– ఒక సమకాలీన సంస్కర్త జీవన పయనంలో చిరస్మరణీయ మైలురాయి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తన (2025, ఏప్రిల్ 20) 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ మనస్సు మాత్రం రాష్ట్రం కోసం ఆలోచిస్తూనే ఉంటుంది. నిజానికి ఇది కేవలం ఒక రాజకీయవేత్త జీవితగమనం మాత్రమే కాదు—ఆంధ్రప్రదేశ్ పాలనకు దిశానిర్దేశం చేసి, దేశానికి మార్గదర్శకంగా నిలిచిన మహానాయకుడి జన్మదిన సందర్భం.
భవిష్యత్ను ముందుగానే అంచనా వేయగల దూరదృష్టి, పరిపాలనలో ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానంపై స్పష్టమైన అవగాహనతో చంద్రబాబు పాలనా వ్యవహారాలను ఎప్పటి కప్పుడు కొత్త దిశలో నడిపించాలని తపన పడ్డారు.
భారత్లో ఐటీ విప్లవానికి శ్రీకారం
1990 చివర్లో దేశంలో ఐటీ రంగం ప్రారంభ దశలో ఉండగానే, చంద్రబాబు నాయుడు దాని భవిష్యత్తు శక్తిని గుర్తించారు. ఇతరులు సందేహంగా చూస్తున్న సమయంలోనే మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్ లాంటి సంస్థలను హైదరాబాద్కు ఆహ్వానించారు. బిల్ గేట్స్తో ఆయన భేటీ ఫలితంగా మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల తమ మొట్టమొదటి అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.
ఇది హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ పటములోకి నెట్టింది. ఐటీ అభివృద్ధి కోసం కేవలం విధానాలు మాత్రమే రూపొందిస్తే సరిపోదని భావించి, తగిన మౌలిక వసతులు కూడా నిర్మించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సైబరాబాద్కు రూపకల్పన చేశారు. హైటెక్ సిటీ నిర్మాణం ఫలితంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్లో హైదరాబాద్ ప్రథమ శ్రేణి నగరంగా ఎదిగింది.
మౌలిక వసతులే అభివృద్ధికి బలం
అభివృద్ధికి దారితీసే మార్గాలుగా మౌలిక సదుపాయాలను చంద్ర బాబు గుర్తించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలు జాతీయ రహదారుల విస్తరణ, విద్యుత్ రంగంలో సంస్కరణ లతో ఆంధ్ర ప్రదేశ్ లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దారు.
డిజిటల్ పాలనకు మార్గదర్శి
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్న సగటు మనిషి బాధలకు ముగింపు పలుకుతూ ఆనాడే ఈ-సేవా కేంద్రాల ద్వారా సేవలను ప్రజలకు దగ్గర చేశారాయన. 2017లో అమరావతిలో స్థాపించిన “రియల్ టైం గవర్నెన్స్ సెంటర్” ద్వారా డేటా విశ్లేషణతో ఐఓటీ ఆధారంగా పాలనను నడిపే సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ను అత్యాధునిక సాంకేతిక పాలనా పద్ధతుల రాష్ట్రంగా మార్చింది.
అమరావతి కల: ప్రపంచ స్థాయి రాజధాని
2014 విభజన అనంతరం, చంద్రబాబు అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధానిగా రూపొందించే ప్రయత్నం చేశారు. రాజకీయ పరిస్థితుల కారణంగా ఇది ఒక అడుగు వెనక్కి పడినా ప్రస్తుతం ఆ కలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, సాయిల్ హెల్త్ కార్డులు, రియల్ టైం డేటా… “పొలం పిలుస్తోంది” కార్యక్రమంతో రైతులకు నేరుగా సేవలందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేశారు.
నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పథకాలతో ఆంధ్ర ప్రదేశ్ ను గ్రామీణ అభివృద్ధికి కేంద్రంగా నిలిపారు. పెట్టుబడుల ఆహ్వానంతో పరిశ్రమల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సెజ్లు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల ద్వారా ఐటీ, ఫార్మా, సేవల రంగాలను అభివృద్ధి చేశారు. పారదర్శక విధానాలు రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికపై పెట్టాయి.
