అమరావతి లాండ్ పూలింగ్ పై పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

-అమరావతి లాండ్ పూలింగ్ పై ప్రొఫెసర్ పొదిలి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి:-ఎపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంపై రాసిన పుస్తకాన్ని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ పొదిలి వెంకటేశ్వరరావు రెండేళ్ల పరిశోధన చేసిన రాసిన ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ స్కీం ఆన్ ఇండస్ట్రియల్, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్నిచంద్రబాబు ఆవిష్కరించారు.

ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ మోడల్ గా ల్యాండ్ పూలింగ్ ఎలా నిలిచింది అనే అంశంపై వెంకటేశ్వరరావు పరిశోధన చేశారు. ఆ పరిశోధన నివేదికను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ అమోదించడంతో వెంకటేశ్వరరావు పుస్తకంగా

తీసుకువచ్చారు. లాండ్ పూలింగ్ విధానం వల్ల కలిగే లాభాలు, సమాజంలో జరిగే అభివృద్ది, ప్రభావం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పుస్తకం రాశారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ ల్యాండ్ పూలింగ్ పై రీసెర్చ్ కు వెంకటేశ్వరావుకు 6.5 లక్షల రూపాయాలు చెల్లించింది.

లాండ్ పూలింగ్ ప్రయోజనాలపై లోతైన విశ్లేషణతో ఈ పుస్తకం రాశానని….ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సక్సెస్ మోడల్ అని అన్నారు. ఈ మోడల్ ను అందరికీ అందుబాటులో తీసుకురావాలని పుస్తక రూపంలో తెచ్చినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం వారి జీవన ప్రమాణాలు ఎలా మార్చేస్తుంది…రాజధాని మాస్టర్ ప్లాన్ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది పుస్తకంలో వివరించినట్లు తెలిపారు.

సమగ్ర పరిశోధనతో పుస్తకం రాసిన పొదిలి వెంకటేశ్వరరావును చంద్రబాబు అభినందించారు. నాడు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అతిపెద్ద ప్రాజెక్ట్ ను ఎలా చేపట్టిందీ గుర్తు చేశారు. అనుకున్న విధంగా రాజధాని పూర్తి అయ్యి ఉంటే….ఇప్పటికే ఆ ఫలాలు రాష్ట్రానికి దక్కేవని చంద్రబాబు అన్నారు.

Leave a Reply