టీడీపీలో కన్నా సర్దుకుపోగలరా?

– కన్నాకు పోలిట్‌బ్యూరో పదవి?
– ఇక జగన్‌పై కన్నా తురుఫుముక్క?
– కన్నా రాకతో గుంటూరు-కృష్ణా జిల్లా కాపుల్లో కదలిక?
( మార్తి సుబ్రహ్మణ్యం)

సుదీర్ఘకాలం తెలుగుదేశం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహించి.. ఇప్పుడు అదే పార్టీ ‘సైకిల్’ ఎక్కబోతున్న మాజీ మంత్రి, మాస్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కోట్ల, చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్ తురుపుముక్కగా పనిచేసిన కన్నా, ఇప్పుడు టీడీపీకి తురుపుముక్క కాగలరా? దశాబ్దాల పాటు సభలో-బయటా చంద్రబాబు నాయుడును కడిగేసిన కన్నా, ఇప్పుడు అదే బాబుతో కలసి అడుగులేయగలరా?

లోప్రొఫైల్ స్కూలు, ముక్కుసూటిగా వ్యవహరించే కన్నా.. విభిన్న సిలబస్ ఉన్న టీడీపీ యూనివర్శిటీలో రాణిస్తారా? కాపు నేతగా ఇమేజ్ ఉన్న కన్నా రాకతో, కాపులు టీడీపీ వైపు అడుగులేస్తారా? కన్నా రాకతో టీడీపీకి లాభమా? టీడీపీతో కన్నాకు లాభమా? అసలు కన్నాకు టీడీపీలో లభించే గౌరవమేమిటి? ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.

కన్నా లక్ష్మీనారాయణ. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రుల చేతిలో బ్రహ్మాస్త్రం ఆయన. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సంధించే అస్త్రశస్త్రాలకు.. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాచుకుని, ఎదురుదాడి చేసే యోధుడాయన.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా..ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా.. కాంగ్రెస్ తరఫున అస్త్రశస్త్రాలు సంధించే నాయకుడాయన. అలాంటి కన్నా ఇప్పుడు.. తాను ఎదురుదాడి చేసిన అదే టీడీపీ తీర్థం తీసుకున్నారు. విచిత్రంగా ఉంది కదూ?! రాజకీయమంటే అదే మరి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులూ ఉండరన్న, దేవరాజ్ ఆర్స్ సిద్ధాంతం మరోసారి రుజువైన సందర్భం!

అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో సర్దుకుపోగలరా? ఆయన స్థాయికి తగ్గ గౌరవం టీడీపీ నాయకత్వం ఇస్తుందా? ప్రధానంగా కాపు నేతలున్న పార్టీలో, అదే కులంలో మాస్ ఇమేజ్ ఉన్న కన్నా రాకను కాపు నేతలు జీర్ణించుకుంటారా? గుంటూరు జిల్లాలో పాతుకుపోయి, మంత్రి పదవుల కోసం కాచుకుని ఉన్న సీనియర్లు, కన్నా రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఆయనతో కలసి పనిచేస్తారా? బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలో పనిచేసిన కన్నా.. ఏక నాయకత్వం ఉన్న టీడీపీలో ఇమడగలరా? ఇప్పుడు అందరినీ ఆసక్తికి గురిచేస్తున్న అంశం ఇదే.

కాపు నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం తీర్ధంతో .. రాజధాని గుంటూరు జిల్లాతోపాటు, కులరాజకీయ సమీకరణల్లో మార్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీలో చేరతారని బహుశా ఆయనతో సహా.. ఎవరూ ఊహించి ఉండరు. జాతీయ పార్టీ బీజేపీ నిరాదరణ, వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ ఒంటెత్తు వైఖరి-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవ రాహిత్యం.. కలసి వెరసి ఆయనను, టీడీపీ వైపు అడుగులు వేసేందుకు కారణం అయి ఉండవచ్చు.

