క్యాబినెట్ భేటీ కొనసాగింది. ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.
కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించాం. పకడ్బందీగా సర్వేచేసి సమాచారం సేకరించాం. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నాం. కులగణన విషయంలో ప్రధానిపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తాం. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా! ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదు” అని వ్యాఖ్యానించారు.