Suryaa.co.in

Andhra Pradesh

సిట్ రిపోట్ ను వెంటనే డీజీపీ బయట పెట్టాలి

• జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే
• టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనేఅరెస్ట్ చేయాలి
• రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలి
• సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి
• అధికారుల సస్పెండ్ పై పోలీసు సంఘం నోరుమెదపాలి
• వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయలేదు
• హింస సృష్టించిన వైసీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టడంపై విచారణ చేపట్టాలి
• మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు

జగన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరైనా, ఎప్పుడైనా బుగ్గివ్వడమే తప్ప బాగుపడిన చరిత్ర ఎవరికీ లేదని.. అధికారుల్ని వాడుకోవడం, వారి జీవితాలు నాశనమైపోయిన తరుణంలో వదిలి పారిపోవం జగన్ కు అలవాటేనని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే అధికారులు జైలుపాలు కావడం ఖాయమన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ..
తండ్రి అధికారంలో ఉన్నపుడు తన అవినీతి కోసం అధికారులతో ఇష్టానుసారంగా అడ్డదారులు తొక్కించి.. వారిని జైలు పాలు చేశారు. సర్వీసు రికార్డుల్లో బ్లాక్ మార్క్ వేశారు. ఆల్ ఇండియా టాపర్ గా నిలిచిన శ్రీలక్ష్మి చీఫ్ సెక్రటరీ కాకపోవడానికి జగన్ రెడ్డి కేసులే కారణం. జగన్ రెడ్డి సీఎం అయ్యాక మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎలా అవమానించారో చూశాం. డీజీపీగా జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తిన గౌతం సవాంగ్ పరిస్థితి ఏంటో అంతా చూశారు. అయినా.. కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు జగన్ రెడ్డి చెప్పినట్లు ఆడి, రూల్ ఆఫ్ లాని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

కొంత మంది తాత్కాలిక లబ్ది కోసం జగన్ రెడ్డి లాంటి ప్రజాస్వామ్య ఘాతకుడికి అండగా నిలిచారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా చేసిన జగన్ రెడ్డి లండన్ పారిపోయాడు. సజ్జల ఎక్కడున్నాడో తెలియదు. పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, రాజేంద్రనాథ్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి పరారైపోయారు. కానీ, ఇక్కడే ఉండి సర్వీసు కొనసాగిస్తున్న అధికారులు అనవసరంగా వారి పరువు పోగొట్టుకున్నారు.

చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాచర్లలో పిన్నెల్లి సోదరులు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దాడుల్ని ప్రోత్సహించారు. డీఎస్పీ చైతన్య, ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి అధికారులు వైసీపీ నేతల మాటలు విని ప్రజల్ని హింసించారు.

పల్నాడు కలెక్టర్ శివశంకర్, పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, తిరుపతి జిల్లా డీఎస్పీ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ కె. రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి ఇన్ స్పెక్టర్ రామచంద్రారెడ్డి సస్పెండ్ అయ్యారు. పల్నాడు జిల్లాలో గురజాల డీఎస్పీ పల్లపురాజు, నరసరావుపేట డీఎస్పీ వి.ఎస్.ఎన్.వర్మ, డీఎస్బీ ఇన్ స్పెక్టర్లు ప్రభాకర్ రావు, బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్సై రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్సై డి.వి.కొండారెడ్డిని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అనంతపురంలో తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి ఇన్ స్పెక్టర్ మురళీ కృష్ణ సస్పెండ్ అయ్యారు. వైసీపీ నేతలు ఆడుతున్న కుట్రల రాజకీయంలో అధికారులు, పోలీసు సిబ్బంది బలైపోవడం బాధాకరం.

పోలీసులు, ఇతర ఉన్నతాధికారుల సర్వీసును కొంత మంది రాజకీయ కీచకులు నాశనం చేస్తుంటే పోలీసు అధికారుల సంఘం, ఇతర ఉద్యమ సంఘాలు ఏమైపోయాయి? ఈ అరాచకాలకు జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, సీతారామాంజనేయులే కారణం.

ఎన్నికలకు ముందు వీరంతా రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని వైసీపీకి సహకరించాలంటూ సూచించారు. తక్షణమే సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వీరి కాల్ డేటా బయట పెట్టాలి. అల్లర్లు సృష్టించి దొడ్డిదారిన గెలిచేందుకు ప్లాన్ చేసి వారి అరాచక రాజకీయ క్రీడలో పోలీసు అధికారుల్ని, వారి జీవితాలను బలిచ్చారు.

వందలాది పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు, ఇతర మారణాయుధాలు వైసీపీ నేతల ఇళ్లల్లో దొరికినా గానీ ఎందుకు అంత తీవ్రమైన కేసులు పెట్టలేదు? కేసుల్ని నీరుగార్చే కుట్రలో కూడా వైసీపీ నాయకులు అధికారుల్ని ప్రభావితం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న ఘటనలన్నీ వైసీపీ నేతల ప్రోత్సాహంతో, వైసీపీ నేతలు వెనకుండి నడిపించినవే.

దీనికి అధికారులు, పోలీసులు సహకరించి వారి సర్వీసుని నాశనం చేసుకున్నారు. తక్షణమే ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన ఘటనల్లో పాత్రదారులతో పాటు సూత్రధారుల పాత్రపైనా విచారణ జరిపించాలి. రాష్ట్ర పోలీసు అధికారులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలి.

వైసీపీకి అధికారం శాశ్వతం అన్నట్లు అధికారులు పనులు చేశారు. మా హెచ్చరికలను పట్టించుకోలేదు. నేడు మూల్యం చెల్లించుకుంటున్నారు. సిట్ నివేదను బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ చెప్పాలి. గొడవకు కారకులైన పిన్నెళ్లి సోదరులను ఎందుకు అరెస్ట్ చేయడంలేదో డీజీపీ చెప్పాలి. ఆనాడు స్థానిక సంస్థల్లో మా అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధు చేయడానికి వెళితే నా మీద హత్యాయత్నం చేశారు.

నామీదే కేసు పెట్టారు. పిన్నెల్లి అధికార దుర్వినియోగం ఏవిధంగా జరిగిందో నా కేసే ఉదాహరణ. కేసుకోసం కోర్టుకు వస్తే ఈసారైన చంపాలని పిన్నెళ్లి దొంగల ముటా ప్రయత్నం చేశారు. పల్నాడులో సస్పెండ్ అయిన ఎస్పీ పట్టుకున్న బాంబులు, కొడవళ్లు, డీజీపీకి కనిపించడంలేదా? పల్నాడులో జరిగిన దౌర్జన్యాలు మీడియా చూపించినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.

వైసీపీ నేతల కనుసన్నల్లో ఇంత అరాచకం జరుగుతుంటే.. ఎలక్షన్ కమిషన్ చర్యలుతీసుకోమనే వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణం. టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసినా.. టీడీపీ నేతలను వెంటబడి కొట్టినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. పోలీసు వ్యవస్థను జగన్ రెడ్డి నాశనం చేశాడు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. అరాచకం సృష్టించిన నేతలను, సహకరించిన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఉక్కు పాదం మోపి కటకటాల్లోకి పంపాలి.

LEAVE A RESPONSE