పితృస్వామ్య భావజాలం, మూఢ నమ్మకాలు, కుల, మత చాందసవాదులను దాటుకుని దేశంలో, రాష్ట్రంలో మహిళలు విద్య, వైద్య, ఉద్యోగ,ఉపాధి, రాజకీయ, ఆర్ధిక, కళా, సాంస్కృతిక రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థలో కూరుకుపోయి, అనాదిగా అణచివేయబడిన మహిళా లోకానికి కావాల్సింది తగిన ప్రోత్సాహం, భరోసా. స్వతంత్ర భారతావనిలో మహిళలకు ఆర్ధిక స్వాతంత్య్రం, ఆస్తి హక్కు వంటి ప్రాధమిక హక్కులు కల్పించేలా తెలుగుదేశం పార్టీ ఆది నుండీ తోడ్పాటు అందిస్తూనే ఉంది.
పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాల కల్పన
ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళా సమానత్వానికి నాంది పలికారు. అలాగే ఎన్టీఆర్ తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే… దీనికి కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు శాసన సభకు దళిత మహిళను తొలి మహిళా స్పీకరుగా నియమించడం ఒక చరిత్ర.
స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలను రాజకీయాలలో సైతం సగ భాగం చేశారు. ఎన్టీఆర్ మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పితే… తొలిసారిగా మహిళల కోసం ‘రాష్ట్ర మహిళా కమిషన్’ ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది.
మహిళల గురించి చంద్రబాబు గారి ఆలోచనలు ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘మహిళలు మగవాళ్లకంటే ఎందులోనూ తక్కువ కాదు… మహిళలు దైనికైనా సమర్థులు..మహిళలు తలుచు కుంటే ఏదైనా సాధిస్తారు’’ అన్నది అయన ప్రగాఢ విశ్వాసం.
నిజం చెప్పాలంటే అయన మహిళా పక్షపాతి. వందా, రెండు వందల కోసం భర్త వైపు చూసే స్థాయి నుంచి అంతర్జాతీయ యవనికపై ప్రసంగాలు ఇచ్చే స్థాయిలో మహిళలను సగర్వంగా నిలబెట్టాయి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సంస్కరణలు. ఇళ్లలో ఉండే మహిళల్ని రోడ్డెక్కిస్తారా అంటూ ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, ఎంత మంది కుల, మత చాందస వాదులు వ్యతిరేకించినా.. మహిళలు సొంత కాళ్లపై నిలబడినపుడే అసలైన స్వాతంత్య్రం అని పిలుపునిచ్చారు. కుటుంబం బాగుండాలంటే ఆ ఇంట్లోని స్త్రీ ఆర్ధికంగా, రాజకీయంగా, విద్యాపరంగా పురోగతి చెందాల్సిందేనన్నారు.
డ్వాక్రా సంఘాలతో ఆర్ధిక పరిపుష్టి
మహిళలు ఆర్ధిక స్వాతంత్య్రం సాధించేలా డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా సాధికారతతో ఇంటింటినీ, గ్రామగ్రామాన్నీ ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ఆయన ఏర్పాటు చేయించిన ‘డ్వాక్రా’ సంఘాలు తెలుగునాట ఊరూరా ఓ విప్లవాన్ని తీసుకువచ్చాయి. పొదుపు ఉద్యమంలో మహిళలను ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్ది నాడు 4.73 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించారు. ఈ గ్రూపుల్లో ఆనాడే 65.11 లక్షల మంది సభ్యులు ఉండేవారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల్లో సగానికి సమానం. అంటే డ్వాక్రా సంఘాలు ఏ స్థాయిలో విజయవంతం అయ్యాయో చూడండి. వీరి కోసం మండల స్థాయిలో 350 మహిళా బ్యాంకులు పనిచేసేవి.
పాతికేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించబడిన డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో మహోన్నతమైన ఆర్ధిక, మానవ శక్తిగా మారింది. డ్వాక్రాలో కోటి మందికి పైగా సభ్యత్వంతో బలమైన ఆర్ధిక వ్యవస్థకు పునాదులేశారు. మహిళల ఆర్ధిక స్వాతంత్య్రం, స్వావలంబన కోసం నెలకొల్పిన డ్వాక్రా సంఘాలు రెండున్నర దశాబ్దాలుగా లక్షల కుటుంబాలకు అండగా నిలిచాయి.
