Suryaa.co.in

Telangana

మూడు రోజుల్లోనే వరి ధాన్యం రైతుల ఖాతాల్లో నగదు జమ

-ప్రతిపక్షాలకు రుచించక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
-ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది
-గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు కేంద్రాల సంఖ్య, ధాన్యం సేకరణ, -నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నాం
-500 బోనస్ సన్న ధాన్యంతో మొదలుపెట్టాం
-మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం
-వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అన్నాడు

హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించడం లేదు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.

రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బిజెపి నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. బీ ఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైనది కాదు, అత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు, గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు అని వివరించారు.

మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు. ఇక ధాన్యానికి భువనస్ విషయానికి వస్తే సన్నాలకు 500 రూపాయల బోనస్ తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తు ల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నాం దీనికి కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గము.. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

LEAVE A RESPONSE