సంక్షోభాల్లో నాయకత్వ ప్రతిభ
2014 హుదూద్ తుఫాను అనంతర చర్యలు సంక్షోభాల్లో చంద్రబాబు నాయకత్వ ప్రతిభకు ఉదాహరణగా నిలిచాయి. స్వయంగా విశాఖపట్నంలో నివసిస్తూ పునరుద్ధరణను పర్యవేక్షించారు. ఈ తక్షణ ఉపశమన చర్యలు ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచాయి. బుడమేరు వరద కారణంగా విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు చూపిన చొరవ వల్లే ఈ సమస్యకు వేగవంత మైన పరిష్కారం లభించింది. రోజుల తరబడి బెజవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నే రాష్ట్ర సచివాలయంగా చేసుకున్నారు. భాదితులు స్వాంతన చెందాకే చంద్రబాబు సైతం ఇంటి బాట పట్టారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
1999లో టైమ్స్ మ్యాగజైన్ “సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్”గా చంద్రబాబును ఎంపిక చేసింది. బిల్ గేట్స్, టోనీ బ్లేర్ వంటి ప్రముఖులు ఆయన దూర దృష్టిని కొనియాడారు. డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఆయన పాల్గొనటం ద్వారా భారతదేశానికి గౌరవంగా నిలిచారు. పాలిటిక్స్లో టెక్నోక్రాట్ గా గుర్తింపు పొందారు. పారదర్శకత, ఫలితాలపై దృష్టి, సీఈఓ మాదిరి పనితీరుతో ఆయన 21వ శతాబ్దపు నాయకత్వానికి పునర్నిర్వచనం ఇచ్చారు.
వాట్సాప్ గవర్నెన్స్ – అరచేతిలో 200 లకు పైగా ప్రభుత్వ సేవలు
ప్రస్తుతం “మన మిత్ర”గా పేరొందిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 95523 00009 నంబర్కు మెసేజ్ పంపితే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చేలా సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. తండ్రికి తగ్గ తనయుడిగా మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 500పైగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తండ్రి అడుగుజాడలలో పయనిస్తూ భావి ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి లోకేష్ కృషి చేస్తున్నారు.
సమగ్ర అభివృద్ధికి “పి4” మోడల్
“పీపుల్ -పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్ షిప్ ” విధానం ద్వారా సంపన్నులు పేద కుటుంబాలను దత్తత తీసుకొని విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు అందించాలన్న సమష్టి బాధ్యతను ప్రోత్సహించారు. ఇది ప్రపంచ చరిత్ర లోనే ఒక కొత్త విషయం గా చెప్పవచ్చు. అమరావతి డ్రోన్ సమ్మిట్ నూతన సాంకేతికతకు ప్రేరణగా నిలిచింది.
సమ్మిట్లో 5,500 డ్రోన్లతో 5 గిన్నిస్ రికార్డులు నెలకొల్పుతూ రాష్ట్రాన్ని డ్రోన్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేశారు. డిజిటల్ భవిష్యత్తు కోసం గ్లోబల్ భాగస్వామ్యంతో సిబిఎన్ రచించిన వ్యూహం ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ నిర్మాతను మరోసారి అంతర్జాతీయ చిత్ర పటంలో నిలిపింది. గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో డిజిటల్ పరివర్తన కోసం ఒప్పందం చేసుకోవటం కూడా చంద్రబాబు ఆలోచనలకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక రంగంలో ముందంజలో ఉంచే ఈ ఒప్పందం ఏఐ ఆధారిత పాలనకు నాంది పలికింది.
చరిత్రలో నిలిచే వారసత్వం
75ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత మసక బారలేదు. నిత్య నూతన ఆలోచనలు, క్రమశిక్షణ, దూరదృష్టి ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. ముందస్తు ఆలోచించన తో భవిష్యత్తును నిర్మించే నాయకుడిగా ఆయన మరింత ప్రకాశిస్తున్నారు.

(రచయిత రవి కుమార్ బొప్పన సీనియర్ పాత్రికేయుడు, సమాచార విశ్లేషకుడు. రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా, శాసనసభ లో స్పీకర్కు మీడియా లైజన్ అధికారిగా సేవలందించారు.)