పైగా కన్నా సమర్థత, రాజకీయ వ్యూహాలపై చంద్రబాబుకు ఉన్న అవగాహన – కన్నా రాజకీయ ప్రత్యామ్నాయ ఎంపిక అందుకు దోహదపడి ఉండవచ్చు. కాపు నేత అయిన కన్నా, జనసేనను ఎంచుకోకుండా, టీడీపీని ఎంపిక చేసుకన్నారంటే.. ఆయనకున్న రాజకీయ అనుభవం-ముందుచూపు ఎంత విస్తృతమయిందో ఊహించుకోవచ్చు. ఆయన ఒకవేళ జనసేనలో చేరితే, మరో పవర్ సెంటర్ అవుతారు. యోధానుయోధులైన సీఎంల వద్ద పనిచేసిన కన్నా సొంత వ్యక్తిత్వం-దూకుడును, జనసేనలో చేరితే పవన్ తట్టుకోలేరు. అదీ కాకపోతే మహా అయితే కన్నా, జనసేనలో నెంబర్‌టూ స్థాయికి చేరవచ్చు. అయినప్పటికీ, క్యాడర్ -పార్టీ నిర్మాణం లేని జనసేనలో చేరి, కన్నా సాధించేది శూన్యం. బహుశా అలాంటి అంచనాతోనే, ఆయన జనసేన వైపు మొగ్గుచూపి ఉండకపోవచ్చు.

దశాబ్దాల పాటు మంత్రి-ఎమ్మెల్యేగా జనం మధ్యలో ఉండి, మాస్ పొలిటీషియన్‌గా పనిచేసిన కన్నాను వాడుకోవడంలో బీజేపీ విఫలమయింది. బీజేపీలో చేరకముందు, కన్నా చుట్టూ వందలు-వేల మంది జనం కనిపించేవారు. రాజకీయ ఎత్తుగడలు, పార్టీ కార్యక్రమాలు, సమీక్షలతో నిరంతరం బిజీగా ఉండే కన్నాను బీజేపీ ఖాళీగా కూర్చోపెట్టింది. క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ, మాస్ లీడర్‌గా ఉన్న కన్నా లాంటి నేతలు అలాంటి పరిణామాలు ఇబ్బందికరమే. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరుతుండటంతో, మళ్లీ కన్నా నివాసం జనంతో కళకళలాడుతోంది. మాస్ లీడర్లకు ఉన్న విలువ అది. ఈ సూత్రం కన్నాకే కాదు. ఏ మాస్ లీడరకయినా వర్తించేదే.

తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను తయారు చేసిన కన్నాకు, నియోజకవర్గ స్థాయి నేత కూడా కాని సోము వీర్రాజుతో కలసి పనిచేయడం, అవమానం అనిపించడంలో తప్పలేదు. అయితే, బీజేపీ స్కూల్ సిలబస్‌ను సరిగ్గా అర్ధం చేసుకోవడంలో కన్నా లాంటి నేతలు విఫలమవుతున్నారు. సోము లాంటి నేతలకు సొంత ఊళ్లలో పలుకుబడి లేకపోయినా, బీజేపీ దృష్టిలో అలాంటి వారే మహానేతలు.

ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు.. ఇంటి పక్కన వాళ్లు కూడా పట్టించుకోని వారంతా, బీజేపీలో రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలు. జనంలో ఠికాణా లేని వీరంతా పేపర్ టైగర్లు. జాతీయ నాయకత్వానికి కూడా, వీరు తప్ప మరొకరు గతిలేని పరిస్థితి. ఆంధ్రాలో ఈ బాపతు నాయకుల సంఖ్య డజన్లలోనే ఉంటుంది.

ఇతర పార్టీల్లో మంత్రులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారంతా.. బీజేపీ సీనియర్లకు మరగుజ్జులుగా కనిపిస్తుంటారు. వేదిక మీద కూర్చునే స్ధాయి కూడా లేని వారంతా, తమ పక్కన కూర్చోవడం.. అలాంటి వారంతా తమను నిర్దేశించటం, ఇతర పార్టీల నుంచి చేరిన సీనియర్లకు ఇబ్బందికర పరిణామమే.

బీజేపీ వంటి లిమిటెడ్ పార్టీలో మాస్ ఇమేజ్ ఉన్న నేతలు ఇమడటం కష్టమేనన్న నిజం కన్నా నిష్క్రమణతో మరోసారి రుజువయింది. పార్టీ వ్యవస్థాపక కాలం నుంచి పనిచేస్తున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని బీజేపీ సీనియర్లు సహజంగా సహించలేరు. ఆ క్రమంలోనే వారిని పొమ్మనలేక పొగబెడుతుంటారు. ఈ విబేధాల నేపథ్యంలో కన్నా లాంటి నేతలు పార్టీ నుంచి నిష్క్రమించడంలో ఆశ్చర్యం లేదు.