1997 సంవత్సరం “మహిళాభివృద్ది ప్రత్యేక సంవత్సరం”
‘లింగ వివక్ష లేని సామాజిక న్యాయం’ నినాదంతో 1997 సంవత్సరాన్ని ‘మహిళాభివృద్ది ప్రత్యేక సంవత్సరం’గా ప్రకటించి పలు కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ శాఖలన్నింటా అభివృద్ధి కోసం చేసే ఖర్చులో మూడవ వంతు మహిళల కోసం ఖర్చు చేయాలన్న నిబంధన పెట్టారంటే మహిళాభ్యుదయం పట్ల చంద్రబాబుకు ఎంతటి నిబద్ధత ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్య, ఉపాధి రంగాలలో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు చంద్రబాబు. అదే సమయంలో డీఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడంతో మహిళలకు విరివిగా ఉద్యోగాలు వచ్చాయి. ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రతి పది మంది మహిళా టీచర్లలో ఆరుగురు నాడు చంద్రబాబు హయాంలో ఎంపికైనవారే.
అప్పట్లో కట్టెల పొయ్యి పై వంట చేస్తూ మహిళలు అనేక ప్ర
దకరమైన వ్యాధుల బారిన పడేవారు. ఆ పరిస్థితి నుండి మహిళలను కాపాడేందుకు ‘దీపం’ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదింటి మహిళలకు ఆ రోజుల్లోనే 32,68,675 గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు చంద్రబాబునాయుడు గారు. నేడు దీపం-2 పధకంతో ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు.
డ్వాక్రా రుణమాఫీకి హామీ ఇచ్చిన చంద్రబాబు గారు తాను నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే హామీకి కార్యరూపం ఇచ్చారు. రుణమాఫీ ద్వారా కేవలం ఋణం తీసుకున్నవారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది కాబట్టి… స్వయం సహాయక బృందాలలోని సభ్యులందరికీ ప్రయోజనం కలిగేలా… ‘చేయూత’ పేరుతో రూ.8,604.3 కోట్లతో 86,04,304 మంది మహిళా సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం కింద అందజేశారు. మళ్ళీ రెండో విడత కింద ‘పసుపు-కుంకుమ’ పేరుతో రూ.9,794.20 కోట్లతో 97,94,202 మంది ఆడపడుచులకు మళ్ళీ రూ.10 వేలు ఇచ్చారు. ఈ రకంగా ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి మొత్తం రూ.20 వేల రూపాయలను అందించి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ మహిళ సాధికారత సంస్థ ఏర్పాటు చేసి మహిళల అభివృధ్ధికోసం ‘స్త్రీనిధి’ ఏర్పాటు చేసారు.
మహిళల ఆరోగ్యానికి రక్షగా
మాతాశిశు మరణాలు తగ్గించే దిశగా తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ‘అన్న అమృతహస్తం’ ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారం అందించారు. గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార బుట్టలను అందజేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ‘తల్లీబిడ్డ చల్లగా’ పథకంలో నగర ప్రాంతాల్లోని గర్భిణులకు రూ.5500, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.6000 ప్రత్యేకంగా అందించారు. ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలో ప్రసవ మరణాలు చాలావరకు తగ్గాయి.
ఏజెన్సీలు, మారుమూల గ్రామాల్లో ఉండే బాలింతలు ప్రసవానంతరం బిడ్డను తీసుకుని ఇళ్లకు వెళ్లాలంటే నానా యాతన పడేవారు. ఈ సమస్యను అధిగమించి వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో వాహనాలను అందుబాటులో ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం శిశువుల కోసం రూ.773 విలువైన ఎన్టీఆర్ బేబి కిట్ అందించారు.
