Suryaa.co.in

Andhra Pradesh

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలపై సిబిఐ విచారణ

-గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలి
-ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు
-సర్వీస్ కమిషన్ ను జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడు
-లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
-ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారు
-రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతుకోశారు
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్

అమరావతి: రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలయ్యిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి సిఎం జగన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ఎపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలయ్యిందని అన్నారు.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయని..వాటికి కారణాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకన అంటూ మోసపూరిత చర్యలతో రాజకీయ మూల్యాంకనంకు పాల్పడ్డారు అని మండిపడ్డారు. తమ వారిని పోస్టింగుల్లో కూర్చోబెట్టుకునేందుకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుని అర్హులైన వారికి అన్యాయం చేశారని అన్నారు.

ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడి సర్వీస్ కమిషన్ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీశారని అన్నారు. ఏపీపీఎస్సీని రాజకీయ పునారావాస కేంద్రంగా మార్చి….అక్రమాలకు పాల్పడడమే కాకుండా హైకోర్టును సైతం మూల్యాంకనం విషయంలో తప్పు దోవ పట్టించే ప్రయత్నం విస్మయం కలిగించిందని అన్నారు. ఈ అక్రమాల వెనుక ఉన్న సర్వీస్ కమిషన్ పెద్దల పాత్ర నిగ్గుతేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతమ్ సవాంగ్, సంస్థకు కార్యదర్శిగా పనిచేసిన మరో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల అక్రమాల వల్లనే పరీక్షల రద్దు జరిగిందని అన్నారు. సీబీఐ విచారణ జరిపితే ఉన్నతాధికారుల పాత్రతో పాటు ప్రభుత్వ పెద్దల అక్రమాలు కూడా బట్టబయలు అవుతాయని అన్నారు.

ప్రభుత్వానికి ధైర్యం ఉంటే దీనిపై వెంటనే సిబీఐ విచారణ జరిపించాలన్నారు. అటు జాబ్ క్యాలెండర్ రాక, ఇటు ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో ఉన్న యువత….తాజా అక్రమాలతో పూర్తిగా నిస్తృహలోకి వెళ్లే ప్రమాదం ఉంది అన్నారు. లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని, వారి ఆశలను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు

LEAVE A RESPONSE