ఇప్పుడు సొంత వ్యక్తిత్వం- ఇమేజ్- కులబలం ఉన్న అలాంటి కన్నా, టీడీపీలో ఎంతవరకూ నెట్టుకురాగలరు? వ్యక్తిస్వామ్యం- ప్రచార లక్షణాలు ఎక్కువగా ఉండే టీడీపీలో.. వాటికి దూరంగా ఉండే కన్నా లక్ష్మీనారాయణ, ఎంతవరకూ మనుగడ సాగించగలరన్న ప్రశ్నలు తెరపైకి రావడ ం సహజమే. అయితే, సుదీర్ఘకాలం అసెంబ్లీలో-బయట కన్నా దూకుడును స్వయంగా చూసిన చంద్రబాబు, ఆయనకు సముచిత గౌరవం-గుర్తింపు ఇస్తారన్న అంచనా ఉంది. అంటే కన్నా చేరిన వెంటనే.. పొలిట్‌బ్యూరో లేదా పార్టీ జాతీయ కమిటీలో స్థానం కల్పించవచ్చు. వైసీపీపై కన్నాను తురుపుముక్కగా ఎలా సంధించాలో చంద్రబాబుకు ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

పైగా ఈ క్లిష్ట సమయంలో, అధికారంలో ఉన్న వైసీపీని కాదని.. ప్రతిపక్షంలో ఉన్న తన పార్టీలో చేరిన కన్నా వల్ల, కాపులు ఏ స్థాయిలో ప్రభావితం అవుతారో బాబుకు తెలియదనుకుంటే పొరపాటే. నిజానికి టీడీపీలో ఇప్పుడున్న కాపు నేతలెవరూ, ఆ వర్గంపై ప్రభావితం చేసే స్థాయిలో లేరు. ఆ లోటును కన్నాతో భర్తీ చేసేందుకు బాబు లాంటి వ్యూహకర్త సహజంగా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే టీడీపీలో చేరనున్నారన్న సంకేతాలు అందిన వెంటనే గుంటూరు-కృష్ణా జిల్లాల్లోని కాపులు కన్నాకు మద్దతు ప్రకటిస్తుండటం విశేషం.

ఇక కన్నా టీడీపీలో ఇమడగలరా? అన్న ప్రశ్నలకు సమాధానం సింపుల్. ఒకప్పుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మైసూరారెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి, వంటి మంత్రులు.. టీడీపీ తీర్ధం తీసుకుని ఎంపీలయ్యారు. టీడీపీ చీలిక సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలబడి, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ప్రతిభాభారతి, కిరణ్ హయాంలో మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ, కొండ్రు మరళి, పీఆర్పీలో బాబుపై విరుచుకుపడిన కళా వెంకట్రావు లాంటి నేతలంతా టీడీపీలో చేరితే బాబు వారిని ఆహ్వానించారు.

వీరిలో కళా వెంకట్రావుకు ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వగా, కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి ఎంపీ సీటిచ్చారు. ఇక గతంలో బాబును వ్యతిరేకించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

బాబు సీఎంగా ఉన్నప్పుడు, దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ హడావిడి చేసి, జగన్ కోసం శ్రమదానం చేసిన దళితనేత మహాసేన రాజేష్ కూడా, తాజాగా టీడీపీ తీర్ధం తీసుకున్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు నానా యాగీ చేసి, మేధావులను కూడగట్టి, జగన్ కోసం పనిచేసిన లక్ష్మణరెడ్డి, తాజాగా టీడీపీలో చేరిన కన్నాకు మద్దతు ప్రకటించారు. ఫక్తు రాజకీయ నాయకుడయిన బాబుకు.. ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలిసినందున, కొత్తగా చేరే కన్నా లాంటి వారి గౌరవానికి వచ్చిన భంగమేమీ ఉండకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

పైగా కన్నా చేరికతో టీడీపీ రాజకీయంగా లాభపడుతున్నందున, ఆయనకు సముచిత స్థానం కల్పించేందుకు చంద్రబాబు కూడా పెద్దగా సందేహించకపోవచ్చు. అటు కన్నా కూడా.. ఇప్పటికే రెండుసార్లు మారినందున, తన ఏజ్-ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, పాత పద్ధతులను పక్కనపెట్టి, కొత్త అడుగులు వేయటం అనివార్యం.

Leave a Reply