మహిళల ఆరోగ్యానికి రక్షగా 35 ఏళ్లు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ పేరిట 11 రకాల ‘ఉచిత వైద్య పరీక్షలు’ చేయించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేయించారు. 1997లో బాలికాశిశు సంరక్షణ పథకం ద్వారా ఆడపిల్ల పుడితే ఆ పిల్ల పేరున రూ.5వేలు బ్యాంకు అకౌంట్లో వేసి వారి వృద్ధికి నాంది పలికారు. మహిళల పేరుతో ఆస్తి ఉంటె వారికి భరోసాగా ఉంటుందని పేదల కోసం నిర్మించిన లక్షల కొద్దీ ఇళ్లను ఇంటి మహిళల పేరు మీద ఇచ్చారు.
విద్యా, ఉద్యోగాలలో మహిళలకు అండగా
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజులకు పెంచడమే కాకుండా అదనంగా ఐదు రోజుల స్పెషల్ క్యాజువల్ లీవులను ఇచ్చింది కూడా చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే. ‘వితంతు పింఛన్ల’తో వితంతు మహిళలకు ఆర్ధిక భరోసా కల్పించారు. మహిళల్లో విద్యావ్యాప్తికి సరైన రవాణా సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి ‘బడికొస్తా’ పథకం ద్వారా చదువుకుంటున్న పేద బాలికలకు 5.63 లక్షల సైకిళ్లు పంపిణీ చేశారు.
బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్య కారణం యుక్త వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులపై వారికి సరైన అవగాహన లేకపోవడమే. అందుకోసం 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో చదువుతున్న 15.96 లక్షల మంది బాలికలే కాకుండా… బడి బయట ఉన్న 2.60 లక్షల మంది బాలికలకు ‘కిశోరి వికాసం’ కార్యక్రమం కింద ప్రత్యేక శిక్షణ ఇప్పించింది చంద్రన్న ప్రభుత్వం. సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రాసన వంటి కార్యక్రమాలను నిర్వహించి మాతా శిశు సంరక్షణపై అవగాహన కలిగించారు.
సంపద సృష్టిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు వారిని వివిధ వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాల వైపు ప్రోత్సహించారు. చిల్లర దుకాణాలు, కుట్టు శిక్షణ, అగరబత్తీలు, పామాయిల్ తదితర చిన్నపాటి వ్యాపారాల వైపు నడిపిస్తూనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం చీరలు, పూతరేకులు, చెక్క బొమ్మలు, పిల్లల ఆట బొమ్మల తయారీలో భాగస్వాములను చేసింది. 2,66,231 మంది మహిళలు వివిధ ఉత్పత్తుల తయారీలో భాగస్వాములయ్యారు. వీటిలో ప్రాచుర్యం కలిగిన 2,500 ఉత్పత్తులను ఆన్లైన్లో పెట్టి అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. వీటితో పాటుగా ఉన్నత విద్య, ఐటీ రంగాలలో సైతం మహిళలకు గొప్ప అవకాశాలను కల్పించారు.
పేద కుటుంబాలలోని ఆడపిల్లల వివాహానికి సాయంగా ఎస్టీలకు ‘గిరిపుత్రిక కల్యాణ పథకం’ కింద రూ.50వేలు… ‘చంద్రన్న పెళ్ళికానుక’ కింద ఎస్సీలకు రూ.40వేలు… బీసీలకు రూ.35వేలు… ‘దుల్హన్’ పథకం కింద ముస్లింలకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్ర వ్యాపంగా అంగన్వాడీ కేంద్రాల్లో బోధకుల వేతనాన్ని రూ.7,500 నుంచి రూ.10,500కు, ఆయాల వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచారు. అలాగే ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.1,200 నుంచి రూ.3 వేలకు పెంచారు.
మహిళా సాధికారత కోసం భారతదేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒకప్పుడు ఇంటికీ, వంటింటికే పరిమితమైన మహిళలను ప్రగతి బాట పట్టించి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేయడమే కాకుండా… మహిళల ఆత్మగౌరవానికి, మహిళల సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన నేత నారా చంద్రబాబు నాయుడు.
రానున్న ఏడాదికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా, ఎస్హెచ్జీలకు రూ.65వేల కోట్ల రుణాలు ఇప్పించడం ద్వారా లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రపంచ స్థాయిలో తెలుగు మహిళ మెరిసి మురవాలని ఆశిద్దాం.
– సౌజన్య
అనలిస్టు