– రాహుల్ కి చేదుగా అనిపించిన సీబీఐ, రేవంత్ కు మాత్రం ముద్దొస్తుందా ?
– సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టే కుతంత్రం
– గోదావరి జలాలను మొత్తంగా ఆంధ్రకు తరలించుకునేందుకు బాబు , మోడీలతో కలిసి రేవంత్ కుట్ర
– కేంద్ర దర్యాప్తు సంస్థల పై కాంగ్రెస్ అగ్రనాయకత్వంది ఒక తీరు-ఆ పార్టీ సిఎంది మరొక తీరు
– రేవంత్ మీద ఈగవాలకుండా బీజేపీ ప్రభుత్వం కాపాడుతుంది
– కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడగ్గానే సీబీఐ విచారణకు రేవంత్ ఒప్పుకున్నాడు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: కాళేశ్వరం విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోడీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆరోపించారు. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదన్న కేటీఆర్, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు.
తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ లను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మోడీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని కేటీఆర్ మండిపడ్డారు.
కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమే అన్న కేటీఆర్, సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్ 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే. రేవంత్ మాత్రం మోడీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ, రేవంత్ కు మాత్రం ముద్దొస్తుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరగానే సిబిఐకి అప్ప చెప్పడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా చరిత్ర సృష్టించిన కేసీఆర్ మీద విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ, రాక్షస ఆలోచనతో రేవంత్ ఉన్నాడని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
గతంలో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ కుప్పకూలినప్పుడు, సుంకిశాలలో సైడ్ వాల్ కూలితే, వట్టెం పంప్ హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పుడు రాని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) , మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకలోని రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్న సంగతిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
పద్నాలుగేళ్ల ఉద్యమంలో, పదేళ్లు ప్రగతి ప్రస్థానంలో, రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందన్నారు కేటీఆర్. సీబీఐ కే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు.
బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. న్యాయస్థానాల పైన తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్న కేటీఆర్, అక్కడ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. బెదిరింపులు, కేసులు తమకు కొత్త కాదన్న కేటీఆర్, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు.